ETV Bharat / business

'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్​ వ్యవస్థలో సంస్కరణలు'

author img

By

Published : Dec 12, 2021, 3:00 PM IST

PM Modi
PM Modi

PM Modi on Deposit Insurance: ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా గత ఏడేళ్లలో ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

PM Modi on Deposit Insurance: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. పేదలకు లబ్ధి చేకూర్చేలా గత ఏడేళ్లలో ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంకింగ్​ సంక్షోభంతో పదే పదే ఇబ్బంది పడ్డారని.. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి నవ భారత్​ కృతనిశ్చయంతో ఉందన్నారు.

Bank Deposit Insurance: 'డిపాజిటర్స్​ ఫస్ట్​: రూ.5 లక్షల వరకు గ్యారెంటీడ్​ టైమ్​-బౌండ్​ డిపాజిట్ ఇన్సూరెన్స్​ చెల్లింపు'పై దిల్లీలో నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, 2021 ఆమోదించిన కొన్ని రోజులకే.. లక్ష మందికిపైగా ఖాతాదారులు తమ డబ్బును తిరిగి పొందారని.. ఇది రూ.1300 కోట్లకుపైగా ఉంటుందని మోదీ తెలిపారు. మరో మూడు లక్షల మంది ఖాతాదారులు త్వరలో ఆర్‌బీఐ మారటోరియం కింద ఉన్న బ్యాంకుల్లో తమ డిపాజిట్లను పొందుతారని ప్రధాని హామీ ఇచ్చారు.

"ఏళ్ల తరబడి సమస్యలను పక్కదారి పట్టించే ధోరణి మన దేశంలో నెలకొంది. పేద, మధ్యతరగతి ప్రజలు.. బ్యాంకింగ్​ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ నయా భారత్​.. ఈ సమస్యలను పరిష్కరించాలనే కృతనిశ్చయంతో ఉంది. బ్యాంకింగ్​ రంగానికి ఈ రోజు చాలా ముఖ్యమైంది. 'డిపాజిటర్లు ఫస్ట్' కార్యక్రమం పేరు.. ఖాతాదారుల పట్ల, వారి అవసరాల పట్ల ప్రాధాన్యం, బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, డిపాజిటర్లలో నమ్మకాన్ని పెంపొందించడానికి మేము ఈ డిపాజిటర్లకు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాం."

- ప్రధాని నరేంద్ర మోదీ

Nirmala Sitharaman News: ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ కూడా పాల్గొన్నారు.

"కొవిడ్ మహమ్మారి సమయంలో దేశం కలిసిగట్టుగా పనిచేసింది. భారత్​ నిజంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థూల మార్గదర్శిగా మారే సమయం ఆసన్నమైంది. బ్యాంకింగ్ రంగంలోని భాగస్వామ్యపక్షాలన్నీ కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుంది. అలాగే అధిక రాబడిని పొందే ప్రయత్నం చేసే సమయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడులు ఎక్కువ రిస్క్‌తో వస్తాయి. కాబట్టి రిటర్న్‌ల కోసం ఆశపడే విషయంలో డిపాజిటర్లు అవగాహనతో వ్యవహరించాలి."

- శక్తికాంత్​ దాస్​ ఆర్​బీఐ గవర్నర్​

ఒక్కో బ్యాంకు ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ బీమా కవరేజీతో.. ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి రక్షిత ఖాతాల సంఖ్య మొత్తం ఖాతాల సంఖ్యలో 98.1 శాతంగా ఉంది. ఇది అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన 80 శాతం కంటే ఎక్కువ.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.