ETV Bharat / business

బ్యాడ్ న్యూస్.. హోంలోన్స్​పై వడ్డీ రేట్లు మళ్లీ పెంపు.. నెలలో మూడోసారి!

author img

By

Published : Jun 1, 2022, 4:08 PM IST

HDFC increases
గృహ రుణాలు తీసుకున్న వారికి హెచ్​డీఎఫ్​సీ షాక్

HDFC home loan interest: గృహరుణాలు తీసుకున్న వారికి మరో షాక్ ఇచ్చింది హెచ్​డీఎఫ్​సీ. నెల వ్యవధిలోనే మూడో సారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. మరోవైపు మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వాహన విక్రయాలు భారీగా పెరిగాయి.

HDFC interest rates: గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది హెచ్​డీఎఫ్​సీ. రిటైల్​ ప్రైమ్​ లెండింగ్ రేట్​(ఆర్​పీఎల్​ఆర్​)ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. జూన్​ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్క బేసిస్ పాయింట్​ అంటే 0.01శాతంగా లెక్కగడతారు.
ఈ పెంపుతో ఒక్కనెల వ్యవధిలో వడ్డీ రేట్లను హెచ్​డీఎఫ్​సీ మూడు సార్లు పెంచినట్లయింది. ఇప్పటికే మే 1న 5 బేసిస్ పాయింట్లు, మే 7న 35 బేసిస్ పాయింట్లు పెంచింది. వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఆకస్మికంగా ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈఎంఐలు కట్టేవారిపై అదనపు భారం పడింది.

ఇతర బిజినెస్ వార్తలు.. సంక్షిప్తంగా...
మేలో రూ.1.41లక్షల కోట్లు: మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. గతేడాది మే నెలతో పోల్చితే ఇది 44శాతం అధికం. అయితే ఈ ఏడాది ఏప్రిల్​లో వచ్చిన రూ.1.68లక్షల కోట్లతో పోల్చితే మాత్రం ఇది తక్కువే. ఈ ఏడాది మార్చి నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.42లక్షల కోట్లుగా ఉన్నాయి.

తగ్గిన నిత్యావసరాల కొనుగోళ్లు..: జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్​ఎంసీజీ పరిశ్రమ 5.3శాతం క్షీణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆహారపు, నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గినట్లు పేర్కొంది. గత మూడు త్రైమాసికాలలో ఇదే అత్యధిక క్షీణత అని నీల్సన్​ఐక్యూ రిటైల్ ఇంటెలిజెన్స్ బృందం తెలిపింది. మరోవైపు తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్ల మూత పడ్డ చిన్న చిన్న తయారీ సంస్థల సంఖ్య మరింత పెరిగినట్లు నివేదిక చెప్పింది.

పెరిగిన వాహన విక్రయాలు: మే నెలలో 1,61,413 యూనిట్లు విక్రయించినట్లు దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బుధవారం వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య కేవలం 46,555 యూనిట్లుగానే ఉంది. అయితే అప్పుడు కరోనా ప్రభావం ఆటోమొబైల్ రంగం తీవ్రంగా ప్రభావితమై కొనుగోళ్లు భారీగా పడిపోయాయి.

  • మే నెలలో 76,210 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్​ తెలిపింది. గతేడాడి ఇదే నెలలో విక్రయించిన 24,552 యూనిట్లతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని పేర్కొంది.
  • మేలో 18,718 యూనిట్లను విక్రయించినట్లు కియా ఇండియా ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఇది 69శాతం అధికమని చెప్పింది.
  • టొయోటా కిర్లోస్కార్ విక్రయాలు మేలో 10,216 యూనిట్లకు పెరిగినట్ల సంస్థ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఇది 14రెట్లు అధికం కావడం గమనార్హం.
  • మే నెలలో 3,02,982 యూనిట్లను విక్రయించిననట్లు టీవీఎస్​ మోటార్ సంస్థ వెల్లడించింది. ఇందులో 2,87,058 యూనిట్లు ద్విచక్రవాహనాలేనని పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో విక్రయాలు 1,66,889 యూనిట్లకే పరిమితమయ్యాయు. అప్పుడు కరోనా ప్రభావం వల్ల ద్విచక్ర వాహనాల కోనుగోళ్లు కూడా తగ్గాయి.
  • బజాజ్​ ఆటో మేలో 2,75,868 యూనిట్లను విక్రయించింది. గతేడాది మేలో జరిగిన విక్రయాలు 2,71,862తో పోల్చితే ఇది స్వల్ప వృద్ధే.

ఇదీ చదవండి: జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.