ETV Bharat / business

మార్కెట్లపై ఒమిక్రాన్​ పంజా- సెన్సెక్స్​ 1190 పాయింట్లు డౌన్

author img

By

Published : Dec 20, 2021, 3:55 PM IST

Stock markets
మార్కెట్లపై బేర్​ పంజా

stock market crash today: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్​ కేసులు పెరుగుదల భయాలతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ 1190 పాయింట్లు నష్టపోయి 56వేల దిగువకు చేరింది. నిఫ్టీ 371 పాయింట్ల దిగజారింది.

stock market crash today: ఒమిక్రాన్​ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ద్రవ్యోల్బణ భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 1190 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారింది.

విదేశీ సంస్థాగత మదుపరులు సొమ్మును తరలించటమూ మార్కెట్లను దెబ్బతీసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. 1000 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడింగ్​ను మొదలు పెట్టిన సెన్సెక్స్​ అంతకంతకూ దిగజారింది. ఒకానొక దశలో బీఎస్​ఈ సెన్సెక్స్​ 1,849 పాయింట్లు(3.24 శాతం) నష్టపోయి.. 55,162కు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని.. 1190 పాయింట్ల నష్టంతో.. 55,822 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 371 పాయింట్ల నష్టంతో.. 16,614 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి...

సిప్లా, హెచ్​యూఎల్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ లాభాలతో ముగిశాయి. బీపీసీఎల్​, టాటాస్టీల్​, టాటా మోటార్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐలు 4 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

భారీ పతనానికి కారణాలు..

  • అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను మార్చి నాటికి పెంచడంపై అధికారులు బహిరంగంగా సంకేతాలు ఇవ్వడం వల్ల మిగిలిన మార్కెట్ల నుంచి నిధుల మళ్లింపు మొదలైంది. ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్‌ ఇండెక్స్‌ చేరింది. ఇది ఒక్క శుక్రవారమే 0.7శాతం పెరిగింది. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. దీంతోపాటు వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్లు పెంచి 0.25కు చేర్చింది. ఇటీవల కాలంలో తొలిసారి వడ్డీరేట్లను పెంచింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండే. త్వరలో ఫెడ్‌ ఈ బాట పట్టనుంది.
  • అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాపించిన వేరియంట్‌గా ఒమిక్రాన్‌ నిలిచే అవకాశం ఉండటం ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. అమెరికన్లు బూస్టర్‌ షాట్లు తీసుకోవాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. దీంతో పాటు మాస్కులు ధరించడం, శీతాకాలంలో ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటివి చేయాల్సిందిగా ఆదివారం సూచించారు.
  • ఐరోపా దేశాల్లో మరోమారు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉండటం వల్ల మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అత్యధికంగా షాపింగ్‌లు జరిగే క్రిస్మస్‌, నూతన సంవత్సర సీజన్‌లో లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్‌ లాక్‌డౌన్‌ విధించింది.
  • మార్కెట్లోని ప్రధాన సూచీల్లో విక్రయాల జోరు ఎక్కువగా ఉంది. దీంతోపాటు నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 3 శాతానికి పైగా పతనం అయ్యాయి. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 1.7శాతం కుంగింది. దక్షిణ కొరియా సూచీలు 1.2శాతం పతనం అయ్యాయి. ఇక ఫ్యూచర్‌ మార్కెట్లలో ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.8శాతం, నాస్‌డాక్‌ ఒక శాతం, యూరోస్టాక్స్‌ 50 1.1శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 1.0 విలువ కోల్పోయాయి.
  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌ఐఐ) భారీగా విక్రయాలు జరిపారు. డిసెంబర్‌లో సోమవారం నాటికి రూ.26,687 కోట్ల పొజిషన్లను అమ్మేశారు. నవంబర్‌ నెల మొత్తంలో రూ.39,901 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్యాపిటల్‌ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు నికర విక్రేతలుగా ఉన్నారు. ఒక్క శుక్రవారమే రూ.2,069 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. ఈ విక్రయాల ఫలితంగా నెల రోజుల వ్యవధిలో సెన్సెక్స్‌, నిఫ్టీల్లో 6శాతానికి పైగా దిద్దుబాటు వచ్చినట్లు అంచనా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.