ETV Bharat / business

దీపావళి నాటికి జియో 5జీ సేవలు, మొదట ఆ నగరాల్లోనే

author img

By

Published : Aug 29, 2022, 3:11 PM IST

Updated : Aug 29, 2022, 3:40 PM IST

Reliance 5G Network
mukhesh ambani says that the company will launch reliance 5G network in october

దీపావళి కానుకగా 5జీ సేవలు ప్రారంభిస్తామని రిలయన్స్​ సంస్థ ప్రకటించింది. మొదట నాలుగు ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపింది. తరవాత విడతలవారీగా సేవలను విస్తరిస్తామని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.

Reliance 5G Network:దీపావళి కానుకగా జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. నాలుగు మెట్రో నగరాలు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలో దీపావళి జియో 5జీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. దశలవారీగా 2023 డిసెంబరు నాటికి ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టాలనేది జియో లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5జీ సేవల వివరాలను ముఖేష్‌ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో జియో 5జీ సాంకేతికత కోసం 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు.. ప్రకటించింది. అత్యంత నాణ్యమైన,అందుబాటు ధరల్లో జియో 5జీ సేవలను ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. భారత్‌ను డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మలిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆల్ట్రా హైస్పీడ్ జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరిట జియో 5జీ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని ప్రకటించింది. గూగుల్‌తో కలిసి 5జీ ఫోన్‌ను తేనున్నట్లు ప్రకటించారు. అందుబాటు ధరల్లోనే అందిస్తామని ప్రకటించింది. 5జీ సొల్యూషన్స్‌ కోసం క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది.

క్లౌడ్​ పీసీ సర్వీస్​..
మరోవైపు, క్లౌడ్ ఆధారిత పీసీ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్ అధినేత వెల్లడించారు. ప్రస్తుతం పీసీ, ల్యాప్‌టాప్‌ను ప్రతిసారి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుందన్న అంబానీ.. ఇక ఆ అవసరమేలేకుండా క్లౌడ్ పీసీని తెస్తున్నట్లు తెలిపారు. తద్వారా అప్‌గ్రేడ్ చేసే ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఎంత వాడుకుంటే అంతే చెల్లించవచ్చని చెప్పారు. రిలయన్స్ కంపెనీలో వినియోగిస్తున్న పీసీల స్థానంలో జియో క్లౌడ్‌ పీసీలను అందుబాటులోకి తెస్తున్నట్లు అంబానీ వివరించారు.

ఇవీ చదవండి: ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 950 పాయింట్లు పతనం

Last Updated :Aug 29, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.