ETV Bharat / city

ఎడతెరపిలేని వర్షాలు.. చిగురుటాకుల్లా వణుకుతున్న దక్షిణ తెలంగాణ జిల్లాలు..

author img

By

Published : Jul 13, 2022, 5:48 PM IST

Tealangana Heavy Rains: వారంరోజులుగా ఏకాధిటి వర్షాలకు దక్షిణ తెలంగాణ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వానలకు పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. చెట్లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

Heavy rains in Telangana south districts
Heavy rains in Telangana south districts

Tealangana Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వానలకు జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తక్‌పురలో పాత రేకుల ఇళ్లు కూలిపోయింది. మెుదట గోడ పడిపోవటంతో అప్రమత్తమైన ఇంటి సభ్యులు బయటకు పరుగులు తీశారు. మేడ్చల్ జిల్లా సూరారంలోనూ ఓ ఇంటి స్లాబ్ కూలింది. ఆ సమయంలో నిద్రిస్తున్న వారి పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. నెహ్రు జూ లాజికల్ పార్కులో భారీగా వరద నీరు చేరింది. మీర్‌ ఆలం చెరువు నిండిపోవటంతో... సఫారీ పార్క్‌ మీదుగా ప్రవాహం మూసిలోకి వెళ్తోంది. దీంతో సఫారీ పార్క్‌ను మూసివేశారు. నీరు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

మలక్‌పేటలోని నల్గొండ క్రాస్‌ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. రహదారికి అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్‌లోని రామ్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ , విద్యానగర్ ప్రాంతాల్లోని అనేక విధుల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్, టెలిఫోన్ తీగలపై పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నగరంలో ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్​ఎంసీ హెచ్చరించింది. చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందునా...వృక్షాల కింద నిలబడొద్దని సూచించింది. డీఆర్​ఎఫ్​ బృందాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

వరుసగా రోజుల తరబడి వర్షాలు పడుతున్న దృష్ట్యా... హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలపై జీహెచ్​ఎంసీ ఫోకస్ పెట్టింది. నగరంలో మొత్తం 524 భవనాలను గుర్తించారు. రెండ్రోజుల్లో 45 ఇళ్లు కూల్చివేశామని....మరో 78 సీజ్ చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు మెుత్తం 185 పాత ఇళ్లను తొలగించామని....300 భవనాలను ఖాళీ చేయించామని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలకు... వాగులు పొంగి ప్రవహిసిస్తున్నాయి. దీంతో కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో రాయరావు చెరువు ప్రధాన వనరు పంది వాగు వరదనీరుతో పోటెత్తింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.