ETV Bharat / city

Dharani Portal : ధరణి పోర్టల్‌తో అయిదేళ్లుగా అవస్థలు

author img

By

Published : Apr 25, 2022, 8:56 AM IST

Dharani Portal
Dharani Portal

Dharani Portal : చేతిలోనే సాగు భూమి ఉన్నా హక్కులు మాత్రం లేవు. ఏటా పంట వస్తున్నా రైతుబంధు, బీమా అందడం లేదు. అవసరానికి విక్రయించుకోనూ వీలులేదు. ఇలా మూడున్నర లక్షల మందికి పైగా రైతులు హక్కులు లేక అవస్థ పడుతున్నారు. వివాద జాబితాలో చేర్చిన పది లక్షల ఎకరాల భూమికి కూడా స్పష్టత లేక బాధితులు ఆగమైపోతున్నారు. అయిదేళ్లుగా తహసీల్దారు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు తిరుగుతూనే ఉన్నారు. ధరణి పోర్టల్‌నూ వదలడం లేదు. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లకు వస్తున్న అర్జీలలో నలభై నుంచి యాభై శాతం వరకు భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి.

Dharani Portal : 2017 సెప్టెంబరు అనంతరం రాష్ట్రంలో చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సరిచేయకుండానే ధరణిలోకి ఎక్కించడం, కొన్నింటిని వదిలివేయడం రైతులకు శాపంగా మారింది. వీఆర్వోల వల్ల సమస్య ఉత్పన్నమైందని ఆ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వీటి పరిష్కారంలో మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 72 లక్షల భూ ఖాతాలుండగా 61.30 లక్షల వ్యవసాయ ఖాతాల సమాచారం స్పష్టంగా ఉందని రెవెన్యూశాఖ గుర్తించింది. ఇవికాక మరో మూడున్నర లక్షల ఖాతాలు ధరణిలోకి ఎక్కాల్సి ఉంది. ధరణిలో నిక్షిప్తమైన పాసుపుస్తకాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా తప్పులున్నాయి. వాటిని కూడా సరిచేయడం లేదని బాధితులు వాపోతున్నారు.

.

ఇలాంటి సమస్యలెన్నో... ములుగు జిల్లా ఇంచెర్లకు చెందిన ప్రభాకర్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉండగా ఎకరంన్నర విస్తీర్ణం కొత్తపాసుపుస్తకంలోకి ఎక్కలేదు.

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం లింగోజీగూడ తండాకు చెందిన రత్నమ్మకు 31 సర్వే నంబరులో ఉన్న 0.25 ఎకరాలకు బదులు 0.07 ఎకరాలుగా నమోదు చేసి కొత్త పాసుపుస్తకం ఇచ్చారు. పొలం సాగు చేసుకుంటున్నా హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం బోర్నపల్లికి చెందిన ఎం.ఆంజనేయులుకు తండ్రి మల్లేశంకు చెందిన 0.20 ఎకరాల పట్టా వ్యవసాయ భూమి వారసత్వ బదిలీ కింద రావాల్సి ఉంది. కానీ, వ్యవసాయేతర భూమిగా మార్చారనే ఐచ్ఛికం కింద చేర్చి పాసుపుస్తకం ఇవ్వడం లేదు.

అమలుకాని మంత్రివర్గ ఉప సంఘ సిఫార్సులు.. భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రెవెన్యూశాఖకు సూచించింది. దీంతోపాటు దాదాపు 40 సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలను సూచిస్తూ రూపొందించిన నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించింది. మొదట ఎనిమిది మాడ్యూళ్లు ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సిఫార్సుల్లో పేర్కొంది. నాలుగు నెలలు గడిచినా కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సమస్యపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.