ETV Bharat / city

CM Jagan Letter to PM Modi: 'విద్యుత్ సంక్షోభం తీర్చేందుకు జోక్యం చేసుకోండి'

author img

By

Published : Oct 9, 2021, 1:26 PM IST

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్​లో విద్యుత్​ డిమాండ్​ పెరిగిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పనిచేయకుండా ఉన్న 2,300 మెగావాట్ల సహజవాయు విద్యుత్తు ప్లాంట్లను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

jagan letter to modi
jagan letter to modi

అంతర్జాతీయ ఇంధన సంక్షోభంతో ఐరోపా, చైనాల్లో విద్యుత్తు ఛార్జీలు మూడురెట్లు పెరిగాయి. ఈ సంక్షోభం భారతదేశాన్ని తాకేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో గడిచిన ఆరునెలల్లో 15% విద్యుత్తు డిమాండు పెరిగింది. గడిచిన ఒక్క నెలలోనే 20% డిమాండు పెరిగింది. బొగ్గు కొరత రెట్టింపు కావడం దేశ ఇంధన రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ సంక్షోభం విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఈ చర్యలు తీసుకోవాలి...

  • ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్‌లు కేటాయించేలా బొగ్గు మంత్రిత్వ శాఖకు, రైల్వేలకు సూచించాలి.
  • దేశంలో ఉత్పత్తి నిలిపివేసిన థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను తక్షణమే పునరుద్ధరించాలి.
  • ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయకుండా ఉన్న 2,300 మెగావాట్ల సహజవాయు విద్యుత్తు ప్లాంట్లను పని చేయించాలి. వాటికి ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ సంస్థల నుంచి అత్యవసర ప్రాతిపదికన సహజవాయువు సరఫరా చేయాలి.
  • నిర్వహణ పనుల కోసం కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు 500 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను నిలిపివేశాయి. వాటిలోనూ తక్షణమే ఉత్పత్తి చేయించాలి.
  • డిస్కంలకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు, రుణసంస్థలు అప్పుల రూపంలో ఇచ్చేలా మార్గదర్శకాలు జారీచేయాలి.

ఇదీ పరిస్థితి

  • ఆంధ్రప్రదేశ్‌ రోజూ 185 నుంచి 190 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌కు అందించాల్సి వస్తోంది. రాష్ట్ర విద్యుత్తు అవసరాల్లో 45% సరఫరా చేస్తున్న జెన్‌కో విద్యుదుత్పత్తి ప్లాంట్ల వద్ద ఒకటి రెండు రోజులకు సరిపడే బొగ్గు ఉంది. ఆ తర్వాత వీటి విద్యుత్తు ఉత్పత్తికి ఇబ్బంది కలుగుతుంది.
  • ఏపీ జెన్‌కో ఉత్పత్తి సంస్థలు రోజూ 90 మి.యూ. విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సి ఉన్నా బొగ్గు కొరతతో అందులో సగానికే పరిమితమయ్యాయి. కేంద్ర ఉత్పత్తి సంస్థలూ రోజూ 40 మి.యూ. ఉత్పత్తి చేయాల్సి ఉన్నా అందులో 75% మాత్రమే పనిచేస్తున్నాయి. 8వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలనుకునే క్రమంలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను ఏపీ వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంది. విద్యుత్తు కొరత వల్ల అధికధరలు పెట్టి కొనాల్సి వస్తోంది. 2021 సెప్టెంబరు 15న సగటున యూనిట్‌కు రూ.4.6 ఉంటే అక్టోబరు 8 నాటికి అది రూ.15కు పెరిగింది. రియల్‌ టైమ్‌లో ఈ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. యూనిట్‌కు రూ.20 వెచ్చించి కొనాల్సి వస్తోంది.
  • దేశంలో విద్యుత్తు ఉత్పత్తి కొరతతో కొన్ని కీలక సమయాల్లో కొనుగోలుకు విద్యుత్తు అందుబాటులో ఉండటం లేదు.
  • ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. డిస్కంల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. వ్యవసాయానికి విద్యుత్తు అందించకపోతే పంటలు ఎండిపోతాయి. విద్యుత్తు కోతలు ప్రారంభమైతే 2012 నాటి విద్యుత్తు సంక్షోభం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. గ్రిడ్‌ డిమాండ్‌ను అందుకోలేని ఇబ్బందులు మాకు వస్తాయి. అందువల్ల తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి.
jagan letter to modi
ప్రధాని మోదీకి సీఎం జగన్​ లేఖ

ఇదీ చదవండి : 'హెటిరో'లో నాలుగోరోజు ఐటీ దాడులు.. ఆ రూ.142 కోట్లపైనే ఆరా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.