ETV Bharat / city

FAKE CHALLANS: నకిలీ చలానాల వ్యవహారం..అన్ని శాఖల్లోనూ అధికారుల తనిఖీలు

author img

By

Published : Sep 3, 2021, 4:23 PM IST

ఏపీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ శాఖలో ఇప్పటికే అంతర్గత తనిఖీలు ప్రారంభించిన అధికారులు.. మిగిలిన శాఖల్లోనూ తనిఖీలు ప్రారంభించారు.

FAKE CHALLANS
FAKE CHALLANS

ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో.. మిగతా శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. చలానాల ద్వారా చెల్లించే నగదు జమపై విచారణ చేపట్టింది. సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత విచారణ ప్రారంభమైంది.

ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో అధికారులు.. జాప్యాన్ని గుర్తించారు. జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు గుర్తించారు. రూ.8.13 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మొత్తం రూ.4.62 కోట్ల మేర అధికారులు రికవరీ చేశారు. 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ ఖజానాకు గండి..

నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం ఏపీ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో 2018 నుంచి ఆన్​లైన్ ద్వారా అప్​లోడ్ చేసిన చలానాలను పరిశీలించిన అధికారులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో మోసం జరిగినట్లు గుర్తించారు.

కోట్లాది రూపాయలకు పైగా గండి...

కడప జిల్లాలో మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం..ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రైటర్స్‌గా పనిచేసిన వ్యక్తులే ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని తేల్చిన పోలీసులు.. కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించారు.

వెసులుబాటును అవకాశంగా మలుచుకుని...

ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎంఎఫ్ఎస్ విధానం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ విధానంలో కంప్యూటర్‌ ద్వారా వచ్చే చలానాలపై అధికారుల ధ్రువీకరణ సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇది మొదటి లోపంగా మారింది. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్‌ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్‌ చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమార్కులు వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీచూడండి: Tollywood Drugs Case: నటి రకుల్‌ను 6 గంటలుగా విచారిస్తున్న ఈడీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.