ETV Bharat / business

'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'.. ప్రతిపక్షాలకు అస్త్రంగా ఆర్‌బీఐ నివేదిక

author img

By

Published : May 30, 2022, 3:43 AM IST

Fake Currency: దేశంలో నకిలీ కరెన్సీ నోట్ల ట్రెండ్ పెరిగింది. రూ.500 నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు కాగా, రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య కూడా 50 శాతానికి పైగా పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్​ సహా ప్రతిపక్షాలు 2016లో భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఎట్టకేలకు నోట్ల రద్దు ప్రతిఫలం దక్కిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి

fake currency
fake currency

Fake Currency: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ముఖ్యంగా 2016లో భాజపా ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దును విమర్శిస్తూ కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. నగదు చలామణి, నకిలీ నోట్లు పెరిగాయన్న నివేదికను ఉటంకిస్తూ విపక్ష నాయకులు ప్రధాని మోదీ విధానాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2021-22లో అన్ని డినామినేషన్ల నకిలీ నోట్లు పెరిగాయి. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000 ఫేక్‌ నోట్లు 54.16 శాతం ఎక్కువయ్యాయి. ఒక్క రూ.50, రూ.100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్ల నకిలీ అధికమైందని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు నగదు చలామణి కూడా గత మూడేళ్లలో 28.28 శాతం పెరిగింది. అన్ని డినామినేషన్లు కలిపి 2020లో రూ.24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉండగా.. 2021 నాటికి ఈ విలువ రూ.28,26,863 కోట్లకు, 2022 నాటికి రూ.31,05,721 కోట్లకు చేరింది. అయితే, చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా 1.6 శాతానికే పరిమితమైంది.

2016లో కేంద్ర ప్రభుత్వం అప్పటి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అవినీతిని అరికట్టడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం, నకిలీ నోట్లను నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో మోదీ సర్కార్‌ ప్రకటించింది. కానీ, తాజా గణాంకాల ప్రకారం అవేవీ నెరవేరలేదని స్పష్టమైందని ప్రతిపక్షాలు అధికార భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో తన సందేశానికి నకిలీ నోట్ల పెరుగుదలకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని జత చేశారు.

అలాగే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాజా ఆర్‌బీఐ నివేదికను ప్రస్తావిస్తూ.. "నకిలీ నోట్ల బెడద తీరిపోతుందని ఎలా హామీ ఇచ్చారు’’ అని ప్రధానిని ప్రశ్నించారు. శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేదీ సైతం ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఎట్టకేలకు నోట్ల రద్దు ప్రతిఫలం దక్కిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవీ చదవండి:

చైనాను తలదన్ని.. భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

బంగారంపై పెట్టుబడులు భద్రమేనా? ఈటీఎఫ్​తో లాభమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.