ETV Bharat / business

ఇరాన్​ గ్యాస్ క్షేత్రంలో భారత్​కు 30 శాతం వాటా

author img

By

Published : Sep 26, 2022, 7:37 AM IST

Updated : Sep 26, 2022, 7:57 AM IST

Iran India Gas Deal
Iran India Gas Deal

Iran India Gas Deal : ఇరాన్​లో గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్న ఓఎన్​జీసీ, దాని అనుబంధ సంస్థలకు 30 శాతం వాటా ఇస్తామని ఆ దేశం ప్రతిపాదించింది. ఈ విషయంపై 90 రోజుల్లో స్పందించకపోతే.. ఆఫర్​ను తిరస్కరించినట్లు భావిస్తామని వెల్లడించింది.

Iran India Gas Deal : పెర్షియన్‌ గల్ఫ్‌(ఇరాన్‌)లో భారతీయ సంస్థలు గుర్తించిన ఫర్జాద్‌-బి గ్యాస్‌ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో 30% వాటాను ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌, దాని భాగస్వాములకు ఇచ్చేందుకు ఇరాన్‌ సిద్ధమైంది. ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఓఎన్‌జీసీ) అనుబంధ సంస్థే ఓఎన్‌జీసీ విదేశ్‌. 2008లో ఫార్సి ఆఫ్‌షోర్‌ క్షేత్రంలో, 3,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అతిపెద్ద గ్యాస్‌ నిక్షేపాలను ఓఎన్‌జీసీ విదేశ్‌ కనుగొంది.

2011 ఏప్రిల్‌లో ఫర్జాద్‌-బి క్షేత్రానికి సంబంధించిన మాస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎండీపీ)ను సంస్థ సమర్పించింది. అయితే అణు ప్రణాళికలపై ఇరాన్‌ వైఖరికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో, ఆ క్షేత్రంలో ఉత్పత్తికి సంబంధించిన చర్చలు ఆగిపోయాయి. మళ్లీ 2015లో మరోసారి ఈ అంశం తెరమీదకొచ్చింది. 2020 ఫిబ్రవరిలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను స్థానిక సంస్థకు అప్పజెప్పాలని ఇరాన్‌ ప్రభుత్వం సూచించిందని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ (ఎన్‌ఐఓసీ) పేర్కొంది.

అయితే ఎక్స్‌ప్లోరేషన్‌ ఒప్పందం ప్రకారం, గ్యాస్‌ క్షేత్రాన్ని కనుగొన్న ఓఎన్‌జీసీ విదేశ్‌, దాని అనుబంధ సంస్థలకు క్షేత్రం అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కల్పించాలి. దీంతో భారతీయ సంస్థల బృందానికి కనీసం 30 శాతం వాటా అప్పగించేందుకు ఇరాన్‌ ప్రతిపాదించింది. దీనిపై 90 రోజుల లోపు స్పందించకపోతే, ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు భావిస్తామని వెల్లడించింది.
ఫార్సి ఆఫ్‌షోర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ బ్లాక్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 40 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు 40 శాతం, ఆయిల్‌ ఇండియాకు మిగతా 20 శాతం వాటా ఉంది.

రికార్డు స్థాయికి సహజ వాయువు ధర!
ఈ వారం జరగనున్న ధరల సమీక్షలో సహజ వాయువు ధర రికార్డు గరిష్ఠానికి చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ ధరలపై అక్టోబరు 1న సమీక్ష చేయనున్నారు. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, వాహనాల్లో వినియోగించే సీఎన్‌జీల్లో సహజ వాయువును కీలకంగా వాడుతారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధర మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 6.1 డాలర్ల నుంచి 9 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్‌, బీపీ నిర్వహించే కేజీ బేసిన్‌లో డీ6 బ్లాక్‌ వంటి కఠిన క్షేత్రాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌ ధర మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 9.92 డాలర్ల నుంచి దాదాపు 12 డాలర్లకు పెరగొచ్చని సమాచారం.

ఇవీ చదవండి: అమెరికా మాంద్యం దెబ్బ.. ఐటీలో వేతన కోతల కలవరం

'ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి పెరుగుతోంది.. బాండ్లలో లావాదేవీలు నిర్వహిస్తాం'

Last Updated :Sep 26, 2022, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.