ETV Bharat / city

ప్రజాసమస్యలపై ఉద్ధృతంగా పోరాడాలి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం

author img

By

Published : Jan 3, 2022, 7:51 PM IST

TDP Strategy Meeting: ప్రజాసమస్యలపై ఉద్ధృతంగా పోరాడాలి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం
TDP Strategy Meeting: ప్రజాసమస్యలపై ఉద్ధృతంగా పోరాడాలి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం

TDP Strategy Meeting: పెరిగిన నిత్యవసరాల ధరలతో పేదలు సంక్రాంతి పండుగను సైతం సంతోషంగా జరుపుకోలేని దుస్థితి ఏపీలో నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ధరలు తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జనవరి 11వ తేదీన మండల స్థాయి ధర్నాలు చేయాలని వ్యూహ కమిటీ సమావేశంలో తీర్మానించారు. కొత్త ఏడాదిలో పార్టీ మరింత వేగంగా పుంజుకోవాలని ఆకాంక్షించారు.

TDP strategy committee meeting : ప్రజాసమస్యలపై పోరును మరింత ఉద్ధృతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్​లైన్​లో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త ఏడాదిలో క్షేత్రస్థాయి ప‌ర్యట‌న‌ల‌తో బాధిత వ‌ర్గాల త‌రపున మరిన్ని పోరాటాలు చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలో రోజు రోజుకూ ప‌రిస్థితులు దారుణంగా మారిపోతున్నాయన్న చంద్రబాబు.. రైతులు, పేద‌లు, వ్యాపారులు.. ఇలా అన్ని అందరూ వైకాపా పాల‌నా వైఫ‌ల్యాల‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాసంబంధిత 9 అంశాలపై వ్యూహ కమిటీ సమావేశంలో తీర్మానించారు.

ఈ ధరలను ఎందుకు తగ్గించటం లేదు..?
chandrababu on Commodity prices: సినిమా టికెట్ల ధరలు తగ్గించిన జగన్మోహన్​ రెడ్డి.. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, గ్యాస్ ధరలను ఎందుకు తగ్గించలేదని సమావేశంలో నేతలు నిలదీశారు. తెదేపా ప్రభుత్వం ఇచ్చిన సంక్రాంతి కానుక రద్దు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అయిన జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి అని దుయ్యబట్టారు. తక్షణమే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేలా సీఎం జగన్​ చర్యలు తీసుకోవాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఏపీలో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని సమావేశం తీర్మానించింది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీది 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటంతో పాటు అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో వరి వేయవద్దనే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని దుయ్యబట్టారు. మిర్చి పంట దెబ్బతిని రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతే... నవంబర్​లో కురిసిన వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఇన్​పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందించడంలో జగన్మోహన్​ రెడ్డి విఫలమయ్యారని ఆక్షేపించారు. 75 కేజీల ధాన్యం బస్తా రూ.వెయ్యికే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతులను దోచుకుంటున్నా పట్టించుకునే వారు లేరని నేతలు మండిపడ్డారు. తక్షణమే పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

దోషులపై చర్యలేవీ..
tdp leaders on vangaveeti radha issue: వంగవీటి రాధా ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఘటనలో ఇంత వరకు దోషులపై చర్యలు లేకపోవటాన్ని సమావేశం తీవ్రంగా తప్పుబట్టింది. రెక్కీ చేసినట్లు ఆధారాలు ఉన్నా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. తక్షణమే వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా దుర్గి, తాడికొండల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా నేతలు ధ్వంసం చేయటాన్ని నేతలు ఖండించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకపై దాడిగానే పరిగణించాలని తీర్మానించారు. రెండున్నరేళ్లుగా ఎన్టీఆర్ విగ్రహాలను వైకాపా మద్దతుదారులు ధ్వంసం చేస్తున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవితో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​పై అనుచిత వ్యాఖ్యలు చేయించారని.. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్​ విగ్రహాన్ని కాపాడుకునేందుకు దళితులే పోరాటం చేసే పరిస్థితి నెలకొందన్నారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్​కే స్థానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కులచిచ్చు పెట్టడానికి అంబేడ్కర్​ విగ్రహాన్ని కూడా వైకాపా నేతలు వదలడం లేదని దుయ్యబట్టారు. రోడ్ల మరమ్మతులు చేసే పరిస్థితిలో కూడా జగన్మోహన్​ రెడ్డి లేరని.. జగనన్న కాలనీలు ఓ స్కాంగా మారిందని ఆరోపించారు. సిమెంట్, ఇసుక, సామాగ్రి పేరుతో ఉపాధి నిధుల్ని కూడా భారీ ఎత్తున దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, బీద రవిచంద్రయాదవ్, టీడీ జనార్దన్​, బీసీ జనార్దన్​ రెడ్డి, గురజాల మాల్యాద్రి, పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయ విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.