ETV Bharat / city

Hyderabad Pubs: పబ్బుల్లో మొదలైన న్యూఇయర్ సంబురం.. కరోనాకు కూడా ఆహ్వానం

author img

By

Published : Dec 28, 2021, 8:46 AM IST

Hyderabad Pubs : ఓవైపు కరోనా మూడో ముప్పు.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సర్కార్ సూచిస్తోంది. అయినా పబ్​ల యాజమాన్యాలు మాత్రం ఈ సూచనలు పెడచెవిన పెట్టి న్యూ ఇయర్ వేడుకలను అప్పుడే మొదలుపెట్టాయి. పరిమితికి మించి లోపలికి అనుమతించడం.. పబ్​లో కరోనా నిబంధనలను గాలికొదిలేయడం.. అర్ధరాత్రి వరకు పబ్​ నిర్వహించడం.. ఇలా నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.

Hyderabad Pubs
Hyderabad Pubs

  • జూబ్లీహిల్స్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారి బంధువుదని చెప్పే పబ్బులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తారు.
  • బేగంపేటలో నిబంధనలను ఉల్లంఘించే మరో కేంద్రాన్ని మూడుసార్లు పోలీసులు మూయించారు. వారం రోజుల్లోనే రాజకీయ ఒత్తిడితో మళ్లీ తెరవడం గమనార్హం.
  • నిబంధనలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సును రద్దు చేయాలి. కానీ కఠిన చర్యలు చేపట్టడంలేదు.
  • తప్పతాగిన వారిని యాజమాన్యాలు ఏర్పాటు చేసిన డ్రైవర్లే ఇంటి వద్ద దిగబెట్టాలి. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల మద్యం మత్తులో వాహనాలు తోలుతూ ప్రమాదాలకు పాల్పడుతున్నారు. భాగ్యనగరంలో ఏటా 800 మంది చనిపోతుంటే మద్యం మత్తులో ఢీకొన్న వారి వల్ల మరణిస్తున్నవారు 600 మందికిపైగా ఉంటున్నారు.

అప్పుడే సంబురం షురూ..

Hyderabad Pubs : గ్రేటర్‌ హైదరాబాద్​లో క్రమేపీ కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వైద్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నా పబ్‌ల యాజమాన్యాలు మాత్రం సూచనలను యథేచ్ఛగా పెడచెవిన పెడుతున్నాయి. పబ్‌లు అప్పుడే కొత్త సంవత్సర వేడుకలను మొదలుపెట్టేశాయి. పరిమితికి మించి వేలల్లో యువతను లోపలికి అనుమతిస్తున్నాయి. పెద్ద శబ్దాలతో సౌండ్‌ బాక్సులను పెట్టి యువతను జోష్‌లో ముంచుతున్నాయి. కనీస స్థాయిలో కరోనా నిబంధనలను పాటించకపోయినా పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. ఇళ్ల మధ్య నిర్వహిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కొందరు హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో పది వరకు పబ్‌లకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

నేతల అండదండ..

Gatherings at Hyderabad Pubs : కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించడంతోపాటు ఎడం పాటించాలని సర్కారు ఆదేశించింది. పబ్‌ లోపల ఎంత విస్తీర్ణం ఉంది.. ఎంత మందిని అనుమతిస్తే ఎడం పాటించడానికి వీలవుతుందన్న దానిపై పరిశీలన చేసి తదనుగుణంగా ఈ వారం రోజులు టిక్కెట్లు విక్రయించాలి. కానీ పాటించడంలేదు. నిబంధనల ప్రకారం నివాసాల నడుమ పబ్‌లను ఏర్పాటు చేయకూడదు. గ్రేటర్‌లో 50కి పైగా పబ్‌లుంటే దాదాపు 35 వరకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోనే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.36, 45 ప్రాంతాలు మాత్రమే వాణిజ్య ప్రాంతాలు. బల్దియా లెక్క ప్రకారం మిగిలినవన్నీ నివాసిత ప్రాంతాలే. ఇక్కడి కాలనీల్లో ఇళ్ల మధ్యే భవనాలను అద్దెకు తీసుకుని పబ్బులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆదివారం నుంచి గురువారం వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు మిగతా రెండు రోజులు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించవచ్చు. వీటిని ఏ ఒక్కటీ పట్టించుకోవడం లేదు. కొన్నింటిని తెల్లవారుజాము వరకు నిర్వహిస్తున్నారు. అయినా పోలీసులు పెట్టీ కేసులతో సరిపెడుతున్నారు. ఇటీవల కాలంలోనే ఇలాంటివి 150 కేసులు పెట్టారు. రాజకీయ నేతల అండదండలు ఉండడమే ఇందుకు కారణం.

మత్తులో బెదిరింపులు

Hyderabad Pubs Violates Corona Norms : నగరంలోని పబ్‌ల్లో 200-500 మంది వరకు మాత్రమే అనుమతించడానికి అవకాశం ఉంది. నయా సాల్‌ వేడుకలప్పుడు ఏకంగా 2 వేల మందికి పైగానే అనుమతిస్తున్నారు. గత వారం రోజులుగా పబ్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. స్థాయిని బట్టి టిక్కెట్లను రూ.2 వేల నుంచి రూ.20 వేల మధ్య విక్రయిస్తున్నారు. అంతమంది పోగవుతున్నా ఏ ఒక్కరూ మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరానికి మంగళం పాడారు. మత్తులో కౌగిలింతలకు దిగుతున్న కొందరు యువతులను బెదిరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.