ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : ఏపీ సీఎం కాన్వాయ్ ఘటనలో ఇద్దరిపై వేటు

author img

By

Published : Apr 21, 2022, 12:41 PM IST

Updated : Apr 21, 2022, 1:55 PM IST

AP CM Convoy Incident : ఏపీలో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల నుంచి కారు తీసుకున్న ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ఈ ఘటనపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. దీనిపై సీఎంవో స్పందించింది. ఘటనపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​... అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఆర్టీఏ సిబ్బందిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

AP CM Convoy Incident
AP CM Convoy Incident

AP CM Convoy Incident : సీఎం కాన్వాయ్‌ కోసమంటూ.. ఏపీలోని ఒంగోలులో ఆర్టీఏ అధికారులు దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా.. ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది. దీనిపై ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సీఎంవో స్పందించింది. ఏపీ సీఎం జగన్​ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

ఏపీ సీఎం కాన్వాయ్ ఘటనలో ఇద్దరిపై వేటు

అసలేం జరిగిందంటే.. : పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్‌ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీనివాస్ కుంటుంబం.. అవాక్కైంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నడిరోడ్డుపై కారు వదిలేసి దిగిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోలేదు. బలవంతంగా కారును తీసుకెళ్లిపోయారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు..ఒంగోలులో నడిరోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వాహనంలో తిరుమల చేరుకున్న వేముల శ్రీనివాస్‌ కుటుంబం...ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపడ్డారు.

"అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..కొత్త ప్రదేశంలో నడిరోడ్డుపై కాసేపు భయంతో గడిపాం. పిల్లలున్నారని వేడుకున్న ఒప్పుకోలేదు. ప్రజలను ఇబ్బందిపెట్టే ఇలాంటి ఘటనలపై సీఎం దృష్టి సారించాలి. అలిపిరి నుంచి మెట్లపూజతో కాలినడకన తిరుమల వెళ్లాలనుకున్నాం.. ఆర్టీఏ అధికారుల తీరుతో మూడోసారి మెట్లపూజ మొక్కు చెల్లించకుండానే తిరుమల చేరుకున్నాం."

-వేముల శ్రీనివాస్‌

రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం : చంద్రబాబు

సీఎం కాన్వాయ్‌ కోసమంటూ ఇతరుల కారును బలవంతంగా తీసుకెళ్లిన తీరుపై... తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కారు లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకెళ్ళడం దారుణమని ధ్వజమెత్తారు. భార్య, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్లిందని నిలదీశారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే దుకాణాలు మూసెయ్యడం...సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటన్నారు.

కారు స్వాధీనంపై సీఎం కార్యాలయం ఆరా.. ఒంగోలులో కారు స్వాధీనం ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై సీఎంవో అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో...ఇన్నావా వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు... పోలీసులు సమాచారం ఇచ్చారు.

సీఎం ఆగ్రహం.. ఇద్దరిపై వేటు : ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల నుంచి కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి కారణమైన హోంగార్డు పి.తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ ఎ. సంధ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత కథనాలు :

Last Updated : Apr 21, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.