రూపాయల్లో వాణిజ్యానికి దక్షిణాసియా దేశాలతో చర్చలు: RBI గవర్నర్

author img

By

Published : Jan 7, 2023, 7:39 AM IST

negotiations-south-asian-countries-trade-in-rupees-rbi-governor

దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకే తొలి ప్రాధాన్యమని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ అన్నారు. రూపాయల్లో వాణిజ్య చెల్లింపులు చెసేందుకు దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్చలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు. దిల్లీలో జరిగిన ఐఎంఎఫ్‌ సదస్సులో ప్రసంగిస్తూ శక్తికాంత్​ దాస్​ ఈ వాఖ్యలు చేశారు.

రూపాయల్లో వాణిజ్య చెల్లింపులు చెసేందుకు దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్చలు జరుపుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 'యూపీఐ కోసం దక్షిణాసియా ప్రాంతంలో పలు దేశాలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఉదాహరణకు భూటాన్‌, నేపాల్‌ లాంటి దేశాలతో.. దక్షిణాసియా ప్రాంతంలో ఇతర దేశాలతో (క్రాస్‌ బోర్డర్‌) చెల్లింపులు కూడా మరింత సులభతరం అయ్యేలా యూపీఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నామ'ని ఇక్కడ జరిగిన ఐఎంఎఫ్‌ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన తెలిపారు.

ఇందుకోసం దక్షిణాసియా ప్రాంతంలో కొన్ని దేశాలతో ఇప్పటికే చర్చలు జరిపామని పేర్కొన్నారు. వృద్ధికి, పెట్టుబడుల రాకకు ముప్పును తీసుకొచ్చే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే దక్షిణాసియా దేశాల తొలి ప్రాధాన్యం కావాలని ఆయన సూచించారు. 2022-23లో అంతర్జాతీయంగా వాణిజ్యానికి మందగమన పరిస్థితులు నెలకొన్నందున.. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య వాణిజ్యానికి అపార అవకాశాలు ఉన్నాయని దాస్‌ అన్నారు. వృద్ధికి, ఉద్యోగావకాశాల కల్పనకు ఈ పరిణామం దోహదం చేస్తుందని వివరించారు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం.. ప్రపంచ వృద్ధిలో దక్షిణాసియా ప్రాంతం వాటా సుమారు 15% వరకు ఉంటుంది.

డిజిటల్‌ కరెన్సీపై జాగ్రత్తగా..
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగ దశలో ఉందని.. దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే విషయంలో ఆర్‌బీఐ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోందని దాస్‌ తెలిపారు. క్లోనింగ్‌ లేదా మరోటి ఏదైనా జరిగితే.. పెద్ద ముప్పు ఏర్పడుతుందని అన్నారు. దక్షిణాసియా దేశాల నుంచి సహకారం తీసుకునేందుకు అవకాశమున్న వాటిల్లో డిజిటల్‌ కరెన్సీ కూడా ఒకటి అని అన్నారు. టోకు విభాగంలో నవంబరు 1న, రిటైల్‌ విభాగంలో డిసెంబరు 1న సీబీడీసీ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అదే జరిగితే.. వృద్ధికి, పెట్టుబడులకు ముప్పు..
కొవిడ్‌-19, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపులు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాల వల్ల నెలకొన్న కీలక సవాళ్లను ఎదుర్కొనేందుకు దక్షిణాసియా ప్రాంతం ముందు 6 విధాన ప్రాధాన్యాలను గవర్నరు ఉంచారు. 'పలు అంతర్జాతీయ పరిణామాల వల్ల దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థలపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఏర్పడ్డాయి. దీనిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వసనీయ పరపతి విధాన చర్యలు, లక్షిత విభాగాల్లో సరఫరాపరంగా జోక్యం, ద్రవ్య, వాణిజ్య విధానాలు, పాలనా పరమైన చర్యలు లాంటివి కీలక సాధనాలు' అని దాస్‌ వివరించారు.

కొన్ని రోజులుగా కమొడిటీ ధరలు తగ్గడం, సరఫరాపరమైన అవరోధాలు తగ్గుముఖం పట్టడం వల్ల.. మున్ముందు ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశం ఉందని దాస్‌ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగితే.. వృద్దికి ముప్పు ఏర్పడడంతో పాటు, పెట్టుబడులకు ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. దక్షిణాసియా ప్రాంతం సంప్రదాయ ఇంధనాలపై అధికంగా ఆధారపడి ఉండడం కూడా.. ఇంధన దిగుమతుల ద్రవ్యోల్బణం రూపేణా భారాన్ని మోయాల్సి వస్తోందని దాస్‌ వివరించారు.

వీటికీ ప్రాధాన్యమివ్వాలి..
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు.. విదేశీ రుణ భారాన్ని తగ్గించుకోవడం, అధిక ఉత్పాదకత రంగాలపై మరింత దృష్టి సారించడం, ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడం, పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరస్పర సహకారం అందించుకోవడం, పర్యాటకాన్ని పెంచుకోవడం లాంటి వాటికి దక్షిణాసియా దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని దాస్‌ తెలిపారు.

విదేశీ రుణ నిర్వహణను మరింత సమర్థంగా చేసేందుకు ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ లాంటి బహుళపాక్షిక వ్యవస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రాంతంలోని కొన్ని దేశాల విదేశీ అప్పులు బాగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ అస్థిరత్వానికి దారి తీసిన సంగతి తెలిసిందే. విదేశీ మారకపు నిల్వలు బాగా క్షీణించడంతో.. శ్రీలంక, పాకిస్థాన్‌లు నిధుల సహకారాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ద్రవ్యోల్బణమూ గణనీయంగా పెరిగిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.