ETV Bharat / business

'అనుమతిస్తే టీకా ట్రయల్స్ మళ్లీ ప్రారంభిస్తాం'

author img

By

Published : Sep 13, 2020, 5:34 AM IST

డీసీజీఐ అనుమతి ఇస్తే భారత్​లో ఆక్స్​ఫర్డ్ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను తిరిగి ప్రారంభిస్తామని సీరం సంస్థ పేర్కొంది. ఇప్పటికే యూకేలో ఈ ట్రయల్స్ పునఃప్రారంభమయ్యాయి. అయితే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో రాజీ పడకూడదని ఇటీవలి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు.

Will resume COVID-19 vaccine trials after DCGI nod: Serum Institute
'అనుమతిస్తే టీకా ట్రయల్స్ మళ్లీ ప్రారంభిస్తాం'

భారత్​లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్​ను తిరిగి ప్రారంభించేందుకు సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి అనుమతి వచ్చిన తర్వాత ట్రయల్స్ పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది.

యూకేలో ఇప్పటికే ఈ టీకా ట్రయల్స్ మళ్లీ మొదలయ్యాయి. వ్యాక్సిన్ ప్రయోగాలు సురక్షితంగానే ఉన్నాయని నియంత్రణ సంస్థ ఇచ్చిన అనుమతితో ట్రయల్స్ ప్రారంభించారు.

"భారత్​లో ట్రయల్స్ పునఃప్రారంభించేందుకు డీసీజీఐ అనుమతి ఇస్తే.. టీకా ప్రయోగాలు మేం తిరిగి మొదలుపెడతాం."

-సీరం ఇన్​స్టిట్యూట్

వ్యాక్సిన్ తయారీలో హడావుడి ఉండకూడదని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రాజీ పడకూడదని ఇటీవలి సంఘటనలు ఉదహరణగా నిలుస్తున్నాయని అన్నారు. ట్రయల్స్ పూర్తిగా ముగిసే వరకు టీకాపై తుది నిర్ణయానికి రాకూడదని అన్నారు.

ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకా మానవ ప్రయోగాలు రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రారంభమయ్యాయి. టీకా తీసుకున్న ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల ట్రయల్స్ తొలుత నిలిపివేశారు. దీంతో భారత్​లోనూ ఈ ప్రయోగాలు నిలిపివేయాలని సీరం సంస్థను డీసీజీఐ ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.