ETV Bharat / business

గుజరాత్‌ కంపెనీ వద్ద రూ.వెయ్యి కోట్ల నల్లధనం.. ఒప్పోకు రూ.4వేల కోట్ల నోటీసు

author img

By

Published : Aug 3, 2022, 7:38 AM IST

గుజరాత్​కు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థపై దాడులు చేసిన ఐటీ శాఖ రూ.వెయ్యి కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించింది. జులై 20న హైదరాబాద్‌తో పాటు ఖేడా, అహ్మదాబాద్‌, ముంబయి, కోల్‌కతాలలోని కంపెనీకి చెందిన 58 ప్రాంగణాల్లో సోదాలు జరిగినట్లు సీబీడీటీ తెలిపింది. మరోవైపు, పన్ను ఎగవేత ఆరోపణలపై ఒప్పోకు రెవెన్యూ ఇంటలిజెన్స్‌ విభాగం రూ.4389 కోట్ల నోటీసు జారీ చేసింది.

gujarat company tax evasion
gujarat company tax evasion

గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపార దిగ్గజంపై ఆదాయ పన్ను(ఐటీ) విభాగం జరిపిన సోదాల్లో రూ.1,000 కోట్లకు పైగా ‘లెక్కల్లో చూపించని’ ఆదాయం కనిపించిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఇందులో రూ.24 కోట్ల నగదుతో పాటు రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు, బులియన్‌ తదితరాలను జప్తు చేసినట్లు తెలిపింది. జులై 20న హైదరాబాద్‌తో పాటు ఖేడా, అహ్మదాబాద్‌, ముంబయి, కోల్‌కతాలలోని కంపెనీకి చెందిన 58 ప్రాంగణాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. ఈ ‘ప్రముఖ’ కంపెనీ జౌళి, రసాయనాలు, ప్యాకేజింగ్‌, స్థిరాస్తి, విద్యా రంగాల్లో వ్యాపారాలున్నాయని సీబీడీటీ తెలిపింది.

షేర్ల ధరల్లోనూ అవకతవకలు: ఐటీ దాడుల సమయంలో పత్రాలు, డిజిటల్‌ డేటాను జప్తు చేశారు. ఖాతా పుస్తకాల వెలుపల పలు నగదు విక్రయాలను జరపడం; బోగస్‌ కొనుగోళ్ల బుకింగ్‌, స్థిరాస్తి లావాదేవీలకు నగదు రశీదులు ఇవ్వడం ద్వారా ‘పెద్ద స్థాయి’లో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సీబీడీటీ పేర్కొంది. ‘కోల్‌కతాకు చెందిన డొల్ల కంపెనీల నుంచి లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంద’ని వివరించింది. తన కంపెనీలకు చెందిన షేర్ల ధరలను ఆపరేటర్ల ద్వారా హెచ్చుతగ్గులకు గురి చేసే లాభాలను పొందిందనీ తెలిపింది.

పన్ను ఎగవేసిన ఒప్పో, వివో, షియోమీ
చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు.

ఒప్పోకు రూ.4,389 కోట్ల నోటీసు: ఒప్పోకు మొత్తం రూ.4389 కోట్ల కస్టమ్స్‌ సుంకానికి గాను రెవెన్యూ ఇంటలిజెన్స్‌ విభాగం(డీఆర్‌ఐ) నోటీసు జారీ చేసింది. కొన్ని వస్తువులకు సంబంధించిన వివరాలను తప్పుగా ఇవ్వడం వల్ల కస్టమ్స్‌ సుంకం తక్కువగా వచ్చిందని.. మొత్తం మీద పన్ను రూ.2981 కోట్లుగానే కనిపించేలా చేశారని ఆమె తెలిపారు. కస్టమ్స్‌ సుంకం కోసం దిగుమతి వస్తువుల విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపడం వల్ల పన్ను ఎగవేత రూ.1408 కోట్ల వరకు ఉండొచ్చని అన్నారు. కంపెనీ స్వచ్ఛందంగా రూ.450 కోట్లు కట్టిందని.. అయితే నోటీసు రూ.4389 కోట్లకు ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. షియోమీకి మూడు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని.. మొత్తం రూ.653 కోట్ల పన్ను నోటీస్‌ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే కంపెనీ రూ.46 లక్షలు మాత్రమే డిపాజిట్‌ చేసిందన్నారు. వివో ఇండియాకు రూ.2217 కోట్ల పన్ను నోటీసులు పంపగా.. రూ.60 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేసినట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.