Jobs for sale: అమ్మకానికి ఉద్యోగాలు.. ఆదిలాబాద్​ రిమ్స్​లో దళారుల చేతివాటం

author img

By

Published : Aug 4, 2021, 9:15 PM IST

nizamabad

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు అవినీతి మరక అంటుకుంటోంది. మధ్యవర్తుల జోక్యంతో అర్హత సాధించిన అభ్యర్థులను బురిడీ కొట్టించి... డబ్బులు దండుకునే దందా సాగుతోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దర్యాప్తు చేస్తామని రిమ్స్‌ అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్‌లో కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన 247 పోస్టుల భర్తీకి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతులిచ్చింది. కార్మికశాఖలో నమోదు జాబితా ప్రకారం 20 పొరుగు సేవల ఏజెన్సీలున్నా... యంత్రాంగం మాత్రం ఏకపక్షంగా మూడింటినే ఎంపికచేసింది. దరఖాస్తుల స్వీకరణ వాటి ఆధ్వర్యంలో సాగింది. రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌, జోనల్‌ రిజర్వేషన్ల ప్రకారం... 203 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఇటీవలే ప్రకటించారు. వారిలో కేవలం 157 మంది మాత్రమే విధుల్లో చేరారు. మిగిలిన 46 మంది జాడలేదు. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉన్న నేటి రోజుల్లో 46 మంది విధుల్లో చేరకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఎంపికైన విషయం తెలియక అభ్యర్థులకు విధుల్లో చేరలేదా? సమాచారం ఇవ్వకుండా మధ్యవర్తులు డబ్బుల కోసం పావులు కదుపుతున్నారా....? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి ఎంపికైన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిడిగూడకు చెందిన ఆదివాసీ అభ్యర్థి సారికను ఏజెన్సీ నిర్వహకులు విధుల్లో చేర్చుకోలేదు. జిల్లాల పునర్విభజనకంటే ముందు ఆసిఫాబాద్‌ గిరిజన గురుకుల పాఠశాలలో చదవుకున్న ఆమెను... నాన్‌లోకల్‌గా పేర్కొని తిరస్కరించడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో స్టాఫ్‌నర్సుగా ఎంపికైన నిర్మల్‌ జిల్లాకు చెందిన మరో ముగ్గురి నుంచి ఓ మధ్యవర్తి లక్ష నుంచి లక్షన్నర వరకు డబ్బులిస్తే ఉద్యోగం వస్తుందని బురిడీ కొట్టించేందుకు చేసిన ఫోన్‌ కాల్‌కు సంబంధించిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో స్వయంగా తెరాస నేతలే అభ్యంతరం వ్యక్తం చేయటం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.

జేఎన్​ఎం ఔట్​సోర్సింగ్​ పోస్టుకు దరఖాస్తు చేశాను. మెరిట్​ ప్రకారం నాకు ఉద్యోగం వచ్చింది. ఫైనల్​ లిస్ట్​లో కూడా నా పేరు ఉంది. వెరిఫికేషన్​కు వచ్చినప్పుడు కూడా నా సర్టిఫికెట్లు జీరాక్స్​ తీసుకున్నారు. ఫోన్​ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేయలేదు. విషయం ఏమిటోనని తెలుసుకుందామని ఏజెన్సీ వద్దకు వచ్చాము. మీది మంచిర్యాల జిల్లాకు వస్తుంది. మీరు అర్హులు కాదని చెబుతున్నారు. వాస్తవానికి మాది ఆదిలాబాద్​ జిల్లానే. డబ్బుల కోసం వాళ్లు నాన్​లోకల్​ అని చెబుతున్నారు. -సారిక, బాధితురాలు

నిర్మల్​ జిల్లాకు చెందిన నలుగురికి ఫోన్​ చేసి... జోనల్​ విధానంలో మీకు ఉద్యోగం వచ్చింది రూ.1.5లక్షలు ఇస్తేనే జాబ్​ వస్తుంది.. లేకపోతే రాదు.. లోపల లోపలే అయిపోతున్నాయని చెప్పారు. ఔట్​సోర్సింగ్​ ఏజెన్సీకి, ఆ మధ్యవర్తికి సంబంధం లేకపోతే... ఎంపిక అయిన వాళ్లకు ఎందుకు అపాయింట్​మెంట్​ లెటర్స్​ ఇవ్వలేదు. ఇప్పటికీ సుమారు 40 మందికి అపాయింట్​మెంట్​ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అనే ఉద్దేశంతోనే ఈ ఔట్​ సోర్సింగ్​ ఏజెన్సీలు ఉన్నాయి. నగదు కోసం ఫోన్​ చేసిన వ్యక్తిపై క్రిమినల్​ కేసు నమోదు చేయాలి. ఔట్​ సోర్సింగ్​ ఏజెన్సీలోను ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటిని బ్లాక్​లిస్ట్​లో పెట్టి.. కొత్త ఏజెన్సీలను పిలవాలని మా డిమాండ్​. - గోవర్థన్​ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్.

అయితే రోస్టర్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని రిమ్స్‌ అధికారులు ప్రకటించారు. కొంతమంది మధ్యవర్తులు అభ్యర్థుల నుంచి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కరుణాకర్‌... ఆ విషయంపై విచారణ చేస్తామని స్పష్టంచేశారు.

ఈ ఘటనపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఫిర్యాదు చేస్తే మరింత బలం చేకూరుతుంది. ఇది నిర్మల్​లో జరిగిందని అంటున్నారు. ఫోన్​ మాట్లాడినవారు కూడా ఇక్కడి వాళ్లు కాదు. ఒకవేళ మధ్యవర్తులు ఉండి.. ఇలాంటివి చేస్తున్నారని తేలితే కచ్చితంగా వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. డాక్టర్​ కరుణాకర్​, రిమ్స్​ డైరెక్టర్​, ఆదిలాబాద్​

ఇదీ చూడండి: Maripeda si case: 'రిమాండ్​కు ఎస్సై.. నిందితులెవరైనా సరే చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.