Rain effect : బల్దియా, డీఆర్‌ఎఫ్‌ మధ్య సమన్వయలోపం.. భాగ్యనగరవాసుల పాలిట శాపం

author img

By

Published : Sep 7, 2021, 6:44 AM IST

బల్దియా, డీఆర్‌ఎఫ్‌ మధ్య సమన్వయలోపం
బల్దియా, డీఆర్‌ఎఫ్‌ మధ్య సమన్వయలోపం ()

పది రోజులుగా విడవకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భాగ్యనగరం(Rain effect on Hyderabad)లో దాదాపు 250 కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. మూడు లక్షల మంది బాధపడుతున్నారు. వంద చెరువులు నిండుకుండల్లా మారాయి. మరో భారీ వర్షం పడితే ఏ చెరువు కట్ట తెగి మరెన్ని కాలనీలు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. బాధితులకు మేమున్నామన్న భరోసా ఇవ్వాల్సిన జీహెచ్‌ఎంసీకి విపత్తు స్పందన దళం మధ్య తలెత్తిన సమన్వయ లోపం బాధితులకు వాసులకు శాపంగా మారింది.

వరుణ ప్రతాపంతో భాగ్యనగరవాసులు(Rain effect on Hyderabad) తల్లడిల్లుతున్నారు. నగరంలో ఏ వీధి చూసినా వరదే.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాదాపు 250 కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. ఇంకో వాన పడితే ఏ చెరువు కట్ట తెగి ఇంకెన్ని కాలనీలు మునుగుతాయో తెలియని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి.. వారికి సాయం చేయాల్సిన జీహెచ్​ఎంసీ అధికారులు, విపత్తు దళం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.

బల్దియా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పార్టీ పనిపై దిల్లీలో ఉన్నారు. కమిషనర్‌ లోకేష్‌కుమార్‌తోపాటు, జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్లు బాధితులను పలకరించడంలేదు. కీలక పాత్ర పోషించాల్సిన విపత్తు స్పందన దళం(డీఆర్‌ఎఫ్‌) ఘోరంగా విఫలమైంది. ఆ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి బల్దియా కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బాధితులకు బాసటగా నిలవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో బల్దియా ఇంజినీర్లు, పారిశుద్ధ్య విభాగం కొన్ని పనులు మొదలుపెడితే, డీఆర్‌ఎఫ్‌ సొంతగా తమ పని తాము చేస్తోంది.

నిండుకుండల్లా 100 చెరువులు

దాదాపు వంద చెరువులు పూర్తిగా నిండాయి. నీరు దిగువకు వెళ్లే మార్గంలేదు. ఆయా చెరువుల దిగువున వందల కాలనీలకు ముంపు ముప్పు పొంచిఉంది. బల్దియా ఇంజినీర్లు, డీఆర్‌ఎఫ్‌ కలిసి ఆ చెరువుల కట్టలు పటిష్ఠం చేస్తే ప్రభావిత కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉంటారు. కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. ముంపు కాలనీలకు వెళ్లి అవసరార్థులకు ఆహారం, తోడ్పాటు అందించడం లేదు. లక్షలాది మంది బాధితులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకొనేందుకు బల్దియాలో డీఆర్‌ఎఫ్‌ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దీన్ని ఏర్పాటు చేయించారు. సదుద్దేశంతో ఏర్పాటు చేయించిన విభాగం జనాలను ఆదుకోవాల్సిందిపోయి భారంగా మారింది. భారీ వర్షాలు పడుతున్నా ఇప్పటి వరకు బల్దియా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరగలేదు. మరో రెండు మూడు రోజులు నగరంలో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకుని డీఆర్‌ఎఫ్‌ కదిలేలా ఆదేశించాలని కోరుతున్నారు.

నగరంలో నేడూ భారీ వర్షం..!

గ్రేటర్‌ పరిధిలోని మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు(Rain effect on Hyderabad) కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్ల, సర్కిళ్ల అధికారులను బల్దియా అప్రమత్తం చేసింది. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. వరుసగా మూడు రోజులు దంచికొట్టిన వానలు సోమవారం శాంతించాయి. ఖైరతాబాద్‌, నాంపల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. చందూలాల్‌ బారాదరి ప్రాంతంలో అత్యధికంగా 12.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3 రోజులు నగరానికి వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 6 వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో సాధారణం కన్నా 53 శాతం అధికంగా వర్షం పడింది. మేడ్చల్‌లో 32, హైదరాబాద్‌లో 24 శాతం, జీహెచ్‌ఎంసీలో సగటున 23 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. మరోవైపు బేగంపేట నాలా, బుల్కాపూర్‌ నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద చేరుతోంది.

డీఆర్‌ఎఫ్‌ స్వరూపం

బల్దియా నిధులతో ఏర్పాటైన విభాగం

మొత్తం సిబ్బంది 370

సహాయక చర్యల కోసం20 వాహనాలు, 10 బోట్లు.

అత్యవసర వేళల్లో అక్కరకొచ్చేలా అత్యాధునిక పరికరాలు.

కట్ట తెగితే.. మిగిలేది కన్నీరే

జల్‌పల్లి-లక్ష్మీగూడ మార్గంలో పారుతున్న జల్‌పల్లి పెద్దచెరువు నీళ్లు
  • జల్‌పల్లి పెద్దచెరువు నిండింది. జల్‌పల్లి-లక్ష్మీగూడ మార్గంలో నీరు పారుతోంది. చెరువులోకి ఇంకా నీరు చేరితే బుల్‌బుల్‌కుంటలోకి చేరుతుంది. పల్లె చెరువులోకి నీరు చేరితే కట్ట తెగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గత అక్టోబరులో భారీ వర్షాలకు పల్లెచెరువు పొంగి అలీనగర్‌లో 9 మంది చనిపోయారు.
  • జల్‌పల్లి పురపాలికలోని బురాన్‌ఖాన్‌ చెరువు నిండింది. ఉస్మాన్‌నగర్‌ సహా పరిసర నబీల్‌కాలనీ, మెట్రోకాలనీ, వారీస్‌కాలనీ, గ్రీన్‌సిటీలోని 80 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి.
  • మీర్‌పేట పెద్దచెరువు, మంత్రాల చెరువులోకి వరద భారీగా చేరుతోంది. మీర్‌పేట పరిధిలో 12 కాలనీల్లో డ్రైనేజీలు పొంగి రహదారులు వరదనీటిలో ఉన్నాయి.
  • బీఎన్‌రెడ్డినగర్‌లోని కప్రాయ్‌చెరువు, హయత్‌నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరికుంట నిండాయి. తొర్రూర్‌-హయత్‌నగర్‌ రోడ్డుపై ఇంజాపూర్‌ చెరువు నీరు పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఐదారు కాలనీలు ఇప్పటికే నీట మునిగాయి.
  • జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ 29 అడుగులకు చేరువలో ఉంది. ఇది దాటితే ఉమామహేశ్వరకాలనీ మరింత మునుగుతుంది.

ఇదీ చదవండి : Rainfall Warning: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రానికి అత్యంత భారీ వర్షసూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.