ETV Bharat / city

భద్రతా వలయంలోకి కారుతో దూసుకొచ్చి సీఎంపై హత్యాయత్నం!

author img

By

Published : Aug 7, 2021, 4:49 PM IST

Tripura cm biplab kumar deb
Tripura cm biplab kumar deb

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా.. సీఎం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది.

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


కారు నడుపుకొంటూ..

విప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు. తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడం వల్ల పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు వేగంగా వెళ్లిపోయారని పేర్కొన్నారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: యూపీ సీఎంకు ఖలిస్థానీ సంస్థ బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.