ETV Bharat / business

పుంజుకుంటోన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ.. మరోసారి వడ్డీ రేట్లను పెంచిన ఈసీబీ

author img

By

Published : Oct 28, 2022, 6:42 AM IST

america
అమెరికా

అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణతను నమోదు చేసిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. 2.6 వార్షిక వృద్ధిరేటును నమోదుచేసింది. మరోవైపు, అధిక ద్రవ్యోల్బణంపై పోరాటంలో భాగంగా ఐరోపా కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరోమారు గణనీయ స్థాయిలో 75 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణతను నమోదు చేసిన అమెరికా ఆర్థిక వ్యవస్థ.. మూడో (జులై- సెప్టెంబరు) త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. 2.6 శాతం వార్షిక వృద్ధిరేటును నమోదుచేసింది. తద్వారా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావాన్ని అధిగమించింది. ఎగుమతుల్లో బలమైన వృద్ధి, వినియోగదారు వినియోగంలో స్థిరత్వం, ఉద్యోగావకాశాల పరిస్థితి మెరుగుపడటం లాంటివి అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టేందుకు ఉపకరించాయి.

జనవరి-మార్చిలో 1.6 శాతం, ఏప్రిల్‌-జూన్‌లో 0.6 శాతం చొప్పున అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణించిన సంగతి విదితమే. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడిన పరిస్థితులు మాంద్యానికి దారితీస్తాయనే ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. వెలువడిన మూడో త్రైమాసిక గణాంకాలు ఎంతో ఊరటనిచ్చాయి. అమెరికా ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం వాటా కలిగిన వినియోగదారు వ్యయాలు సమీక్షా త్రైమాసికంలో 1.4 శాతం రాణించాయి. ఎగుమతులు 14.4 శాతం అధికమయ్యాయి. ఇందువల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.7 శాతం పెరిగింది. ప్రభుత్వ వ్యయాలు కూడా 2.4 శాతం పెరగడం ఉపకరించింది. అయితే ఇళ్లపై పెట్టుబడులు మాత్రం 26 శాతం తగ్గాయి. ఏడాది క్రితం 3.09 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 7 శాతానికి చేరడం ఇందుకు కారణం. ధరల సూచీ కేవలం 4.1 శాతమే పెరిగింది. 2020 జనవరి-మార్చి తరవాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇప్పుడే. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో ఇది 9 శాతం కావడం గమనార్హం.

లాభాల్లో అమెరికా స్టాక్​ మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. రాత్రి 11.30 గంటల సమయానికి డోజోన్స్‌ 272 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

కీలక రేట్లు మరో 0.75% పెంచిన ఈసీబీ..
అధిక ద్రవ్యోల్బణంపై పోరాటంలో భాగంగా ఐరోపా కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరోమారు గణనీయ స్థాయిలో 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. గత నెలలో కూడా ఇదే స్థాయిలో కీలక రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో ఈసీబీ స్వల్పకాలిక రుణ రేటు 2 శాతానికి చేరింది. చివరిసారిగా 2009 మార్చిలో ఈ స్థాయిలో వడ్డీ రేటు ఉండేది. 'ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతోంది. మరికొంత కాలం పాటు నిర్దేశిత లక్ష్యానికి ఎగువనే ఇది ఉండొచ్చ'ని ఈసీబీ పేర్కొంది. అందువల్ల మున్ముందు కూడా వడ్డీరేట్లు పెంచొచ్చనే సంకేతాలు ఇచ్చింది. ద్రవ్యోల్బణం 2024 చివరికి 2.3 శాతానికి దిగిరావొచ్చని అంచనా వేసింది. మరోవైపు ఐరోపా కూటమి ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు పెరుగుతోందని ఈసీబీ ప్రెసిడెంట్‌ క్రిస్టిన్‌ లగార్డే అంగీకరించారు. తాజా పెంపుతో కేవలం మూడు నెలల్లోనే కీలక రేట్లను 2 శాతం మేర ఈసీబీ పెంచినట్లయ్యింది. అంతకుముందు ఈసీబీ ఈ స్థాయిలో రేట్ల పెంపునకు 2005- 2007 మధ్య 18 నెలలు, 1999-2000 మధ్య 17 నెలలు తీసుకుంది. దీంతో తాజా వడ్డీ రేట్ల పెంపు దశ.. ఐరోపా చరిత్రలోనే అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.

ఇవీ చదవండి: విద్యుత్‌ వాహనాల పరుగు.. ఖరీదు ఎక్కువైనా కొనేందుకు మొగ్గు!

'శుక్రవారం నాటికి ట్విట్టర్​ను కొనేస్తా'.. బ్యాంకర్లకు మస్క్‌ హామీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.