ETV Bharat / business

'డిజిటల్ రూపీ' కథేంటి? కొత్త కరెన్సీతో లాభాలుంటాయా?

author img

By

Published : Feb 1, 2022, 5:57 PM IST

Digital Rupee: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్​లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్​బీఐ దీన్ని జారీ చేస్తుందని చెప్పారు. దీని చలామణి ఎలా ఉంటుంది? క్రిప్టో కరెన్సీకి, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? దీనిపై ప్రతిపక్షాలు ఏం అంటున్నాయి?

cryptocurrency
క్రిప్టోకరెన్సీ

Digital Rupee: ఇప్పుడు ప్రపంచమంతా క్రిప్టో కరెన్సీ, డిజిట్​ కరెన్సీలవైపే చూస్తోంది. భారత్​ కూడా ఇప్పుడు ఆ దేశాల జాబితాలో చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మన దేశంలో సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీని వివరాలేంటి? ఎలా చలామణి అవుతుందో పరిశీలిద్దాం.

భారత్​లో ఈ కరెన్సీని 'డిజిటల్​ రూపీ' అంటారు. కేంద్ర రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ) డిజిటల్ రూపంలోనే దీన్ని జారీ చేస్తుంది. ఇది భౌతిక కరెన్సీతో సమానం.

కేంద్ర బ్యాంకు డిజిటల్​ కరెన్సీ(CBDC) నియంత్రణకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ఇది డిజిటల్ లేదా వర్చువల్ రూపంలోనే ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంలో పుట్టుకొచ్చిన ఇతర క్రిప్టో కరెన్సీలు, ప్రవేటు వర్చువలక్​ కరెన్సీలతో మన డిజిటల్ కరెన్సీని పోలిక ఉండదు.

ప్రైవేట్ వర్చువల్ కరెన్సీని జారీ చేసేవారు ఉండరు కాబట్టి ఓ వ్యక్తికి చెందిన రుణంగా గానీ, పూచీకత్తుగా గానీ వాటిని పరిగణించలేం. అవి డబ్బు, కరెన్సీ కానే కాదు. అందుకే ఆర్​బీఐ ప్రైవేటు క్రిప్టో కరెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటి వల్ల జాతీయ భద్రతో పాటు, ఆర్థిక అస్థిరత ముప్పు ఉంటుందని చెబుతోంది.

రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్సీతో CBDC సమానమని ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ టీ రబి శంకర్​ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అయితే దాన్ని పేపర్​లా కాకుండా డిజిటల్​ రూపంలో ఉంటుందని చెప్పారు.

'ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే సార్వభౌమ కరెన్సీ, ఇది సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీగా(చెలామణిలో ఉన్న కరెన్సీ) కనిపిస్తుంది. CBDC అంతర్లీన సాంకేతికత, రూపం, ఉపయోగం నిర్దిష్ట అవసరాల కోసం దీన్ని రూపొందారు. ఇది నగదు(క్యాష్​)తో సమానం' అని రబి శంకర్ వివరించారు.

CBDCతో భారత్​లో డిజిటల్ కరెన్సీకి ఊతమిచ్చినట్లు అవుతుందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'డిజిటల్ కరెన్సీ మరింత సమర్థమైన, చౌకైన కరెన్సీ నిర్వహణ వ్యవస్థకు దారి తీస్తుంది. బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాం. దీన్ని 2022-23 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.' అని నిర్మల అన్నారు.

బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియా సమావేశంలోనూ ఈ విషయంపై మాట్లాడారు నిర్మల. ఆర్​బీఐ జారీ చేసేది మాత్రమే డిజిటల్​ కరెన్సీ అన్నారు. అది కాకుండా మిగత ఏ క్రిప్టోకరెన్సీ ద్వారా అయినా లావాదేవీలు జరిగితే వాటి లాభాల్లో 30శాతాన్ని పన్నుగా వసూలు చేస్తామని చెప్పారు.

బ్లాక్​ చైన్ టెక్నాలజీ అంటే ?

బ్లాక్​చైన్​ అనేది డేటా బేస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారాన్ని బ్లాకులుగా విభజించి ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తం చేశారు. ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా తస్కరించడం దాదాపు అసాధ్యం.

కేంద్రబ్యాంకు డిజిటల్ రూపాయిని తీసుకురావడానికి గల కారణాన్ని ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ రబి శంకర్ వివరించారు. ఇలాంటి కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా వినయోగంలోకి రాబోతోందన్నారు. కొన్ని దేశాలు పైలట్​ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాయని వివరించారు.

ఒక సర్వే ప్రకారం, పేపర్ కరెన్సీ వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు మరింత ఆమోదయోగ్యమైన ఎలక్ట్రానిక్ కరెన్సీని (స్వీడన్ లాగా) ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అందుకే ప్రైవేటు వర్చువల్ కరెన్సీ వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ప్రజల అవసరాలను తీర్చేందుకు దేశాలు డిజిటల్ కరెన్సీతో వస్తున్నాయని రబి శంకర్ పేర్కొన్నారు.

ప్రతిపక్షం ఏమంటోంది..?

అయితే కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్​ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనేలా కన్పించడం లేదని కాంగ్రెస్​ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ఎలాంటి చట్టం చేయకుండా బడ్జెట్​ ద్వారా క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయాలనుకోవడం పార్లమెంటరీ విధానానికి విరుద్ధమన్నారు.

భారతీయులు క్రిప్టో కరెన్సీలో ఎంత మదుపు చేశారంటే?

భారత్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో క్రిప్టోలో మదుపు చేసిన వారిలో భారతీయులే అత్యధికులు. తర్వాత అమెరికా, రష్యా మదుపర్లు ఉన్నారు. బ్రోకర్‌చూజర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకు 100 మిలియన్ల మంది క్రిప్టోలో మదుపు చేశారు. ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ నవంబరు నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లు కాగా.. దీంట్లో భారతీయుల వాటా 10 బిలియన్‌ డాలర్లు. మన దేశం నుంచి ఎక్కువ మంది రిటైల్‌ మదుపర్లే వీటిలో పెట్టుబడి పెట్టారు. బిట్‌కాయిన్‌, ఇథేరియం, లైట్‌కాయిన్‌, కార్డనో, డోజీకాయిన్‌.. వంటి వాటిలో ఎక్కువ మంది మదుపు చేస్తున్నారు. గత ఏడాది వ్యవధిలో వీరిలో కొంతమంది 100 శాతం వరకు రిటర్న్స్‌ అందుకున్నారు. ప్రస్తుతం క్రిప్టోలో భారత రిటైల్‌ మదుపర్లు మదుపు చేసిన విలువ 6.6 బిలియన్‌ డాలర్లు. ఇది 2030 నాటికి 15.6 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని నాస్కామ్‌ అంచనా వేసింది. అయితే, ఈ లెక్కల్ని ఆర్‌బీఐ తోసిపుచ్చింది. గణాంకాలను ఎక్కువ చేసి చూపుతున్నారని తెలిపింది. రిటైల్‌ మదుపర్లు రూ.1,000-2,000 మించి క్రిప్టోల్లో మదుపు చేయడం లేదని పేర్కొంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 300 క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. వీటిలో 10 భారత్‌కు చెందినవి. యునోకాయిన్‌, కాయిన్‌ డీసీఎక్స్‌, కాయిన్‌స్విచ్‌ కూబర్‌, జెబ్‌పే, వజీరిక్స్‌.. వీటిలో ప్రధానమైనవి. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను ఆదరించడంలో వియత్నాం తర్వాత భారతే ఉందని 'చైన్‌అనాలసిస్‌' అనే సంస్థ తెలిపింది. జులై 2020-జూన్‌ 2021 మధ్య భారత్‌లో క్రిప్టోకరెన్సీ 'అడాప్షన్‌ రేటు' 641 శాతం పెరిగిందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో డిజిటల్ రూపాయిని ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది కాకుండా మరే ఇతర క్రిప్టో కరెన్సీ ఉపయోగించినా లాభాల్లో 30శాతం పన్ను విధిస్తామని స్పష్టం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'భారత్​కు సొంత డిజిటల్ కరెన్సీ- క్రిప్టో ఆదాయంపై 30% పన్ను!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.