ETV Bharat / business

ఈ వారం 3 ఐపీఓల సందడి.. ఆ కంపెనీలో ఒక్కో షేరుకు 9 బోనస్ షేర్లు

author img

By

Published : Dec 12, 2022, 7:22 AM IST

స్టాక్ మార్కెట్​లో ఈ వారం మూడు ఐపీఓలు సందడి చేయనున్నాయి. రూ.1858 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి ఐపీఓకు వస్తున్నాయి. అవేంటంటే?

STOCK MARKET IPO
STOCK MARKET IPO

ఈ వారంలో 3 సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తుంటే, 'ఈ ఏడాదిలో భారీగా లాభాలు అందించిన 4 చిన్న స్థాయి కంపెనీల షేర్ల' ముఖ విలువ విభజన జరుగుతోంది. అవేమిటంటే..
అల్‌స్టోన్‌ టెక్స్‌టైల్స్‌:
జనవరి నుంచి ఈ షేరు విలువ సుమారు 1000 శాతం పెరిగినా, గత శుక్రవారం 5 శాతం నష్టంతో రూ.170.30 వద్ద ముగిసింది. రూ.217 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన ఈ స్మాల్‌ క్యాప్‌ షేరును 1:10 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా) విభజిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అలాగే 9:1 నిష్పత్తిలో (ప్రతి ఒక షేరుకు 9 షేర్ల చొప్పున) బోనస్‌ షేర్లు కూడా జారీ చేయనున్నారు.

స్టార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:
రూ.415 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన ఈ కంపెనీ స్టాక్‌ను ఈ నెల 16 నుంచి 1:2 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.5 ముఖ విలువ కలిగిన 2 షేర్లుగా) విభజిస్తున్నారు. 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు కూడా జారీ చేస్తున్నారు. ఇదీ 16 నుంచే అమల్లోకి వస్తుంది. గత శుక్రవారం ఈ షేరు 2.24% నష్టంతో రూ.211.35 వద్ద ముగిసింది.

ఎస్‌టీ కార్పొరేషన్‌:
రూ.210 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన ఈ షేరు ఈ ఏడాది ప్రారంభం నుంచి 1350 శాతం లాభాలు పంచింది. గత శుక్రవారం 5 శాతం నష్టపోయి రూ.328 వద్ద ముగిసింది. ఈ నెల 16 నుంచి ఈ షేరును 1:5 నిష్పత్తిలో విభజిస్తున్నారు. అంటే రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విడిపోతాయి.

లాన్సర్‌ కంటెయినర్‌ లైన్స్‌:
వాటాదార్లకు ఈ ఏడాదిలో 110 శాతం వరకు లాభాలు పంచిన ఈ స్మాల్‌ క్యాప్‌ షేరును ఈ నెల 16 నుంచి 1:2 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.5 ముఖ విలువ కలిగిన 2 షేర్లుగా) విభజిస్తున్నారు. గత శుక్రవారం 0.05 శాతం నష్టంతో రూ.457.05 వద్ద ఈ షేరు ముగిసింది. రూ.1,377 కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న సంస్థ ఇది.

ఈ షేర్లన్నీ చాలా తక్కువ మార్కెట్‌ విలువ కలిగినవి కావడం, ఇటీవల కాలంలో వీటి విలువలు భారీగా పెరిగిన నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రూ.1858 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓలు
ఈ వారం రూ.1,858 కోట్ల సమీకరణ లక్ష్యంతో మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. వైన్‌ తయారీ సంస్థ సులా వైన్‌యార్డ్స్‌, ఆర్థిక సేవల సంస్థ అబాన్స్‌ హోల్డింగ్స్‌ ఐపీఓలు ఈనెల 12న, కార్ల డీలర్‌షిప్‌ చెయిన్‌ సంస్థ ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ ఐపీఓ 13న మొదలవనున్నాయి.

సులా వైన్‌యార్డ్స్‌:
ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.340-357. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.960.35 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)గా వస్తున్న ఈ ఐపీఓలో ప్రమోటర్లు, వాటాదార్లు 26,900,532 షేర్లు విక్రయించనున్నారు.

ల్యాండ్‌మార్క్‌ కార్స్‌:
ధరల శ్రేణి రూ.481- 506. కంపెనీ రూ.552 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ.150 కోట్ల విలువైన కొత్త షేర్లు, ఓఎఫ్‌ఎస్‌లో రూ.402 కోట్ల వరకు షేర్లను విక్రయించన్నారు.

అబాన్స్‌ హోల్డింగ్స్‌:
ధరల శ్రేణి రూ.256- 270. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.345.6 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఇష్యూలో భాగంగా 38 లక్షల కొత్త షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో మరో 90 లక్షల వరకు షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

నవంబరులో మొత్తం 10 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. 2022లో ఇప్పటివరకు 33 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.55,000 కోట్లకు పైగా సమీకరించాయి. 2021లో 63 ఐపీఓలు రూ.1.19 లక్షల కోట్లకు పైగా సమీకరించడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.