జోరుగా వ్యాక్సినేషన్.. మరి వృద్ధి రేటు సంగతేంటి?

author img

By

Published : Oct 12, 2021, 3:20 PM IST

Vaccination impact on Growth rate

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నెలలో 100 కోట్ల డోసులు మార్క్​ను అందుకునే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో టీకా ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీలోనూ వేగం పెరుగుతుందా? వృద్ధి రేటు రికవరీకి వ్యాక్సినేషన్ మాత్రమే సరిపోతుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెలలో భారత్​ 100 కోట్ల డోసులు పంపిణీ చేసిన దేశంగా ఘనతను సాధించే అవకాశాలున్నాయి. అయితే భారత్​ తిరిగి వృద్ధి పథంలో దూసుకుపోవాలంటే.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా సాగటం మాత్రమే చాలదని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఏడాది జులై నుంచి జీడీపీ పరుగులు పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు దేశంలోని 80 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుని ఉంటారని ఆక్స్​ఫర్డ్​​ ఎకనామిక్స్​ నివేదిక అంచనా వేసింది.

దేశంలో వ్యాక్సినేషన్​ ట్రెండ్స్​, రిజర్వ్​ బ్యాంక్​ చేసే కస్టమర్​ కాన్ఫిడెన్స్ సర్వే.. పీఎంఐ డేటా, పారశ్రామికోత్పత్తి లెక్కలు సహా ఇతర ఇండికేటర్స్​ను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో.. భారత వృద్ధి రేటు రానున్న 8-9 నెలల వరకు స్తబ్దుగా ఉండొచ్చని వెల్లడైంది.

'ఆగస్టు నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతమైనప్పటికీ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి రేటు స్తబ్దుగా ఉంటుందని మేం భావిస్తున్నాం.' అని ఆక్స్​ఫర్డ్​ ఎకనామిక్స్​ భారత్​, దక్షిణాసియా ప్రాంతీయ అధినేత్రి ప్రియాంక కిశోర్​ నివేదికలో పేర్కొన్నారు.

వృద్ధి రేటు ఎందుకు స్తబ్దుగా ఉండొచ్చు?

వృద్ధి రేటులో పెద్దగా మార్పు ఉండకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల వ్యాక్సినేషన్ ఊపందుకున్నా.. అందులో అధిక మొత్తం మొదటి డోసు​లే కావడం గమనార్హం. ప్రభుత్వ పాలసీ ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్​ 12-16 వారాలుగా ఉంది. దీనితో అందరికీ వ్యాక్సినేషన్​ పూర్తవ్వాలంటే.. ఇంకా చాలా సమయం పడుతుంది.

ఒక అంచనా ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్​ నాటికి 40 శాతం మందికి, 2022 మార్చి నాటికి 70 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిణామం వచ్చే ఏడాది ఆరంభంలో సెంటిమెంట్​ను బలపరిచే వీలుంది. దీని వల్ల వినియోగం కూడా పెరగొచ్చు అని ప్రియాంకా కిశోర్​ అన్నారు. అయితే తక్కువ మొత్తం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తయితే.. సేవలు, తయారీ రంగ రికవరీపై ప్రభావం పడొచ్చని ఆమె హెచ్చరించారు.

వృద్ధి రేటు ఊపందుకోవాలంటే.. ప్రయాణాలు, విద్యుత్​ వినియోగం మెరుగవ్వడం మాత్రమే చాలదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

అగ్రిగేట్​ గూగుల్ మొబిలిటీ డేటాను కూడా పరిశోధకులు విశ్లేషించారు.. ఈ ఏడాది మేలో ఇది -50.5 వద్ద ఉండగా.. సెప్టెంబర్​ చివరి నాటికి ఇది 4.5 కు పెరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించడం ఇందుకు కలిసొచ్చింది.

విద్యుత్ డిమాండ్​ చూసుకుంటే.. మేలో 6.3 శాతంగా ఉంటే ఆగస్టులో 17.4 శాతానికి పెరిగింది. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్​ (పీఎంఐ) మళ్లీ వృద్ధిబాట పట్టినట్లు తెలిసింది.

అయితే ప్రయాణాలు, విద్యుత్​ వినియోగం పెరగటం, పీఎంఐ వృద్ధి బాట పట్టడం వంటివి సానుకూల అంశాలే అయినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు అంత సానుకూలంగా లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తయారీ రంగంతో పోల్చుకుంటే.. ఆతిథ్య, పర్యటక రంగాలు ఇంకా తేరుకోలేదని చెబుతున్నాయి. అయితే కొవిడ్ మూడో దశ ముప్పు భయాలు ఇంకా కొనసాగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రీఓపెనింగ్​కు సవాళ్లు..

రాష్ట్రాలు తిరిగి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించేందుకు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా కేరళలానే ఇతర రాష్ట్రాల్లో కూడా మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉండటం, వ్యాక్సినేషన్​ కంటే.. కేసుల ఆధారంగానే రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తుండటం వంటివి ఆందోళన కలిగించే అంశాలని నిపుణులు చెబుతున్నారు.

టీకా ప్రక్రియ వేగం మాత్రమే చాలదు..

సెప్టెంబర్ చివరినాటికి రోజుకు సగటున 77 లక్షల మంది టీకా తీసుకుంటున్నారు. ఏప్రిల్​లో ఇది 27 లక్షలుగా ఉంది. అయితే వ్యాక్సినేషన్ వేగం పెరిగినప్పటికీ.. ఇంకా పెద్ద మొత్తంలో జనాలు మొదటి డోసు మాత్రమే తీసుకోవడం గమనార్హం. రెండో డోసు పూర్తయితేనే సురక్షితంగా భావించాలని విశ్లేషకులు అంటున్నారు.

ప్రాంతీయ అసమానతలు..

సెప్టెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 17 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్​ వేసుకున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. టీకాల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. చిన్న, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.. ఇతర ప్రధానమైన రాష్ట్రాలతో పోలిస్తే వ్యాక్సినేషన్​లో ముందు వరుసలో ఉన్నాయి.

స్పష్టంగా చెప్పాలంటే దేశ జీడీపీలో 37 శాతం వాటా.. ఉత్తర్​ ప్రదేశ్​, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్ వంటి రాష్ట్రాలదే. అయితే ఆయా రాష్ట్రాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటం, ప్రయాణాలపై ఆంక్షలు లేకపోవడం వల్ల కరోనా కేసులు పెరిగే ప్రమాదముందని ఆక్స్​ఫర్డ్​ నివేదిక వివరించింది.

ఆందోళన సంకేతాలు..

పండుగ సీజన్​లో కరోనా మూడో దశ ముప్పు భయాలు.. వినియోగదారు విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్​బీఐ డేటా ప్రకారం.. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్​ సూచీ జూన్​ల జీవనకాల కనిష్ఠమైన 48.5కు పడిపోయింది. జులై నుంచి ఇది కాస్త మెరుగవుతున్నప్పటికీ.. జనవరిలో (117.1)తో పోలిస్తే ఇంకా చాలా దూరంలో ఉంది.

వ్యాక్సినేషన్​ రేటు భారీగా పెరిగితే తప్ప.. వినియోగదారుల్లో విశ్వాసం మెరుగయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.