Don't waste food : మోదీ మెచ్చిన యువకుడు.. ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు

author img

By

Published : Dec 25, 2021, 11:04 AM IST

Updated : Dec 25, 2021, 11:45 AM IST

Don't waste food
Don't waste food ()

don't waste food : ఆకలి విలువ తెలిసిన ఆ కుర్రాడు.. పది మంది పేదల ఆకలి తీర్చాలనుకున్నాడు. తానో చిన్నఉద్యోగే అయినా.. సేవకు పరిధి లేదని చాటాలనుకున్నాడు. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరిస్తూ.. ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో డొక్కలు మాడిపోయిన అభాగ్యులకు అందిస్తున్నాడు. ఈ కుర్రాడి సేవలకు మెచ్చిన ప్రధాని.. యువతకు అతనో ఆదర్శం అంటూ కితాబిచ్చారు. డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ ద్వారా పేదలకు తోడుగా నిలుస్తున్న ఆ కుర్రాడే.. మహేశ్వరరావు.

ఆకలి తీర్చే ఆపద్భాందవుడు

don't waste food : పండుగల రోజుల్లో, శుభకార్యాలు, ఫంక్షన్‌ హాళ్ల దగ్గర అతిథుల కోసం సిద్ధం చేసిన ఆహారం చాలా సార్లు మిగిలిపోతుంటుంది. అలాంటి పరిశుభ్రమైన ఆహారం మీ దగ్గర ఉంటే.. తమకు అందించాలని కోరుతున్నాడు.. నేమాని మహేశ్వరరావు. ఖాళీ కడుపులతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎంతో మంది పేదలకు.. డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ ఆహారం అందిస్తామంటున్నాడు.

అప్పుడు మొదలైన ఆలోచన..

don't waste food NGO : రాజమండ్రిలో పుట్టి, నాగ్‌పూర్‌కు వలస వెళ్లిన.. ఓ నిరుపేద కుటుంబం మహేశ్వరరావుది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతను.. ఎన్నో కష్టాల మధ్య చదువుకున్నాడు. రోజు కూలీగా పనిచేస్తూ ఇంటిని పోషించుకున్నాడు. దాతలు, ప్రభుత్వ సహకారంతో బీటెక్‌ పూర్తి చేసిన ఈ కుర్రాడు.. చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం క్యాటరింగ్‌కు వెళ్లేవాడు. అలా మొదటిసారి తానెళ్లిన ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి పేదలకు అందించాడు.. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు.

డోంట్ వేస్ట్ ఫుడ్​ సంస్థకు నాంది..

don't waste food Foundation : స్నేహితుల సూచనలు, సహకారంతో.. 2011లో డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఓ ట్రావెల్ సంస్థలో పనిచేస్తూ.. రాత్రి వేళ హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్ల నుంచి ఆహారం సేకరిస్తున్నాడు. మిగిలిన ఆహారమే అయినా.. నాణ్యంగా ఉంటేనే స్వీకరిస్తున్నారు. తాము తినేందుకు అనువుగా ఉంటేనే.. ఇతరులకూ పంచుతామంటున్నారు.. ఈ సంస్థ సభ్యులు.

నాణ్యంగా ఉంటేనే పంచుతాం..

don't waste food Volunteers : హోటళ్లో మిగిలిపోయిన ఆహారమే కాదు.. పేదలకు పంచేందుకు కొందరు దాతలు సైతం ఆహారం సిద్ధం చేసి అందిస్తున్నారు. ఆ ఆహారాన్ని డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ సంస్థ పంపిణీ చేస్తోంది. జంట నగరాల్లోని బసవతారకం, నిమ్స్, నిలోఫర్ వంటి ఆసుపత్రుల దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్‌ స్టేషన్లల్లో నిస్సహాయంగా ఉన్న వారికి పంచుతున్నారు. నగరంలోని మురికివాడల్లో తిరిగి.. వృద్ధులు, కూలీలు, బాల కార్మికులకు ఆహారం చేరవేస్తున్నాడు.. ఈ యువకుడు.

మోదీతో భేష్​ అనిపించుకుని..

don't waste food in Hyderabad : రోజూ 5 వందల నుంచి 2 వేల మందికి భోజనం అందిస్తోంది.. డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ సంస్థ. కొవిడ్‌ సమయంలోనూ.. నిరంతరాయంగా ఈ యువకుడు అందించిన సేవలకు ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి చేస్తున్న సేవల్ని, సమస్యల్ని అధిగమించి ముందుకు సాగిన తీరు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రశంసించారు.

మెగా ప్రశంస.. కరోనా హీరో..

don't waste food Feeds People : కొవిడ్‌ సమయంలోనూ అమూల్యమైన సేవలందించాడు.. మల్లేశ్వరరావు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, భోజనం అందించడంతో పాటు.. 2 ఆసుపత్రులకు ఆక్సీజన్ సిలిండర్లు సమకూర్చాడు. ఇతను చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వ, జీహెచ్​ఎంసీ అధికారులు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కరోనా హీరో పేరిట పురస్కారాన్ని అందించి, సత్కరించింది.

30 మంది వాలంటీర్లు..

don't waste food Feeds Hyderabad People : ఈ యువకుడి సేవలకు మెచ్చి.. మరికొంత మంది యువత సైతం చేతులు కలిపారు. అలా.. ఇప్పటి వరకు 30 మందికి పైగా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు సేవల్లో భాగస్వాములవుతున్నారు. స్వయంగా తమ ఇళ్లల్లో ఆహారం సిద్ధం చేసి.. డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ సంస్థకు అందిస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరంలో ఆకలితో అలమటించే ఎంతో మంది అభాగ్యుల కడుపునింపుతున్న డోంట్‌ వేస్ట్‌ ఫుట్.. భవిష్యత్తులో తన సేవల్ని దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాలని భావిస్తోంది.

Last Updated :Dec 25, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.