ETV Bharat / business

రానున్న బడ్జెట్​లో వీటిపై అదనపు భారం తప్పదా?

author img

By

Published : Jan 26, 2020, 1:31 PM IST

Updated : Feb 25, 2020, 4:22 PM IST

IMPORT TAX
రానున్న బడ్జెట్​లో వాటిపై అదనపు భారం తప్పదా?

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను అధిగమించేందుకు రానున్న బడ్జెట్​లో దిగుమతి సుంకాల పెంపుపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్ ఉత్పత్తులు సహా ఇతర ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల దిగుమతి సుంకాలను పెంచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

మరో వారంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని పెంచే దిశగా రానున్న బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశీయ తయారీ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దిగుమతి సుంకాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు, మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లు, పరిశ్రమల రసాయనాలు, విద్యుత్‌ దీపాలు, కర్రతో చేసిన ఫర్నిచర్‌, క్యాండిల్స్‌, ఆభరణాలు తదితర వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలు పెంచనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న రెండు వర్గాలు వెల్లడించాయి.

వీరిపై తీవ్ర ప్రభావం..

అయితే ఈ నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఛార్జర్లు, ఇతర మొబైల్‌ భాగాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఐకియా లాంటి రిటైల్‌ సంస్థలు కూడా చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో దిగుమతి సుంకాలు పెంచితే ఈ కంపెనీలపై అదనపు భారం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. బడ్జెట్‌ ప్రకటనతోనే దీనిపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి:అంకుర సంస్థల గోడు వినండి

Last Updated :Feb 25, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.