అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు.. గెలుపుగుర్రాలపై 'ఆపరేషన్​ ఆకర్ష్​' అస్త్రం..

author img

By

Published : Jul 29, 2022, 8:18 PM IST

BJP applying Operation Akarsh on strong Candidates of other parties to Win Next elections

BJP Operation Akarsh: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భాజపా కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేలా వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం.. ఆపరేషన్​ ఆకర్ష్​కు పదును పెడుతోంది. అయితే ఎవరెవరిని లాక్కోవాలన్న అంశంపై సర్వేలు కూడా చేసింది.

BJP Operation Akarsh: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తుండగా.. ప్రధానాస్త్రమైన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సాన పెడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తోన్న భాజపా.. అందుకోసం ఇతర పార్టీల్లోని జన, ధన బలమున్న గెలుపుగుర్రాలను పార్టీలోకి లాగేసుకునేందుకు పావులు కదుపుతోంది. గోవా తరహా మోడల్​ని భాజపా ఫాలో అవుతుంది. విభేదాలను పక్కన పెట్టి బలమైన నేతలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. గెలుపు గుర్రాల కోసం రాష్ట్రంలో భాజపా జాతీయ నాయకత్వం సర్వేలు నిర్వహించింది. సర్వే నివేధికల ఆధారంగా ఇతర పార్టీల్లోని బలమైన నేతలను గుర్తించింది. అధిష్ఠానం పంపించిన జాబితాలోని నేతలతో చర్చలు జరపాలని రాష్ట్ర నాయకులను అధిష్ఠానం ఆదేశించింది.

ఎక్కడైతే భాజపా బలంగా లేదో ఆ ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న నల్గొండతో పాటు వరంగల్, ఖమ్మంపై భాజపా గురి పెట్టింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టే. మరోవైపు.. ఉమ్మడి వరంగల్​లో కీలక నేతలతో పాటు, ఖమ్మంలోని పలువురు నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల మీదుగా సాగనుంది. అయితే.. ఆపరేషన్​ ఆకర్ష్​కు ఈ యాత్రను వాడుకునేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు.

మరోవైపు.. మరో రెండు, మూడ్రోజుల్లో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరతారని అధిష్ఠానం కూడా నిర్ణయించింది. అయితే.. దీనిపై రాజగోపాల్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. భాజపా శ్రేణులు ఉపఎన్నికకు వెళ్లాల్సిందేనని నిర్ణయించిన నేపథ్యంలో.. రాజగోపాల్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తేనే పార్టీలోకి ఆహ్వానం ఉంటుందని కమలనేతలు షరతు విధించడంతో.. ఆగస్టు 7 వరకు సమయం కావాలని రాజగోపాల్ రెడ్డి కోరినట్లుగా సమాచారం. బండి సంజయ్​.. పాద యాత్ర మునుగోడు నియోజకవర్గం మీదుగా సాగునుండగా.. అక్కడ భారీ బహిరంగసభ పెట్టి అదే వేదికగా రాజగోపాల్​రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని భాజపా భావిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపిన రాజగోపాల్​రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బండి సంజయ్, వివేక్​తో కూడా చర్చలు పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. పార్టీలో చేరికపై రాజగోపాల్ రెడ్డి నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.