ETV Bharat / city

Farmers' Debts: రుణ ఊబిలోనే రైతు కుటుంబాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందంటే

author img

By

Published : Sep 12, 2021, 4:56 AM IST

దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి తెలంగాణలో 91%, ఏపీలో 93% రైతు కుటుంబాలు రుణ ఊబిలో చిక్కుకుపోయాయి. తెలంగాణలో ఒక కుటుంబం సగటు రుణం రూ.1,52,113గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,45,554గా ఉంది.

Farmers' Debts
Farmers' Debts

దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు రూ.74,121కి చేరింది. 2013నాటి రూ.47వేలతో పోలిస్తే ఇది 57% అధికం. అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51.9% నుంచి 50.2%కి తగ్గినా, సగటు అప్పు మాత్రం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తాజా సర్వే నివేదిక తేల్చింది. తెలంగాణలో 91.7% రైతు కుటుంబాలు రుణపాశంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉంది. సగటున ఒక్కో రైతు కుటుంబంపై అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో కేరళ (రూ.2,42,482), పంజాబ్‌ (రూ.2,03,249) ఉన్నాయి.

ఐదో స్థానంలో తెలంగాణ..

ఈ విషయంలో మాత్రం తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. దేశంలో సగటున 69.6% రైతు కుటుంబాలకు సంస్థాగత రుణాలు అందుతుండగా, ఇలాంటి రుణాలు ఏపీలో 49.6%, తెలంగాణలో 42.5% మందికే అందాయి. దానివల్ల వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

అత్యధికంగా తెలంగాణలో..

ఏపీలో వ్యవసాయ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నవారు 31.1% ఉండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవారు 15.4% మంది ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి రుణం ఇచ్చేవారి నుంచి 9.1% మంది తీసుకోగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41.3% మంది రుణాలు అందుకున్నారు. ఇలా తీసుకునేవారి సంఖ్య దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఉంది. వాణిజ్య బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5% కుటుంబాలకు రుణాలు అందుతుండగా, ఏపీలో అది 34.1%, తెలంగాణలో 24.8%కే పరిమితమైంది.

అత్యధిక అప్పులు ఆ రాష్ట్రాల వారివే..

దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల్లో కేవలం 57.5% మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఏపీలో 60.3%, తెలంగాణలో 63% మొత్తాన్ని వ్యవసాయం కోసమే ఉయోగిస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అత్యధిక అప్పుల్లో కూరుకుపోయింది దక్షిణాది రైతు కుటుంబాలే. జాతీయ సగటు అప్పు రూ.74,121తో పోలిస్తే ఏపీలోని ఒక్కో కుటుంబంపై 221%, తెలంగాణలోని కుటుంబంపై 105% అధిక అప్పు ఉంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఇవీ చూడండి: కస్టమ్స్​ సుంకం తగ్గింపు.. దిగిరానున్న వంట నూనె ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.