ETV Bharat / business

ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు!

author img

By

Published : Sep 16, 2021, 8:26 PM IST

Nirmala Sitaraman
నిర్మలా సీతారామన్​

బ్యాంకింగ్ రంగంలో ఎన్​పీఏల సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదించిన బ్యాడ్​ బ్యాంక్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకోసం ఏర్పాటు చేయబోతున్న జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (NARCL) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వెల్లడించారు. మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రసీదులకు ప్రభుత్వ హామీ ఇస్తుందని తెలిపారు. ఐదేళ్ల పాటు ఇది కొనసాగుతుందని వివరించారు. ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ 15 శాతం రుణాలకు నగదు రూపంలో చెల్లించనుండగా.. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీ కలిగిన సెక్యూరిటీ రసీదులను జారీ చేస్తుందని సీతారామన్​ తెలిపారు.

అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా రుణాల వసూళ్లు పెరిగాయని నిర్మలా సీతారామన్ వివరించారు. రికగ్నేషన్‌, రిజల్యూషన్‌, రీక్యాపిటలైజేషన్‌, రిఫార్మ్స్‌ వల్ల గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల మేర రుణాలు వసూలయ్యాయని పేర్కొన్నారు. 2018 మార్చి తర్వాత రూ.3.1 లక్షల కోట్లు రుణాలు రికవరీ అయినట్లు తెలిపారు. దేశీయ బ్యాంకులు కొన్ని ఏళ్లుగా ఎన్‌పీఏల సమస్య ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 నాటికి ఈ ఎన్‌పీఏల విలువ రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుదన్న అధ్యయనాల నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు గురించి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు.

ఇదీ చదవండి: బ్యాడ్​ బ్యాంక్​తో ఎన్​పీఏ సమస్యకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.