ETV Bharat / city

'ఏపీ అప్పులు రూ. 7.88 లక్షల కోట్లు'

author img

By

Published : May 18, 2022, 8:20 AM IST

MP Raghurama letter
MP Raghurama letter

MP Raghurama Letter on Debits: ఏపీ ప్రభుత్వ అప్పులు రూ. 7 లక్షల 88 వేల 837 కోట్లకు చేరాయంటూ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కంప్ట్రోలర్‌ & ఆడిటర్‌ జనరల్‌కూ పంపారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏపీ రుణపరిమితి నిర్ధారించేలా చూడాలని లేఖలో కోరారు.

ఏపీలో ప్రభుత్వ అప్పులు ప్రస్తుతం రూ.7,88,836.58 కోట్లకు చేరాయని ఎంపీ రఘురామకృష్ణరాజు విజయవాడలోని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని ప్రతిని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ గిరీష్‌ చంద్ర ముర్మూకూ ఆయన పంపారు. తాను పంపిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర రుణ పరిమితి నిర్ధారించేలా చూడాలని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం 12పేజీల లేఖ రాశారు.

"ఏపీ ప్రభుత్వం తన బడ్జెటేతర రుణాలను దాచిపెట్టి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.70వేల కోట్ల రుణ పరిమితి కోసం కేంద్ర ఆర్థికశాఖతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ రుణ పరిమితి సాధించుకోవడానికి, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి బడ్జెటేతర రుణాలు తెచ్చుకోవడానికి గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పుస్తకాల్లో రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని వెల్లడించడం లేదు. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వివరాలను ఇస్తే దాని రుణ పరిమితిపై దెబ్బపడుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు/కార్పొరేషన్లు/సొసైటీల ద్వారా తీసుకున్న అప్పుల లెక్కలు ఇవ్వదు. అందుకే ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర అప్పులను నేను ఈ లేఖతో పాటు జత చేస్తున్నాను. మీరు ఈ లెక్కలను అప్పులు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో తనిఖీ చేసుకోవచ్చు. అప్పుడు బడ్జెటేతర రుణాలపై పూర్తి స్పష్టత వస్తుంది" - రఘురామకృష్ణరాజు, ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌డీపీని ఎక్కువగా అంచనా వేసి చూపడంతోపాటు, తాను తీసుకున్న రుణాలను తక్కువ చేసి చూపి గత మూడేళ్లుగా బహిరంగ మార్కెట్‌ నుంచి అర్హతకు మించి రుణాలను తీసుకుంది.

  • రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని కార్పొరేషన్ల ద్వారా రూ.2లక్షల కోట్లకుపైగా అప్పు చేసింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 1934లోని సెక్షన్‌ 21-ఎ(బి), ఏపీఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని క్లాజ్‌ 2(1) ప్రకారం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ రుణాల కిందకే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు /కార్పొరేషన్లు/ సొసైటీలు తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. వాటిని బడ్జెట్‌ బయట చూపెట్టారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అన్ని రకాల అవసరాలను బడ్జెట్‌తోపాటు, రాష్ట్రం తాను నేరుగా బహిరంగ మార్కెట్‌ నుంచి చేసే రుణాల ద్వారానే తీర్చుకోవాలి తప్పితే బడ్జెటేతర రుణాలతోపాటు, రహస్యంగా తీసుకునే అప్పులపై ఆధారపడకూడదు.
  • రాష్ట్రం ఏర్పాటు చేసిన ఎస్క్రో మెకానిజంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రస్తుతం తటపటాయిస్తున్నాయి. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 266(1)కి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల మద్యం ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు చేరకముందే బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లిస్తూ 2022 ఫిబ్రవరి 26న 9/2022 చట్టం తీసుకొచ్చింది. మద్యం వినియోగం అన్నది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోని లిస్టు-2 కింద ఉన్న ఐటం నం.51(ఎ)కిందికి వస్తుంది. దానిపై సుంకాలు, వ్యాట్‌, ట్రేడ్‌ మార్జిన్‌, ప్రివిలేజ్‌ ఫీ, ఇతర పన్నులు విధించే ప్రత్యేక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందువల్ల మద్యంపై వచ్చే ఆదాయం తప్పనిసరిగా సంఘటిత నిధికే చేరాలి తప్పితే కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు వెళ్లడానికి వీల్లేదు.
  • రాష్ట్ర ప్రభుత్వం కోసం పనులు, సేవలు చేసిన, వస్తువులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన రూ.1,50,000 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించారు. గత రెండున్నరేళ్లుగా వీటిని చెల్లించడం లేదు. ముందుగా వచ్చిన బిల్లులను తొలుత చెల్లించాలన్న నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. చట్టబద్ధంగా చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకుండా ఆ మొత్తాన్ని నిలుపుదల చేయడం అన్నది చట్టవిరుద్ధం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి వ్యతిరేకం’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.