ETV Bharat / business

గౌతమ్ అదానీ ఇంట పెళ్లి సందడి.. నిరాడంబరంగా కుమారుడి నిశ్చితార్థం

author img

By

Published : Mar 14, 2023, 9:26 PM IST

gautam-adani-son-engagement
గౌతమ్ అదానీ కొడుకు నిశ్చితార్థం

గౌతమ్​ అదానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్​ అదానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. జీత్‌ అదానీకి, దివా జైమిన్‌ షా తో ఆదివారం నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన చిన్న కుమారుడు జీత్‌ అదానీ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అదానీ చిన్న కుమారుడు జీత్‌ అదానీకి, దివా జైమిన్‌ షా తో నిశ్చితార్థం జరిగింది. ఆదివారం అహ్మదాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. జీత్ అదానీ- దివా పెళ్లి తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

జీత్ అదానీ.. యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జీత్‌ అదానీ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే దివా.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కూతురు.

అదానీ గ్రూప్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. అదానీ ఎయిర్‌పోర్ట్‌ వ్యాపారంతోపాటు, అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌ బాధ్యతలను కూడా జీత్ అదానీ నిర్వర్తిస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అదానీ గ్రూప్ త్వరలో తీసుకురాబోతున్న సూపర్‌ యాప్‌ను డిజిటల్‌ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తోంది. అదానీ పెద్ద కుమారుడైన కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లిమిటెడ్‌ సీఈవో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

అమెరికాకు చెందిన హిండెన్​బర్గ్​ నివేదిక నేపథ్యంలో వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ భారీగా సంపదను కోల్పోయారు. ఆయన సంపద ఎంత వేగంగా వృద్ధి చెందిందో.. అంతే వేగంగా కోల్పోయారు.
హిండెన్​బర్గ్ వివాదం..
షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక.. దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వం పెట్టుబడిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు పట్టుబట్టాయి. అదానీ గ్రూప్​పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. అయినా పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థల్లో ఈ నివేదిక ఆందోళన రేకెత్తించింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. ఫలితంగా గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపదపై అది ప్రభావం చూపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.