ETV Bharat / city

Ajit Doval at IPS parade: 'శాంతిభద్రతలే కాదు.. దేశ భూభాగాన్ని కాపాడే బాధ్యతా.. మీదే'

author img

By

Published : Nov 12, 2021, 9:30 AM IST

Updated : Nov 12, 2021, 10:44 AM IST

IPS passing out parade 2021 in Hyderabad
IPS passing out parade 2021 in Hyderabad

శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పరిరక్షించే బాధ్యత ట్రైనీ ఐపీఎస్​లపై ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) ఉద్ఘాటించారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్(73rd batch of IPS probationers passing out parade 2021)​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్​లో ట్రైనీ ఐపీఎస్​ల గౌరవ వందనం స్వీకరించారు.

శాంతిభద్రతలే కాదు.. దేశ భూభాగాన్ని కాపాడే బాధ్యతా.. మీదే

130 కోట్ల మంది ప్రజల్నే కాదు.. 32 లక్షల చదరపు కిలోమీటర్ల భారతదేశ భూభాగాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత యువ ఐపీఎస్​లపై ఉందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) ఉద్ఘాటించారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ(National Police Academy)లో నిర్వహించిన దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమం(Deekshanth Samaroh in Hyderabad)లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్​(73rd batch IPS passing out parade 2021)లో గౌరవ వందనం స్వీకరించారు.

73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. వరుసగా మూడోసారి పరేడ్‌ కమాండర్‌ అవకాశం మహిళా అధికారికే దక్కింది. పంజాబ్ క్యాడర్​కు చెందిన దర్పణ్ అహ్లువాలియా కమాండింగ్ ఆఫీసర్​(Woman Commanding Officer Darpan Ahluwalia)గా వ్యవహరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దర్పణ్ అహ్లువాలియాకు డోభాల్.. కె.ఎస్.వ్యాస్ ట్రోఫీ అందించారు. అనంతరం.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ బ్యాచ్​లో రాష్ట్రానికి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించగా.. ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయించారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతోందని.. మరో 2 దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే కీలకపాత్ర పోషించనుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్(National security advisor Ajit Doval) తెలిపారు. చట్టాలు చేయటం మాత్రమే గొప్ప విషయం కాదని.... వాటిని పరిరక్షించి, అమల్లోకి తీసుకువచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు.

"ప్రజాస్వామ్యం అనేది బ్యాలెట్‌ బాక్స్‌లో ఉండేది మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న వారు చేసిన చట్టాల్లో ఉంటుంది. ఆ చట్టాలను పరిరక్షించే బాధ్యత మీపై ఉంటుంది. చట్టాలను రూపొందించటమే కాదు... వాటిని ప్రజల వద్దకు చేర్చేలా అమలుచేయటమే గొప్పవిషయం. చట్టాలను పరిరక్షించలేకపోయినా, అమలుచేయకపోయినా వాటి లక్ష్యం నెరవేరనట్లే. ప్రజాస్వామ్యం పరిరక్షణ మీ సామర్థ్యం, అంకితభావం, నడవడిక, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. 130కోట్ల మంది ప్రజలకు సంబంధించిన చట్టాలను పరిరక్షించే బాధ్యతను యువ ఐపీఎస్‌లు తీసుకోబోతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ మాత్రమే కాదు... దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది."

- అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు

ట్రైనీ ఐపీఎస్‌ల కవాతు ఎంతో ఆకట్టుకుందని డోభాల్(National security advisor Ajit Doval) తెలిపారు. పరేడ్‌కు మహిళ నేతృత్వం వహించడం సంతోషకరమని అన్నారు. ట్రైనీ ఐపీఎస్‌లు దేశానికి సేవ చేయబోతున్నారని.. ఎస్‌వీపీఎన్ఏలో ఇప్పటివరకు 5,700 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారని చెప్పారు. ఎంతోమంది ఐపీఎస్‌లు దేశానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు.

"52ఏళ్ల క్రితం ఎన్పీఏ నుంచి శిక్షణ తీసుకుని విధుల్లో చేరాను. స్వాతంత్య్రం తర్వాత పోలీసులు ఎంతో సేవలందించారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతోంది. మరో 2 దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలోనే కీలకపాత్ర పోషిస్తోంది. 15 వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దుల్లో వివాదాలున్నాయి. చైనా, పాక్, బంగ్లా, మయన్మార్‌తో సరిహద్దు సమస్యలున్నాయి. బలగాలు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నాయి. యువ ఐపీఎస్‌లపై ఎన్నో బాధ్యతలున్నాయి. శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలి."

- అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు

Last Updated :Nov 12, 2021, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.