ETV Bharat / business

భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎక్కడ ఎంతంటే..?

author img

By

Published : Feb 26, 2022, 5:08 PM IST

Gold price today: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగినప్పటికీ, యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే సూచనలు లేకపోవడంతో శుక్రవారం పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి బంగారం ధర రూ.51,800కు చేరింది. యుద్ధం ఇంకా కొనసాగితే.. బంగారం ధరలు ఎలా ఉండనున్నాయంటే..?

Today GOLD Rates
బంగారం ధరలు

Gold price today: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతోనే ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా తగ్గుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండిపైకి మదుపర్లు మళ్లడం వల్ల వీటి ధరలు పెరుగుతుంటాయి. ఫలితమే గురువారం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర గరిష్ఠంగా 1929 డాలర్లకు, వెండి 24.8 డాలర్లకు చేరింది. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్సు బంగారం ధర 1888 డాలర్లకు, వెండి 23.94 డాలర్లకు దిగివచ్చాయి. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ఔన్సు 2000-2100 డాలర్లకు చేరొచ్చనే అంచనాలు కూడా వెలువడిన సంగతి విదితమే. అందుకు భిన్నంగా పరిస్థితులుండటంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఈ విలువైన లోహాల ధరలు దిగి వస్తున్నాయి.

దేశీయంగా హైదరాబాద్‌ బులియన్‌ ట్రేడింగ్‌ విపణిని పరిశీలిస్తే గురువారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,100, వెండి కిలో రూ.68,600గా ఉంది. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఈ ధరలు రూ.51,800, రూ.66,500గా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినా, అగ్రరాజ్యాలేమీ భౌతిక ప్రతిదాడులకు దిగకపోవడం, రష్యాపై ఆర్థిక ఆంక్షలకే పరిమితం అవుతున్నందున ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనే భావనతో మదుపర్లు మళ్లీ స్టాక్‌మార్కెట్లకు దారితీస్తున్నారని, అందుకే పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయని సమాచారం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000-50,000; వెండి కిలో రూ.62,000-63,000 స్థాయికి దిగి రావచ్చనే అంచనాలను ఈ రంగంలోని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు

russia war
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగినప్పటికీ, యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే సూచనలు లేకపోవడంతో శుక్రవారం ప్రపంచ మార్కెట్లు కొంత కోలుకున్నాయి. ఇందేవల్లే చమురు ధరలు కూడా కాస్త శాంతించాయి. బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర గురువారం గరిష్ఠమైన 105 డాలర్ల నుంచి తగ్గి 97 డాలర్ల వద్ద ఉంది. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో ఈ ధరలు మరింత తక్కువగానే ఉన్నాయి. అనిశ్చితిపై భరోసా లభించడం వల్లే పసిడి ధరలు కూడా దిగివచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఐరోపా మార్కెట్లలో జర్మనీ డాక్స్‌ 3.67 శాతం, లండన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 3.91 శాతం, ఫ్రాన్స్‌ సీఏసీ 3.55 శాతం చొప్పున దూసుకెళ్లాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు డోజోన్స్‌ 760పాయింట్లు, నాస్‌డాక్‌ 150 పాయింట్లు చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి.

భారతీయ వర్తకుల కోసం డీజీఎఫ్‌టీ సహాయ కేంద్రం

అంతర్జాతీయ వర్తకంలో నిమగ్నమైన భారతీయ వ్యాపార సంస్థలకు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ వర్తక డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఒక సహాయ కేంద్రాన్ని (హెల్ప్‌డెస్క్‌) ను ఏర్పాటు చేసింది. టోల్‌ ఫ్రీ నెంబరు: 1800-111-550 కు కాల్‌ చేయడం లేదా dgftedi@nic.in కు ఇమెయిల్‌లో సమాచారం ఇస్తే, ఆ సమస్యను పరిష్కరించేందుకు డీజీఎఫ్‌టీ వర్గాలు ప్రయత్నిస్తాయి. దీంతోపాటు వర్తక ప్రతినిధులతో వారం వారం సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ఫార్మా కంపెనీలు తమకు ఎదురయ్యే సమస్యలను హెల్ప్‌డెస్క్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చని ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ సూచించారు. ఇతర ఉత్పత్తుల వర్తకులూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

రష్యాకు మన చెల్లింపులపై ప్రభావం ఉండకపోవచ్చు!

రష్యాపై కొన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ.. ఆ దేశంతో భారత ద్వైపాక్షిక చెల్లింపులపై ఆ ప్రభావమేమీ ఉండదని భావిస్తున్నారు. భారత్‌, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చెల్లింపులన్నీ భారత కరెన్సీ అయిన రూపాయిల్లో జరుగుతుండటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు రక్షణ ఉత్పత్తులు, ఇంధనాలు, ఖనిజ లోహాలు, రత్నాలు, విలువైన రాళ్లు, అణు రియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు, ఎరువులను రష్యా ఎగుమతి చేస్తోంది. రష్యాకు భారత్‌ ఎగుమతి చేసే వాటిల్లో ఔషధ ఉత్పత్తులు, విద్యుత్తు యంత్రాలు, సేంద్రియ రసాయనాలు, వాహనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారత్‌, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 9.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.70,500 కోట్లు)గా ఉంది. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలోనూ, చెల్లింపులకు రూపాయి మార్గాన్ని భారత్‌ కనుగొంది.

ఇదీ చదవండి: ఎయిర్​ఇండియా కోసం కొత్త విమానాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.