వంటింటి కష్టాలు రానీయకుండా, ఎక్కడి నుంచైనా సులువుగా ఆహారం తయారు చేసుకునేలా హైదరాబాద్కు చెందిన యువతి ‘కిచెన్ క్వీన్’ పేరిట వినూత్న యంత్రాన్ని ఆవిష్కరించారు. ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు కాచిగూడకు చెందిన సార్గల శరణ్య తెలిపారు. రెండేళ్ల క్రితం ఈసీఈ పూర్తి చేసిన ఆ యువతి అందుబాటులో ఉన్న పాత వస్తువులను వినియోగించి రూ.2 వేల వ్యయంతో 10 రోజుల్లో యంత్రాన్ని రూపొందించారు. ఆర్థిక సాయం అందితే దీనికి సాంకేతికంగా మెరుగులు దిద్దొచ్చంటున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..?
ఐవోటీ సాంకేతికత ఆధారంగా ఫోన్తో ఎక్కడి నుంచైనా ఈ యంత్రాన్ని నియంత్రించొచ్చు. యంత్రానికి అనుసంధానించిన కెమెరా నుంచి చూస్తూ లైవ్లో వంట వండొచ్చు. కూరగాయలు, మసాలాలు, నూనె తదితరాలను పెట్టుకునేందుకు అమర్చిన పాత్రల నుంచి యంత్రమే అవసరమైన వాటిని తీసుకుంటూ కూర వండేస్తుంది. మోతాదు ముందే నిర్ధారించుకునే వెసులుబాటూ ఉంది. లైవ్లో ఫోన్లో కీప్యాడ్ నంబర్ల ద్వారా దీన్ని నిర్వహించుకోవచ్చని చెబుతున్నారు ఈ యువ ఆవిష్కర్త.
ఇదీ చదవండి: ఈ ఎద్దుకు మామూలు అభిమానులు లేరుగా..