ETV Bharat / business

వరల్డ్ టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్​- ముకేశ్ అంబానీ తగ్గేదేలే!

author img

By PTI

Published : Dec 29, 2023, 8:12 AM IST

Reliance Family Day
Reliance Family Day

Reliance Family Day : రిలయన్స్​ ఇండస్ట్రీస్​ను ప్రపంచంలో టాప్‌ 10 వ్యాపార సంస్థల్లో ఒకటిగా చేయడమే తమ లక్ష్యమని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. అప్పటివరకు సంతృత్తి చెందే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన రిలయన్స్‌ ఫ్యామిలీ డే (ధీరూభాయ్‌ అంబానీ జయంతి) కార్యక్రమంలో గ్రూప్‌ ఉద్యోగులనుద్దేశించి ముకేశ్​ అంబానీ ప్రసంగించారు.

Reliance Family Day : ప్రపంచంలోని టాప్​ 10 వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌- ఆర్‌ఐఎల్‌ నిలవాలన్నది తమ లక్ష్యమని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఆ కల నెరవేరేదాకా కంపెనీ గానీ తాను గానీ ఏ దశలోనూ సంతృప్తి చెందమని చెప్పారు. ఈ మేరకు గురువారం రిలయన్స్‌ ఫ్యామిలీ డే (ధీరూభాయ్‌ అంబానీ జయంతి) కార్యక్రమంలో గ్రూప్‌ ఉద్యోగులను ఉద్దేశించి ముకేశ్​ అంబానీ ప్రసంగించారు.

"రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌- ఆర్‌ఐఎల్‌, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు దేశంలోనే అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ జియోను కలిగి ఉంది. అయితే ఆర్‌ఐఎల్‌ గానీ వ్యక్తిగతంగా నేను కానీ ఏ దశలోనూ సంతృప్తి చెంది ఉదాసీనతతో వ్యవహరించే ప్రసక్తే లేదు. ప్రపంచంలోని అగ్రగామి 10 దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఆర్‌ఐఎల్‌ నిలవాలన్నది తమ లక్ష్యం. డిజిటల్‌ డేటా ప్లాట్‌ఫామ్స్‌, ఏఐ (కృత్రిమ మేధ) వంటి విభాగాల్లో ఇంటర్నేషనల్ కంపెనీల సరసన చేరే ఉద్దేశంతో రిలయన్స్‌ ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార వాతావరణం చాలా వేగంగా మారుతున్న క్రమంలో ఏ దశలోనూ మనం సంతృప్తి చెందకూడదు. వినూత్న ప్రయత్నాలతో మార్కెట్లలో విప్లవాన్ని తీసుకురావడం రిలయన్స్‌ సంస్థకు అలవాటే"
--ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌

జౌళి తయారీకి నెలకొల్పిన చిన్న ప్లాంటు నుంచి పెట్రోరసాయనాల్లోకి అడుగుపెట్టి, దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్​ మారిందని ముకేశ్​ అంబానీ తెలిపారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్‌ కాంప్లెక్స్‌గా మారిందన్నారు. ఇక 2005లో రిటైల్‌ రంగంలో ప్రవేశించి ఇప్పుడు దేశంలోనే అగ్రస్థాయిలో ఉన్నామని ఉద్యోగులనుద్దేశించి అన్నారు.

"2016లో టెలికాం​ నెట్​వర్క్​ 'జియో'ను ప్రారంభించాం. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్​గా ఉన్నాం. ఇప్పుడు విద్యుత్ వాహన బ్యాటరీల కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించే స్థాయికి చేరుకున్నాం. అంతే కాకుండా ఆర్థిక సేవలనూ ప్రారంభించాం. ఎప్పటికప్పుడు సంస్థ ప్రమాణాలను పెంచుకుంటూపోయాం. సరికొత్త రికార్డులను సృష్టించాం"
--ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌

ప్రపంచంలో అగ్రగామి దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉండే స్థాయికి చేరుకోవాలంటే వినియోగదార్లకు అత్యంత మెరుగైన సేవలందించాలని ఉద్యోగులను కోరారు ముకేశ్ అంబానీ. రాబోయే సంవత్సరాల్లో ఇదివరకెవరూ సృష్టించని ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి మనమంతా మరింత కష్టపడాలని వారితో అన్నారు. మన వ్యాపారాలు అత్యంత వేగంగా వృద్ధి చెందితేనే భారత వృద్ధికి కూడా సహకరించగలమని చెప్పారు. తద్వారా ప్రపంచంలో భారత్‌ను మెరుగైన స్థానంలో ఉంచగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్‌ వారిదే!
'రిలయన్స్‌ ఇండస్ట్రీస్ వృద్ధికి కారణమైన డిజిటల్‌ సేవలు, హరిత-బయో ఇంధనం, రిటైల్‌-వినియోగదారు బ్రాండ్లు, చమురు-రసాయనాల(ఓ2సీ) విభాగం, మెటీరియల్స్‌ వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ వంటివి అన్నీ ఈ కొత్త సంవత్సరంలో మరింత ముందుకు సాగాలి. అయితే యువవ్యాపారవేత్తలు తప్పులు చేయడం సహజం. అయితే అలాంటి పాత తప్పులను తలచుకుంటూ మీ శక్తిని వృధా చేసుకోవద్దు. అవే తప్పులు పునరావృతం కాకుండా ఏం వాటి నుంచి నేర్చుకోవాలి. రిలయన్స్‌ సంస్థలో సగటు వయసు 30 ఏళ్లలోపే. ఆకాశ్‌, ఈశా, అనంత్‌ వారి తరానిదే భవిష్యత్‌ అంతా' అని ముకేశ్​ అంబానీ వివరించారు.

Mukesh Ambani Children Salary : జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ పిల్లలు.. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

Mukesh Ambani Employees Salary : అంబానీ ఇంట్లో పనిచేసే వారికి అంత జీతమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.