ETV Bharat / city

బడ్జెట్ సమావేశంలో భజనకే ప్రాధాన్యత ఇచ్చారు: లోకేశ్

author img

By

Published : May 21, 2021, 12:00 AM IST

ఏపీ బడ్జెట్ సమావేశంలో ప్రజల సమస్యలు విస్మరించి భజనకే ప్రాధాన్యమిచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్‌ తనకు ప్రాణాలు విలువ బాగా తెలుసని అసెంబ్లీలో చెప్పటం అతి పెద్ద జోక్​ అంటూ లోకేశ్​ ఎద్దేవా చేశారు.

nara lokesh fires on ap government
nara lokesh fires on ap government

కొవిడ్ నియంత్రణ‌కు కేంద్రం ఇచ్చిన నిధులు మింగేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్‌ తనకు ప్రాణాలు విలువ బాగా తెలుసని అసెంబ్లీలో చెప్పటం అతి పెద్ద జోక్​ అంటూ లోకేశ్​ ఎద్దేవా చేశారు. సొంత బాబాయికే పాపం ఆ విషయం తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాణాలు విలువ అంతగా తెలిసిన వారైతే మాస్క్ పెట్టుకుని ప్రజ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచేవారన్నారు. ఆరు నెల‌ల్లో ఒక్కసారైనా అసెంబ్లీ నిర్వహించ‌క‌పోతే ప్రభుత్వ మ‌నుగ‌డ‌కు ప్రమాదం కాబట్టే ఒక్కరోజు నామ‌మాత్రపు అసెంబ్లీ నిర్వహించారని మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కొవిడ్ రోగుల కోసం 150కి పైగా ల్యాబ్​లు ఉంటే ఫలితం కోసం వారం రోజులు ఎందుకు వేచిచూడాల్సి వస్తుందో స‌మాధానం చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్‌ చేశారు. కొవిడ్ రోగుల కోసం 47 వేల పడకలు అందుబాటులో ఉంటే ఆస్పత్రి ఆవ‌ర‌ణ‌లోనే రోజూ ప‌దుల‌ సంఖ్యలో ఎందుకు చ‌నిపోతున్నారన్నారని నిలదీశారు. ఆక్సిజ‌న్ కొర‌త లేకుంటే విజ‌య‌న‌గ‌రం, రుయా, అనంత‌పురం ఆస్పత్రుల‌లో క‌రోనా రోగులు ఎలా చ‌నిపోయారో చెప్పాలన్నారు. సకాలంలో వ్యాక్సిన్‌కి ఆర్డర్లు పెట్టకుండా చంద్రబాబు పైన ఏడిస్తే ఏం ప్రయోజ‌నమని మండిపడ్డారు. సీబీఐ కేసులకు భయపడి ఏపీకి రావాల్సిన వ్యాక్సిన్ కోటాని అడ‌గ‌లేక చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

వ్యాక్సిన్ కొనుగోళ్లకు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని లోకేశ్ దుయ్యబట్టారు. నాలుగు బిల్డింగ్​లు కడితే అభివృద్ధి కాదన్న జ‌గ‌న్‌రెడ్డి.. నాలుగు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించ‌టం అభివృద్ధిగా భావిస్తున్నారా? అని నిలదీశారు. క‌మీష‌న్ల దెబ్బకు ఏపీలో ఒక రోడ్డు వేసేందుకు ఎవరూ టెండర్లు వేయకుంటే... వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా కోసం వేసిన గ్లోబ‌ల్ టెండ‌ర్లకు ఇంకెవ‌రు వ‌స్తారన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఆర్భాటంగా ఏర్పాటు చేసిన‌ 56 బీసీ కార్పొరేషన్ల‌కు నిధుల ప్రస్తావ‌న బ‌డ్జెట్‌లో లేదన్నారు. ఏపీలో 100 కిలోమీటర్ల రోడ్డు వేశామని కూడా చెప్పుకోలేకపోవటం సిగ్గుచేటని లోకేశ్ విమర్శించారు. రెండేళ్లలో 28 లక్షల ఇళ్ల నిర్మాణం ల‌క్ష్యమ‌ని చెప్పి.. 10 శాతం నిధులే కేటాయించారని మండిపడ్డారు.

ఇవీచూడండి: యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్: జనార్దన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.