Laxman Nomination: భాజపా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దింపాలన్న పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు లఖ్నవూ వెళ్లిన లక్ష్మణ్.. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. నలుగురు పేర్లతో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్ఠానం.. సోమవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సరోయ, యూపీ నుంచి మిథిలేష్ కుమార్, కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది. ఎగువసభ స్థానానికి తెలంగాణ నుంచి లక్ష్మణ్కు అవకాశం ఇవ్వటం పట్ల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
"తెలంగాణ బిడ్డకు తొలిసారి రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషం. లక్ష్మణ్కు రాజ్యసభ సీటిచ్చిన మోదీ, అమిత్షా, నడ్డాకు కృతజ్ఞతలు. లక్ష్మణ్ ఎంపీ అయ్యాక రాష్ట్రంలో భాజపా మరింత బలోపేతం అవనుంది." - కిషన్రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. కమలం పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దిగువ సభలో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉండగా.. ఎగువసభలో రాష్ట్ర విషయాలు వచ్చినప్పుడు పార్టీ నుంచి మాట్లాడేవారు కరవయ్యారు. ఆ లోటును భర్తీ చేయడంతో పాటు.. తెలంగాణలోని బలమైన మున్నూరు కాపు, మొత్తం ఓబీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు.. భాజపా ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది.
ఇవీ చూడండి: