హుజూరాబాద్లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే క్రమంలో... మొదటగా గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. 17 ఏళ్లుగా శాసనసభ్యుడిగా కొనసాగాన్న ఈటల.. నియంతృత్వ పాలనకు స్వస్తి పాలకాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తెరాస బీ-ఫారం ఇచ్చి ఉండొచ్చు... గెలిపించింది మాత్రం ప్రజలేనని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు.
తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని... సమైక్య రాష్ట్ర పాలకులపై అసెంబ్లీలో గర్జించానని ఈటల గుర్తు చేసుకున్నారు. కరోనాతో వందలమంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా... హుజురాబాద్ ప్రజలకు మద్దతుగా ఉండాలని కోరారు.