ETV Bharat / business

రికార్డు స్థాయి జీఎస్​టీ వసూళ్లకు కారణాలివే..

author img

By

Published : Apr 2, 2021, 1:38 PM IST

Record GST collection due to economic recovery and increased compliance, says Tarun Bajaj
రికవరి దిశగా ఆర్థిక వ్యవస్థ.. పెరిగిన జీఎస్టీ వసూళ్లు

కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శి తరుణ్​ బజాజ్​ తెలిపారు. ఈ నేపథ్యంలోనే జీఎస్​టీ వసూళ్లు భారీగా పెరిగాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో జీఎస్​టీ వసూళ్లు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు సాధించినట్లు రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శి తరుణ్​ బజాజ్​ వెల్లడించారు. వీటి మొత్తం రూ. 1 లక్షా 23 వేల 902కోట్లు ఉన్నట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

"మార్చి నెలలో జీఎస్​టీ వసూళ్లు పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకోవడమే కాక.. విరివిగా పెరిగిన సాంకేతికతను ఉపయోగించి వసూళ్లు చేస్తున్నాము. గడిచిన ఆరు నెలలుగా... ప్రతి నెల రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్​టీ నుంచి ఆదాయం సమకూరుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని ఆశిస్తున్నాము."

-తరుణ్​ బజాజ్​, రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శి

క్రమక్రమంగా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండటం ఆశకు ఊపిరిపోస్తుందని బజాజ్​ అన్నారు. ఇందుకు తగినట్లు ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని నమోదు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా 2.0ను సమర్థంగా ఎదుర్కోగలం..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయని తెలిపిన బజాజ్​.. వైరస్​ను సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఇందుకు తగిన వ్యాక్సిన్​లు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు భారత్​కు ఉన్నాయని చెప్పారు. వైరస్ కట్టడికి గతేడాది లాక్​డౌన్​ లాంటి చర్యలు చేపట్టామన్న ఆయన.. ప్రస్తుతం అలాంటివి అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి: '3 నెలల్లో రూ.20 వేల కోట్ల జీఎస్​టీ అక్రమాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.