ETV Bharat / business

'భారత్​లో మరిన్ని పెట్టుబడులకు సిద్ధం'.. ప్రధాని మోదీతో యాపిల్​ సీఈఓ టిమ్ కుక్​

author img

By

Published : Apr 19, 2023, 10:03 PM IST

Updated : Apr 19, 2023, 10:50 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​. దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Apple Ceo tim cook met pm modi
Apple Ceo tim cook met pm modi

యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్​లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్​ కంపెనీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు టిమ్​ కుక్​. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం సహా.. భారత్​లో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను ప్రస్తావించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భారత్​లో విద్య, పర్యావరణం, టెక్నాలజీ సహా ఇతర రంగాలు మరింత వృద్ధి చెందడంలో సహాయ పడేందుకు.. అలాగే దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టిమ్​ కుక్​ తెలిపారు.

టిమ్​ కుక్​.. చివరిసారిగా 2016లో భారత్​ను సందర్శించారు. మళ్లీ దాదాపు 7 సంవత్సరాల తర్వాత భారత్​లో పర్యటిస్తున్నారు. భారత్​లో యాపిల్​ అడుగు పెట్టి 25 వసంతాలు గడిచిన సందర్భంగా దేశంలో మొట్టమొదటి యాపిల్​ రిటైల్​ స్టోర్​ను మంగళవారం ముంబయిలో ప్రారంభించారు. ఇక గురువారం రెండో యాపిల్​ అవుట్​లెట్​ను దిల్లీలో ప్రారంభించనున్నారు కుక్​. ఈ పర్యటనల నేపథ్యంలో ఆయన బుధవారం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

దేశంలో తొలి యాపిల్​ స్టోర్​..!
దేశంలో తమ తొలి రిటైల్ అవుట్​లెట్​ను ముంబయిలో ప్రారంభించింది యాపిల్. ఈ స్టోర్​ను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 18(మంగళవారం)న గ్రాండ్​గా ఓపెన్​ చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో ఈ స్టోర్​ను ఏర్పాటు చేసింది యాపిల్​. ఈ కార్యక్రమంలో స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్​ కుక్​ దగ్గరుండి కస్టమర్లకు స్వాగతం పలికారు.

Apple Ceo tim cook met pm modi
ముంబయిలోని యాపిల్ రిటైల్ స్టోర్

దేశంలో యాపిల్ అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు కంపెనీ ఎగ్జిక్యూటివ్​లు. మొత్తంగా యాపిల్ సంస్థకు దేశంలో 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను భవిష్యత్తులో 10 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్టోర్​లను ప్రపంచంలో ఉన్న యాపిల్​ షోరూం​ల మాదిరిగానే రూపొందించినప్పటికీ.. స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ స్టోర్​లోని ఒక్కో ఫ్లోర్​లో సుమారు 100 మంది సిబ్బంది ఉంటారు. వీరు ఏకంగా 18 భాషల్లో కస్టమర్లతో మాట్లాడగలరు.

భారతదేశంలో 2020లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన యాపిల్.. రిటైల్​ స్టోర్​ను ప్రారంభించాలని గత కొంతకాలంగా భావిస్తున్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఎట్టకేలకు ముంబయిలో తమ మొదటి రిటైల్​ స్టోర్​ను తెరిచింది యాపిల్​. అలాగే దిల్లీలో రెండో యాపిల్ స్టోర్​ను గురువారం టిమ్​ కుక్​ ప్రారంభిస్తారు.

Last Updated :Apr 19, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.