ETV Bharat / business

ఏడాది చివరకు 55,000 ఎగువకు సెన్సెక్స్‌!

author img

By

Published : May 19, 2021, 7:06 AM IST

2021 ద్వితీయార్థంలో భారతీయ స్టాక్​మార్కెట్లకు మెరుగైన ప్రతిఫలాలు వస్తాయని ఓ అమెరికా బ్రోకరేజీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ విధానాలు, ఆర్​బీఐ పాలసీలు, కార్పొరేట్​ ఫలితాలు, మార్కెట్​లో స్థిరత్వం లాంటి అంశాలు భారతీయ సూచీలకు సానుకూలంగా ఉన్నాయంటూ మోర్గాన్​ స్టాన్లీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

bull
ఏడాది చివరకు సెన్సెక్స్‌ 55,000!

ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో కొనసాగుతున్న స్థిరీకరణ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన ప్రతిఫలాలు వస్తాయని ఒక అమెరికా బ్రోకరేజీ అంచనా వేస్తోంది. వృద్ధి, స్థిరత్వం, ప్రభుత్వ, ఆర్‌బీఐ పాలసీలు, కార్పొరేట్‌ ఫలితాలు.. ఇలా అన్ని మూలాలూ మార్కెట్లకు సానుకూలంగానే ఉంటున్నాయని మోర్గాన్‌ స్టాన్లీలోని విశ్లేషకులు అంటున్నారు.

కరోనా కేసుల మలివిడత నుంచి మదుపర్లలో ఆందోళన మొదలైంది. అందుకు అనుగుణంగానే మార్చి 10 నుంచి మార్కెట్‌ 3 శాతం నష్టపోయింది కూడా. సెంటిమెంటు సంకేతాలన్నీ ప్రస్తుతానికి ప్రతికూలంగానే ఉన్నాయని.. ద్వితీయార్థంలోనే అవి మెరుగవుతాయని వారంటున్నారు.

  • 2021 చివరకు సెన్సెక్స్‌ 55,000 పాయింట్లకు చేరొచ్చన్న లక్ష్యాన్ని మోర్గాన్‌ స్టాన్లీ కొనసాగించింది. ఇది నిజం కావడానికి 50 శాతం అవకాశాలున్నాయని చెప్పింది.
  • ఏడాది చివరకు 'బుల్‌' పరిస్థితుల్లో సెన్సెక్స్‌ 61,000 పాయింట్లకు.. బేర్‌ పరిస్థితుల్లో 41,000 పాయింట్లకు చేరొచ్చని జోస్యం చెప్పింది.
  • బుల్‌ రంకె వేయడానికి 30 శాతం అవకాశాలున్నాయని తెలిపింది. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, రికవరీ పెరగడం, అంతర్జాతీయ ఉద్దీపనలు ఇలాంటివి ఇందుకు దోహదం చేయొచ్చని అంటోంది.
  • బేర్‌ పట్టు బిగించడానికి 20 శాతం మేర అవకాశం ఉందని.. కేసులు పెరుగుతూ వెళ్లినా, భారత్‌లో ఎటువంటి విధాన స్పందన లేకున్నా, వృద్ధిపై ప్రభావం పడి మార్కెట్‌పైనా చూపించొచ్చని అంచనా వేసింది.

మదుపర్లు ఏం చేయాలంటే..

ఇది 'స్టాక్‌ పికర్స్‌' మార్కెట్‌ అని.. మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియో వ్యూహంలో భాగంగా దేశీయ సైక్లికల్స్‌ షేర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మేలని మోర్గాన్‌ స్టాన్లీ సూచిస్తోంది. పారిశ్రామికోత్పత్తి రెండంకెలకు చేరుతుండడం.. వాస్తవ జీడీపీ వృద్ధికి, 10 ఏళ్ల బాండ్‌ ప్రతిఫలాలకు మధ్య అంతరం చూస్తుంటే మార్కెట్లు మరింత రాణించొచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

భారత స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని బట్టి ఇతర వర్థమాన మార్కెట్ల కంటే మెరుగ్గానే రాణించగలదని అంచనా కట్టింది. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభంతో పోలిస్తే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు వెలువడే అవకాశాలూ ఉన్నాయని అంటోంది.

ఇదీ చూడండి: అక్షయ తృతీయ అమ్మకాలకు కొవిడ్ సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.