ETV Bharat / business

వాట్సాప్​ వాడకపోయినా మన మాటలు రికార్డ్!.. ఆధారాలతో బట్టబయలు.. కేంద్రం సీరియస్!

author img

By

Published : May 10, 2023, 1:53 PM IST

Updated : May 10, 2023, 2:08 PM IST

whatsapp privacy breach
whatsapp privacy breach

Whatsapp Privacy Breach : స్మార్ట్​ఫోన్​ వాడని సమయంలోనూ వాట్సాప్​ మన మాటలు రికార్డ్ చేస్తోందా? యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందా? ఔననే అంటున్నారు ట్విట్టర్​లో పని చేసే ఓ టెక్ నిపుణుడు. అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. ఈ వ్యవహారాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Whatsapp Privacy Breach : స్మార్ట్​ఫోన్​ ఉపయోగించని సమయంలోనూ వాట్సాప్​.. మైక్రోఫోన్​ను ఉపయోగిస్తోందన్న ఆరోపణలు నెట్టింట కలకలం రేపాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందన్న ఆందోళనలకు దారితీశాయి. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం స్పందించింది. నిజానిజాలు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వాట్సాప్ ఏం చేస్తోంది?
ట్విట్టర్​లో ఇంజినీరింగ్ డైరెక్టర్​గా పని చేసే ఫోవద్​ దబిరి శనివారం ఓ ట్వీట్ చేశారు. మన మాటల్ని వాట్సాప్​ రహస్యంగా రికార్డు చేస్తోందని ఆరోపించారు. తాను నిద్రపోతున్న సమయంలోనూ.. తన స్మార్ట్​ఫోన్​లోని మైక్రోఫోన్​ను వాట్సాప్​ ఉపయోగించిందని చెప్పారు. ఆ తర్వాత తాను నిద్రలేచి స్మార్ట్​ఫోన్​ వాడడం మొదలుపెట్టాక.. మైక్రోఫోన్​ పని చేస్తూనే ఉందని తెలిపారు. ఇలా ఉదయం 4.20 నుంచి 6.53 మధ్య మైక్రోఫోన్​ను వాట్సాప్ 9 సార్లు ఆన్ చేసిందని వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ట్విట్టర్​లో షేర్ చేశారు ఫోవద్ దబిరి. అసలు ఏం జరుగుతోందని వాట్సాప్​ను ప్రశ్నించారు.

వాట్సాప్​ను నమ్మలేం!
బుధవారం మధ్యాహ్నానికి 6.7కోట్ల వ్యూస్​తో దబిరి ట్వీట్​ వైరల్ అయింది. అనేక మంది యూజర్లు వాట్సాప్​పై మండిపడ్డారు. టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. ఈ వ్యవహారంపై స్పందించారు. వాట్సాప్​ను నమ్మలేమంటూ దబిరి ట్వీట్​కు రిప్లై ఇచ్చారు.

స్పందించిన ఐటీ మంత్రి
వాట్సాప్​-మైక్రోఫోన్​ రికార్డింగ్​కు సంబంధించి దబిరి ట్వీట్​పై భారత ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్​ బుధవారం స్పందించారు. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందేమో ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యూజర్లకు రక్షణగా నిలిచే "డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు" సిద్ధమవుతోందని మంత్రి గుర్తు చేశారు.

వాట్సాప్​ వివరణ
ఫోవద్ దబిరి ట్వీట్​ వైరల్ అయిన నేపథ్యంలో వాట్సాప్​ వివరణ ఇచ్చింది. "పిక్సల్ ఫోన్​, వాట్సాప్​నకు సంబంధించి ట్వీట్ చేసిన ట్విట్టర్ ఇంజినీర్​తో మేము మాట్లాడుతున్నాం. ఆండ్రాయిడ్​లోని ఓ బగ్ కారణంగానే ఇలా జరుగుతోందని మేము భావిస్తున్నాం. ప్రైవసీ డ్యాష్​బోర్డ్​లోని సమాచారాన్ని ఆ బగ్.. తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని గూగుల్​ను కోరాం" అని వాట్సాప్​ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

మైక్రోఫోన్​ సెట్టింగ్స్​ విషయంలో యూజర్లకే పూర్తి నియంత్రణ ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. "ఒక్కసారి పర్మిషన్ ఇస్తే.. కాల్, రికార్డింగ్, వాయిస్ నోట్, వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాత్రమే వాట్సాప్.. స్మార్ట్​ఫోన్​లోని మైక్రోఫోన్​ను ఉపయోగిస్తుంది. ఈ సంభాషణలు కూడా ఎండ్​ టు ఎండ్ ఎన్​క్రిప్ట్ అయి ఉంటాయి. వాటిని వాట్సాప్ వినలేదు" అని చెబుతూ యాజర్ల భయాల్ని తొలగించే ప్రయత్నం చేసింది వాట్సాప్.

ట్విట్టర్​లో వాట్సాప్​ తరహా ఫీచర్స్​!
వాట్సాప్​లో వ్యక్తిగత గోప్యతపై అనుమానాల మధ్య.. ట్విట్టర్​ కీలక ప్రకటన చేసింది. వాట్సాప్​లో ఉన్న వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను ట్విట్టర్​లోనూ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.

"ట్విట్టర్​ లేటెస్ట్​ వెర్షన్​ యాప్​తో.. ట్వీట్ థ్రెడ్​లోని ఏదైనా మెసేజ్​కు మీరు డీఎం(డైరెక్ట్ మెసేజ్) చేయవచ్చు. ఎమోజీ రియాక్షన్స్ ఇవ్వొచ్చు. ఎన్​క్రిప్టెడ్ DMs V1.0 గురువారమే అందుబాటులోకి వస్తుంది. తర్వాత మరింత అప్డేట్ అవుతుంది. మీ డైరెక్ట్ మెసేజ్​లను నేను కూడా చూడలేనంతగా ఎన్​క్రిప్ట్ చేయడమే అసలు పరీక్ష. మీ ట్విట్టర్​ హ్యాండిల్​ నుంచి ఎవరితోనైనా వాయిస్, వీడియో చాట్ చేసే అవకాశం త్వరలోనే వస్తుంది. అదే జరిగితే.. మీ మొబైల్ నంబర్​ ఇవ్వకుండానే ఈ ప్రపంచంలో ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు." అని బుధవారం ఓ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.

Last Updated :May 10, 2023, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.