ETV Bharat / city

CLP Leader Bhatti Vikramarka : 'దళితబంధు నిధుల కేటాయింపుపై స్పష్టతనివ్వండి'

author img

By

Published : Oct 5, 2021, 2:31 PM IST

CLP Leader Bhatti Vikramarka
CLP Leader Bhatti Vikramarka

దళితబంధు పథకానికి నిధులు ఏ విధంగా సమకూరుస్తారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) డిమాండ్‌ చేశారు. దళితబంధుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆలోచనలు గొప్ప ఉన్నా...అమల్లో సాధ్యపడాలని అన్నారు. నిధుల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు.

దళిత బంధు పథకానికి కేటాయించే నిధులపై స్పష్టత ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితబంధుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పలు సూచనలు చేశారు. ఈ పథకాన్ని రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరారు. వీలుంటే దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న ఇతర అణగారిన వర్గాలకు కూడా దళితబంధు పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పథకాన్ని రాష్ట్రంలోని 4 మండలాల్లో మొదటి పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారన్న భట్టి(CLP Leader Bhatti Vikramarka).. తన నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా అందులో ఉందని తెలిపారు. ఇటీవల ఆయన చింతకానికి వెళ్లినప్పుడు.. అక్కడి ఎస్సీలతో మాట్లాడానని చెప్పారు. వారు తమకున్న కొన్ని సందేహాలను అడిగారని.. అవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని వారికి దళితబంధు కింద నగదు ఇవ్వాలంటే లక్షా 70వేల కోట్లు ఖర్చు అవుతుందని భట్టి(CLP Leader Bhatti Vikramarka) అంచనా వేశారు. కానీ ఎస్సీల ఆర్థిక సాధికారత కోసం వేయి కోట్ల రూపాయలను బడ్జెట్​లో కేటాయించారని.. ఇప్పుడు ఎస్సీలందరికి ఈ పథకం అమలు చేయడానికి నిధులు ఎక్కణ్నుంచి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు నగదు ఇవ్వడానికి బడ్జెట్​లో స్పష్టమైన నిధులను కేటాయిస్తారా లేదా.. ఏ సంవత్సరానికి ఎంత కేటాయిస్తామన్నది చెబుతారా అని అడిగారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరారు.

"చింతకాని మండలంలో పర్యటించినప్పుడు అక్కడి ఎస్సీలు నన్ను కొన్ని సందేహాలు అడిగారు. అవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లమని కోరారు. దళితబంధు పథకంలో భాగంగా ఇచ్చిన రూ.10 లక్షలతో కేవలం ఒక వ్యాపారమే చేసుకోచ్చా లేదా రెండు మూడు చిన్న వ్యాపారాలు కూడా చేయొచ్చా. ఏ వ్యాపారం చేయాలో ప్రభుత్వమే సూచిస్తుందా లేదా ఎవరికి నచ్చిన వ్యాపారం వాళ్లు చేసుకోవచ్చా. 10 మందికి తమ నగదు జమ చేసుకుని ఒక వ్యాపారం చేసుకునే వీలు ఉంటుందా? లబ్ధిదారులు తమ ప్రాంతాల్లోనే వ్యాపారం చేయడానికి అవకాశం ఉందా.. ఆ నగదుతో ఎక్కడైనా బిజినెస్ పెట్టుకోవచ్చా? "

- భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత

ప్రతి కుటుంబానికి దళితబంధు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. కానీ కొత్తగా పెళ్లైన కొందరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని అవి ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయని అన్నారు. పెండింగ్​లో ఉన్న లబ్ధిదారులకు వారి వివాహ ధ్రువపత్రం చూసి.. వాళ్లని ఒక కుటుంబంగా భావించి వారికి కూడా నగదు ఇస్తారా అని భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) అడిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.