ETV Bharat / business

దేశంలో 10 కోట్లకుపైగా స్మార్ట్​ ఫోన్ల కొనుగోళ్లు.. 5G అప్డేట్​ ఎక్కడ?

author img

By

Published : Oct 12, 2022, 7:13 AM IST

దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌, వివో, షియోమీ వంటి మొబైల్‌ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్‌ తయారీ సంస్థలు 'ప్రాధాన్యత' ఇవ్వాలని కోరనున్నారు.

5g update
5g update

India 5G Services: దేశంలో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈనెల 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రిలయన్స్‌ జియో 4 నగరాల్లో ప్రయోగాత్మక (బీటా) సేవలు అందిస్తున్నట్లు ప్రకటించగా; భారతీ ఎయిర్‌టెల్‌ 8 నగరాల్లో వాణిజ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపాయి. వచ్చే ఏడాది కల్లా ఈ సేవలను గణనీయంగా విస్తరిస్తామని ప్రకటించాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే '5జీ రెడీ' అని ప్రకటితమైన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు.

అయితే యాపిల్‌ తాజా ఆవిష్కరణ అయిన ఐఫోన్‌ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన 5జీ మోడళ్లు; శాంసంగ్‌కు చెందిన పలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కూడా దేశంలో 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌, వివో, షియోమీ వంటి మొబైల్‌ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్‌ తయారీ సంస్థలు 'ప్రాధాన్యత' ఇవ్వాలని కోరనున్నారు.

  • యాపిల్‌ తన ఐఫోన్లను ఎయిర్‌టెల్‌, జియో 5జీ నెట్‌వర్క్‌లపై పరీక్షిస్తూ, 5జీ సేవలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను రూపొందిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
  • శామ్‌సంగ్‌ ప్రీమియం- కొన్ని మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్లనూ 5జీ కోసమే విడుదల చేసింది. ఈ సంస్థ కూడా తన ఫోన్లకు అప్‌డేట్‌ ఇవ్వనుంది.
  • దేశీయంగా 5జీ డౌన్‌లోడ్‌ వేగంలో జియో ముందున్నట్లు బ్రాడ్‌బ్యాండ్‌ వేగాన్ని పరిశోధించే ఓక్లా తెలిపింది. సెకనుకు సగటున 600 మెగాబైట్‌ వేగం జియో నెట్‌వర్క్‌పై, 515 ఎంబీపీఎస్‌ వేగం ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌పై లభించినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్‌ ఐడియా 4జీ విస్తరణ
వొడాఫోన్‌ ఐడియా (వీఐ), ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 'వీఐ గిగానెట్‌ 4జీ నెట్‌వర్క్‌' పేరుతో తన నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని విస్తరించింది. దీనివల్ల వినియోగదార్లకు మెరుగైన 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, డౌన్‌లోడ్‌- అప్‌లోడ్‌ వేగం గణనీయంగా పెరిగిందని వొడాఫోన్‌ ఐడియా క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్ధార్థ జైన్‌ వెల్లడించారు. గత నాలుగేళ్లలో 11035 బ్రాడ్‌బ్యాండ్‌ టవర్లను 'అప్‌గ్రేడ్‌' చేసినందున తెలుగురాష్ట్రాల్లో 76.9 శాతం ప్రాంతాలకు ఈ కవరేజీ విస్తరించినట్లు అవుతోందని వెల్లడించింది. తమ 3జీ వినియోగదార్లు అందరినీ 4జీకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తమ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉందన్నారు.

'అదానీ'కి పూర్తి స్థాయి టెలికాం లైసెన్సు!
దేశంలో అన్ని టెలికాం సేవలు అందించేలా అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు యూనిఫైడ్‌ లైసెన్సు మంజూరైందని ఇద్దరు అధికారులు తెలిపారు. 'అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు యూనిఫైడ్‌ లైసెన్స్‌(ఏఎస్‌) సోమవారం లభించినట్లు' వారు వెల్లడించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌ ఇటీవలి 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో, 26 గిగాహెర్ట్స్‌ మిల్లీమీటర్‌ వేవ్‌ బాండ్‌లో 400 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు వినియోగించుకునేలా రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. తన డేటా సెంటర్లకు; సూపర్‌ యాప్‌ (విద్యుత్‌ పంపిణీ నుంచి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గ్యాస్‌ రిటైలింగ్‌ వ్యాపారాలకు మద్దతునిచ్చేందుకు తీసుకొస్తున్న యాప్‌) కోసమే ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తామని అప్పట్లో అదానీ గ్రూప్‌ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.