ETV Bharat / city

అంచనా ధరలకు ఆధారమేదీ?.. 'మన ఊరు- మన బడి' టెండర్లు లోపాలమయం

author img

By

Published : Jul 8, 2022, 3:43 AM IST

మన బడి
మన బడి

మన ఊరు మన బడి పథకం టెండర్​ నిబంధనలపై కమిషనరేట్​ ఆఫ్​ టెండర్స్​ (సీఓటీ) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గుత్తేదారులు కోట్​ చేసిన ధరలు సహా మరికొన్ని అంశాల్లో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. విద్యాశాఖ నిర్ధరించిన అంచనా ధరలు సమర్థించుకునేలా లేవని వ్యాఖ్యానించింది.

"గుత్తేదారులు కోట్‌ చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రాథమికంగా విద్యాశాఖ నిర్ణయించిన ధరకు ఆధారం లేదు. టెండర్‌ నిబంధనల్లోనూ లోపాలున్నాయి" అని మన ఊరు-మన బడిలో భాగంగా విద్యాశాఖ పిలిచిన టెండర్లపై కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీఓటీ) అభిప్రాయపడినట్లు సమాచారం. పెయింటింగ్‌కు సంబంధించిన టెండర్‌పై మినహా మిగిలిన మూడింటిపైనా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. "స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ (ఎస్‌.ఎస్‌.ఆర్‌.) లేదా వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని అంచనా వ్యయం నిర్ధారణకు రావాల్సి ఉంది. అయితే విద్యాశాఖ టెండర్‌లో పెయింటింగ్‌ మినహా మిగిలిన వాటికి ఈ రెండింటి ఆధారం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చిన ధరలను పరిగణనలోకి తీసుకున్నారా అంటే అదీ లేదు. మొదట ప్రాథమిక ధరలపై ఓ నిర్ధారణకు రావాలి" అని సీఓటీ సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మన ఊరు/మన బస్తీ- మన బడి కింద 26,065 పాఠశాలల్లో పెయింటింగ్‌, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు 3,41,265 డ్యూయల్‌ డెస్క్‌లు, 26,065 స్కూళ్లలో టీచర్లు, హెచ్‌ఎంలకు టేబుళ్లు, కుర్చీలు, 1,39,585 గ్రీన్‌ చాక్‌బోర్డుల సరఫరాకు తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) మొత్తం రూ.1,539 కోట్ల విలువతో టెండర్లు పిలిచింది.

ఇందులో పాల్గొన్న గుత్తేదారుల్లో కొందరికి అర్హత లేదని పక్కనపెట్టడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. టెండర్‌ ప్రక్రియను కొనసాగించవచ్చని, తుది నిర్ణయం తీసుకోవద్దని కోర్టు సూచించింది. మరోవైపు- అర్హత ఉందని నిర్ణయించిన గుత్తేదారుల ఆర్థిక బిడ్లు తెరవగా.. అన్నింటిలోనూ ఎక్కువకు కోట్‌ చేసి ఉన్నాయి. రూ.1,539 కోట్ల విలువ చేసే పనులకు రూ.1,954 కోట్లు కోట్‌ చేశారు. ఇందులో పెయింటింగ్‌కు మాత్రం 10 శాతం ఎక్కువ కాగా, మిగిలినవన్నింటికీ 31 నుంచి 68 శాతం వరకు ఎక్కువ కోట్‌ చేశారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోని టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ మొత్తం టెండర్‌ ప్రక్రియను పరిశీలించాలని సీఓటీని కోరింది. మొదట రెండింటిపై గుత్తేదారులతో సంప్రదింపులు జరపాలని సూచించిన సీఓటీ.. మిగిలిన రెండింటిపై గురువారం నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో టెండర్‌ ప్రక్రియలోని పలు లోపాలను ఎత్తిచూపడంతోపాటు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అంచనాలకు ఆధారం కూడా లేదని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

దేంతో పోల్చాలి..?
"విద్యాశాఖ నిర్ణయించిన అంచనా ధరలు సమర్థించుకునేలా లేవు. ఎస్‌.ఎస్‌.ఆర్‌. లేదు. వస్తువు ప్రకారం ధర లేదు. అలాంటప్పుడు దేంతో పోల్చాలి" అని సీఓటీ ప్రశ్నించినట్లు సమాచారం. ఎంత ధర అవుతుందో ఒక నిర్ధారణకు వస్తే దానిపై గుత్తేదారు మార్జిన్‌, నిర్వహణ వ్యయం ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఓ అంచనాకు రావచ్చని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏమీ కనపడలేదని, సమగ్రంగా విశ్లేషణ జరపాల్సి ఉందని డ్యూయల్‌ డెస్క్‌లు, ఫర్నిచర్‌కు సంబంధించిన టెండర్ల విశ్లేషణలో పేర్కొన్నట్లు తెలిసింది. గ్రీన్‌ చాక్‌బోర్డుల విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెయింటింగ్‌కు ఎస్‌.ఎస్‌.ఆర్‌లో ధర ఉంది, ఈ ధరపై పది శాతం ఎక్సెస్‌కు కోట్‌ చేశారు. దీనిపై గుత్తేదారుతో సంప్రదింపులు జరపొచ్చని సూచించినట్లు తెలిసింది. ఇది మినహా మిగిలిన మూడింటి అంచనాలు, గుత్తేదారులు కోట్‌ చేసిన ధరలు, టెండర్‌ నిబంధనల్లో పలు లోపాలను సీఓటీ ఎత్తిచూపినట్లు సమాచారం. అంచనాలపై ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత గుత్తేదారులు కోట్‌ చేసిన ధరలపై వారితో సంప్రదింపులు జరపవచ్చని సూచించినట్లు తెలిసింది. అంచనాలు, టెండర్‌ నిబంధనలు, అధిక ధరకు గుత్తేదారులు కోట్‌ చేయడం.. ఇలా పలు అంశాలను సీఓటీ లేవనెత్తిన నేపథ్యంలో విద్యాశాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

.

ఇదీ చూడండి : గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.