ETV Bharat / city

Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

author img

By

Published : Nov 26, 2021, 3:43 PM IST

Affidavit On Amaravathi
ap government

Affidavit On Amaravathi: ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది. ఏపీ సర్కార్​ తరఫున పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

Affidavit On Amaravathi: ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ(Capital Region Development Authority) రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్టు హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్టు.. శాసనసభ కార్యదర్శి తెలిపారని అఫిడవిట్‌లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

3 రాజధానుల చట్టం ఉపసంహరణ.. ఏం జరిగిందంటే..


మూడు రాజధానుల విషయంపై నవంబర్ 22న ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని (ap govt repeal three capital law) వెనక్కు తీసుకుంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన మంత్రివర్గం.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన రద్దు బిల్లును ఆమోదించినట్లు పీటీఐ వార్త సంస్థ కథనం వెల్లడించింది.

హైకోర్టులో విచారణ.. వెనక్కి తీసుకుంటున్నట్లు ఏజీ వెల్లడి

రాజధాని వ్యాజ్యాలపై ఆరో రోజు (నవంబరు 22)న హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎమ్. సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు అభిప్రాయాలు చెబుతున్న సమయంలో... అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి తెలియజేశారు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్​డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారు.

ఏపీ మంత్రివర్గంలో చర్చించారని.. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రిపీల్‌ బిల్లును ధర్మాసనం ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈమేరకు నవంబర్​ 22 మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ధర్మాసనం వాయిదా వేసింది. హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైనా.. అప్పటికీ రిపీల్‌ బిల్లులపై శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అందువల్ల వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని ఏజీ కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

అదే రోజు అసెంబ్లీ మాట్లాడిన జగన్.. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో స్పష్టం చేసినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలూ వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.

ఇవీచూడండి:

Amaravati farmers Reaction: 'కొత్త బిల్లు తెస్తామంటూ.. సరికొత్త నాటకమాడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.