ETV Bharat / city

'2024 పార్లమెంట్​ ఎన్నికలే మా లక్ష్యం.. కంటెంట్, కటౌట్ ఉన్న మా పాన్ఇండియా పార్టీకే విజయం'

author img

By

Published : Oct 7, 2022, 7:32 PM IST

KTR
KTR

KTR on BRS Party: రానున్న పార్లమెంట్ ఎన్నికలే భారాస లక్ష్యమన్న కేటీఆర్.. కంటెంట్, కటౌట్ ఉన్న తమ పాన్ ఇండియా పార్టీకి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీని అసమర్థ ప్రధానిగా అభివర్ణించిన కేటీఆర్.. అన్ని బాగోతాలు బయటపెట్టి విలువలు లేని భాజపా వలువలు విప్పుతామని వ్యాఖ్యానించారు. రాహుల్ రాష్ట్రంలో యాత్ర చేస్తున్న సమయంలోనే.. ఒకరిద్దరు తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్​ను వీడతారని, వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీ ఉండబోదని జోస్యం చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమన్న కేటీఆర్.. కాంట్రాక్టర్ బలుపు, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు.

KTR on BRS Party: 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్​లో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించిన కేటీఆర్.. మరోసారి కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. భారత రాష్ట్ర సమితి, మునుగోడు ఉపఎన్నిక సహా పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలిపారు. దేశంలోని పలువురు రాజకీయ నేతలు, రైతులు, ప్రజాసంఘాలు, ఆర్థికవేత్తలతో మాట్లాడాకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు కూడా తమకు తెలుసని కేటీఆర్ అన్నారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో తమకు సానుకూలత ఉందని.. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తామని చెప్పారు.

గోల్ మాల్ గుజరాత్ మోడల్​ను ఎండగట్టడమే వ్యూహమని వెల్లడి.. కేసీఆర్​ను అవహేళన చేసిన వారంతా ఇవాళ చీకట్లో కలిసిపోయారని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం కోసమో, పదవుల కోసమో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని తెలిపారు. మోదీ అండ్ కో వ్యూహాలు, దాడులు, కుట్రలన్నీ తమకు తెలుసన్న ఆయన.. వాటన్నింటినీ ఎదుర్కొంటామని, వారి బాగోతాలను బయటపెడతామని అన్నారు. విలువలు లేని రాజకీయం చేస్తున్న భాజపా వలువలు విప్పుతామని.. వ్యాఖ్యానించారు. ఒక్క భాజపా నాయకుడిపై అయినా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్​ను.. ఎండగట్టడమే తమ వ్యూహమని.. తెలంగాణలో జరుగుతున్న పనిని సమర్థంగా దేశానికి చెబుతామని వివరించారు. ఒకటిన్నర సంవత్సరంలోనే 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తాము చెప్పడం లేదన్న కేటీఆర్.. భాజపా సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు 40 ఏళ్లు పట్టిందని, తమకు అంత సమయం పట్టకపోవచ్చని వ్యాఖ్యానించారు.

కంటెంట్, కటౌట్ ఉన్న తమ పార్టీకే విజయం దక్కుతుంది.. తెలంగాణకు కేసీఆర్ పర్యాయపదమన్న ఆయన... తమది తెలంగాణ పార్టీ అంటారని తెలిపారు. సబ్జెక్ట్ ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా ఎలాగో... భారాస కూడా అలానే అన్న ఆయన... కంటెంట్, కటౌట్ ఉన్న తమ పార్టీకి విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలోనే నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రం.. ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రం.. తెలంగాణ అని కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ ను చూపెట్టి అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లలో ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. మోస్ట్ ఇన్ కాంపీటెంట్ , ఇన్ ఎఫిషియంట్, ప్రచార్ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీని అభివర్ణించారు. దివాళా కోరు, పనికిరాని ప్రధాని జన్ కీ బాత్ వినరు... మన్ కీ బాత్ మాత్రమే చెప్తారని ఎద్దేవా చేశారు.

భారత్ రాష్ట్ర సమితితో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతాం.. 2022 వరకు అందరికి ఇళ్లు ఇస్తామని అన్నారు కానీ... 435 కోట్లతో ప్రధానమంత్రి ఇళ్లు కట్టుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సెప్టెంబర్ 17 లిబరేషన్ డే అయితే.. ఆగస్టు 15 ఎందుకు లిబరేషన్ డే కాదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ భావదారిద్రం కోసం.. చిల్లర నాటకం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. దండయాత్ర చేసినట్టు ఏక్ నాథ్ షిండే, ఇతరులు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అత్యధిక ద్రవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం.. ప్రపంచంలో అత్యధిక గ్యాసు రేటుతో నైజీరియా కంటే దారుణ పరిస్థితుల్లోకి దేశం వెళ్తోందన్న నివేదికలు వస్తున్నాయని.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ విఫలమైందని అన్నారు. భారత్ రాష్ట్ర సమితి రూపంలో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని.. ప్రతి ఒక్కరికీ తాగునీరు, ఉచితంగా కరెంటు అందిస్తామని... దళితులను వ్యాపారవేత్తలు చేస్తామని ప్రకటించారు. 2014లో ముఖ్యమంత్రిగా మోదీ.. దేశవ్యాప్తంగా వంద ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారని, అదే తరహాలో కేసీఆర్ కూడా తెలంగాణ మోడల్​ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని వివరించారు.

వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం లేదు.. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవచ్చని... రాష్ట్రంలో పరిస్థితి, మిషన్ భగీరథ, విద్యుత్, హరితవనాలు లాంటి పథకాలు ఆయనకు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. రాహుల్ ఇక్కడ ఉన్నప్పుడే ఒకరిద్దరు తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్​ను వదిలిపెట్టే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం లేదన్న కేటీఆర్.. అధ్యక్షుడే ఓడిపోయిన పార్టీ గురించి మాట్లాడుకోవడం వృథా అని ఎద్దేవా చేశారు. మునుగోడులో తమకు 30శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అక్కడ తాము గెలిచామని... రెండో స్థానం కోసం కాంగ్రెస్, భాజపా మధ్య గట్టిపోటీ ఉందని చెప్పారు.

కిషన్‌రెడ్డి ఫోన్‌ను ప్రధాని ట్యాప్‌ చేస్తున్నారు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాక రాజగోపాల్ రెడ్డి.. పదవిని పణంగా పెట్టి భాజపాలో చేరారని కేటీఆర్ అన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి చెప్పారని.. ఓటుకు రూ.30 వేలు ఇచ్చైనా గెలుస్తామని చెప్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ బలుపు, మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. హిందూ, ముస్లిం అంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమన్న కేటీఆర్.. ఆయనను కనీసం కౌన్సిలర్‌గా గెలవమని చెప్పండి చూద్దామని వ్యాఖ్యానించారు. తన ఫోన్‌తో సహా పది వేల మందికి పైగా వ్యక్తుల ఫోన్లలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారని.. ఆ విషయం కిషన్ రెడ్డికి తెలియదని కేటీఆర్ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.