ETV Bharat / city

రాష్ట్రాలను టీకాలు సమీకరించుకోమనటం కేంద్రం తప్పే: జేపీ

author img

By

Published : May 30, 2021, 5:35 AM IST

‘‘అయిదారు దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాల వైఫల్యాలను కరోనా ఎత్తిచూపింది. నిర్లక్ష్యమే కొంప ముంచింది. పేలవమైన వైద్య వ్యవస్థలో లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఓట్లు రాల్చే అంశాలపైనే ప్రభుత్వాలకు శ్రద్ధ. ప్రజలకు మేలు చేసే విధానాలు పట్టవు. బలమైన ఆరోగ్య వ్యవస్థ అవసరం. ఇందుకు ఏటా రూ.లక్షన్నర కోట్లు వెచ్చించాలి. జాతీయ ఆదాయంలో ఆరోగ్య రంగంపై చేస్తున్న ఖర్చు ఒక్క శాతమే. వ్యాక్సిన్ల విషయంలో జాతీయ విధానమే సరైనది. ఎన్నికల నిర్వహణలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవటంలో ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టాల్సిందే. చైనా విధానాలతో విసిగిన దేశాలను భారత్‌ ఆకర్షించాలి. అసంఘటిత రంగాన్ని ఆదుకునేందుకు పెద్దపీట వేయాలి’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ‘ఈనాడు- ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

loksatta chief dr. jayaprakash narayana
లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ

ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారంటే మనకు ఏమీ కాదులే అన్న భరోసానే. చివరకు ఏమైంది? ఆక్సిజన్‌, పడకల కొరత విషయంలోనూ అప్రమత్తం కాలేదు. ఫలితాన్ని చూస్తున్నాం. మన దేశంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే శక్తి ఉంది. ఇలాంటి అరుదైన సందర్భాల్లో ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. మార్కెటింగ్‌ లేక నష్టం వచ్చినా భరిస్తామని భరోసా ఇవ్వాలి. ఎన్ని రకాలుగా మొత్తుకున్నా ప్రభుత్వం సమయానికి, సానుకూలంగా స్పందించలేదు. - డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, లొక్‌సత్తా వ్యవస్థాపకులు.

ప్రశ్న: దేశంలో ఇంతటి దయనీయ స్థితికి కారణాలు ఏమిటి?

దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు వైద్య రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయి. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాం. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లుగా, స్విచ్‌ వేస్తే లైటు వెలిగినట్లుగా వైద్యం ఒక్కసారిగా అందుబాటులోకి రాదు. వ్యూహాత్మకంగా వైద్య రంగాన్ని పటిష్టం చేసుకుంటూ రావాలి.

ప్రశ్న: కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో విఫలమయ్యామంటారా?

ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవటం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకపోవటం, వ్యాక్సిన్లను విస్తృతం చేయాలని తొమ్మిది నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవటం కేంద్ర వైఫల్యాలనే చెప్పుకోవాలి. చైనాతో పోటీ పడాలని.. ప్రపంచ దేశాల మన్ననలు పొందాలన్న ఉద్దేశంతో ఉత్పత్తి చేసిన ఆరు కోట్ల డోసులను ఇతర దేశాలకు పంచిపెట్టారు.

ప్రశ్న: ఈ పరిస్థితుల్లో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి?

వ్యాధి తీవ్రత ప్రబలకుండా చూడాలి. లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగించలేం. జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లను మరికొంత కాలం మూసే ఉంచాలి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారితో కలిపి 80 కోట్ల మంది ఉన్నారు. కనీసం 120 కోట్ల డోసులు ఆరు నెలల్లో ఉత్పత్తి చేయాలి. దేశంలో మరో రకమైన వైరస్‌ రాదని గ్యారెంటీ లేదు. బ్రిటన్‌లో తాజాగా వచ్చిన కేసుల్లో ఎక్కువ బి-1617 రకమేనని ఆ దేశం ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బూస్టర్‌ డోసులు సిద్ధం చేసుకోవాలి.

ప్రశ్న: వైద్యం ప్రయివేటుపరం చేయటంతోనే ఈ పరిస్థితి వచ్చిందా?

నూటికి నూరు శాతం అదే కారణం. ప్రతి లక్షన్నర జనాభాను ఒక యూనిట్‌గా చేసి వ్యవస్థను పటిష్ఠం చేయాలి. వైద్య పట్టభద్రులకు ఉద్యోగాలు కాకుండా ప్రయివేటు ప్రాక్టీసు విధానాన్ని తీసుకురావాలి. డాక్టర్‌ వద్దకు వెళ్లిన వారి సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఫీజులు చెల్లించాలి. నెలకు కనీసం రూ.లక్ష వచ్చేలా ఆ విధానం ఉండాలి. దేశ జాతీయ ఆదాయంలో వైద్యానికి ఒక్క శాతం మనం ఖర్చు చేస్తుంటే ఇతర దేశాలు ఎనిమిది శాతం వెచ్చిస్తున్నాయి. నేను చెబుతున్నట్లు ఖర్చు చేసినా రెండు శాతం మించదు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌భారత్‌ లాంటి పథకాలను మరింత విస్తృతం చేయాలి. జిల్లా, బోధనా ఆసుపత్రులను ఆధునిక పరికరాలతో సుసంపన్నం చేయాలి.

ప్రశ్న: కొవిడ్‌ రెండో దశకు ఎన్నికలే కారణమన్న కోణాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

ఎన్నికల సంఘాన్ని పూర్తిగా తప్పు పట్టాలి. కరోనా లేనట్లుగా ఎన్నికల సంఘాలు వ్యవహరించాయి. రాజకీయ పార్టీలూ భాగస్వాములే. బహిరంగ సభలను ఎన్నికల సంఘం ఎందుకు నిషేధించలేదు? అమెరికా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ పద్ధతులను, పత్రికలను, సోషల్‌ మీడియాను వినియోగించుకున్నారు. ఇక్కడ అలాంటి ప్రయోగాలు ఎందుకు చేయలేదు? ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదు?

ప్రశ్న: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు?

మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవాలి. వలస కార్మికులు ఏ స్థాయి ఇబ్బందులు పడ్డారో చూశాం. వారికి గృహవసతే కాదు ఉపాధి కూడా లేకపోవటంతో సొంతూళ్లకు తరలివెళ్లారు. ఆ ప్రభావం ఆర్థిక రంగంపైనా పడింది. పట్టణ ప్రాంతాల్లో వారికి గృహ నిర్మాణంతోకూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. అసంఘటిత రంగంలోని వారి ఉపాధిని నిలపటం.. నైపుణ్యాన్ని పెంచటం ఎలా అన్నది ముఖ్యం.

ప్రశ్న: కేంద్రం నియంత్రణతోనే వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతున్నామన్న రాష్ట్రాల వాదనలు ఎంత వరకు సరైనవి?

వ్యాక్సిన్ల ఉత్పత్తి, సేకరణ కేంద్ర ప్రభుత్వమే చేయాలి. మా ఊళ్లో తయారవుతుంది కదా మాకు ప్రాధాన్యం ఇవ్వాలనటం సరైంది కాదు. సాంకేతికత, ఆర్థిక వనరులు, ప్రపంచ సమాజంతో సంబంధాలు కేంద్ర ప్రభుత్వానికే సాధ్యమవుతాయి. అయితే వ్యాక్సిన్లు సమీకరించుకోమని రాష్ట్రాలకు కేంద్రం చెప్పటం చాలా పొరపాటు ఆలోచన. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కార్టికో స్టిరాయిడ్స్‌ వాడారు. కేంద్రం నుంచి వైద్యపరంగా సరైన ప్రొటోకాల్స్‌ రాకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి సైటోకిన్‌ స్ట్రామ్‌ ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడాలి. ముందే వాడడం ప్రాణాంతకం.

ప్రశ్న: వైరస్‌ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా?

తొలిదశలో అతిగా స్పందించింది. ఎక్కువ కాలం ఆంక్షలు విధించింది భారతదేశమే. అద్భుతం చేద్దామన్న కుతూహలమే కారణం కావచ్చు. చైనా, న్యూజిలాండ్‌ తదితరాలు ఆంక్షలు విధించి విజయాలు సాధించాయి. మనదేశంలో పరిస్థితులు వేరు. పేదరికం, జనాభా, మూఢ నమ్మకాలు తదితర పరిస్థితుల్లో కేవలం లాక్‌డౌన్‌తో కొవిడ్‌ను కట్టడి చేయాలని భావించటం ప్రభుత్వ పొరపాటే. 92 శాతం మంది ఉన్న అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతింది. అనుకున్నంత భయాన్నీ సృష్టించలేకపోయింది. తొలిదశలో తీవ్రమైన స్ట్రెయిన్స్‌ మన దేశంలోకి రాలేదు. అప్పట్లో మనదేశంలో 1,200 మందిలో యాంటీబాడీలను పరీక్షించారు. 30 మందికి వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. ఒకరు చనిపోయారు. ఈ గణాంకాలు ప్రపంచంలోకెల్లా మన దేశంలో అతి తక్కువ వ్యాధి సోకిందనడానికి ఉదాహరణ. రెండో దశ తీవ్రతను ఇటు ప్రభుత్వాలు, అటు సమాజం గుర్తించలేకపోయాయి.

ప్రశ్న: ఉపాధి పెరగాలంటే పెట్టుబడుల ఆకర్షణకు ఉన్న అవకాశాలు ఏమిటి?

సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. చైనా విధానాలంటే చాలా దేశాలకు భయం పెరిగింది. ఆ దేశం నుంచి తమ పరిశ్రమలను తరలించాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను గుర్తించి 20 వేల నుంచి 30 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి ప్రపంచాన్ని ఆకర్షించాలి. ఖాయిలాపడిన చిన్న పరిశ్రమలకు చేయూత ఇవ్వాలి. ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌ దేశాల జనాభాలో రెండున్నర నుంచి మూడు శాతం మంది వైద్య రంగంలో పనిచేస్తున్నారు. భారత్‌లో అందులో పదోవంతు మందే ఉన్నారు. వైద్య రంగాన్ని వృద్ధి చేస్తే నాలుగైదు రెట్ల ఉపాధి పెరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.