వ్యక్తిగత ఆదాయ పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం, పన్ను వసూళ్లు తగ్గడం వంటి కారణాలతో ఏర్పడిన ఆర్థిక లోటు ఇందుకు ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
వ్యక్తిగత ఆదాయ పన్ను భారాన్ని తగ్గించి, వినియోగ డిమాండ్ పెంచాలని గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువైంది. ముఖ్యంగా కార్పొరేట్ సుంకం 10 శాతం మేర తగ్గిస్తూ.. ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వాదన మరింత బలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు అనేది కష్టమైన పని అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
పన్ను భారం తగ్గింపునకు అడ్డంకులు ఇవే..
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13.80 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది.
ప్రభుత్వం ఆదాయాన్ని ఎక్కువగా సామాజిక భద్రతా పథకాలైన ఆయుష్మాన్ భారత్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆవాస్ యోజన వంటి వాటికి కేటాయించాల్సి ఉంది. ఈ పథకాలకు ఇప్పుడు అధికంగా నిధులు అవసరం. ఇదే సమయంలో పరోక్ష పన్నులు భారీగా తగ్గడం.. కార్పొరేట్ పన్ను తగ్గించడం వల్ల ప్రభుత్వంపై మరింత భారం పెరిగింది. ఇలాంటి సమయాల్లో పన్ను తగ్గిస్తే ఈ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు పన్ను మినహాయింపులను ప్రకటించింది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇస్తున్న విషయాన్ని విశ్వసనీయ వర్గాలు గుర్తుచేశాయి.
ప్రభుత్వం నెమ్మదిగా తక్కువ ఆదాయం ఉన్న వారికి పన్ను భారం తగ్గిస్తూ.. అధిక సంపన్నుల నుంచి అధిక పన్ను వసూలు చేస్తోంది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై.. గరిష్ఠ మార్జినల్ రేట్ను 39 శాతానికి.. రూ.5 కోట్లకు పైన ఆదాయం ఉన్న వారికి 42.74 శాతానికి పెంచుతూ.. 2019-20 బడ్జెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: పొదుపులో మహిళల రూటే సెపరేటు