ETV Bharat / business

'ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో లాభాలెన్నో'

author img

By

Published : Mar 4, 2021, 7:52 PM IST

Bankers
బ్యాంకుల ప్రైవేటీకరణతో లాభాలేమిటి

ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంపై మాజీ బ్యాంకర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగం మరింత బలోపేతమవుతుందని, వృత్తి నిబద్ధత కూడా మెరుగవుతుందని అంటున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో కలిగే ప్రయోజనాలపై సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మాజీ ఛైర్మన్​ మోహన్​ టంక్సాలె, విజయా బ్యాంక్​ మాజీ సీఎండీ ఉపేంద్ర కామత్ 'ఈటీవీ భారత్'తో పలు కీలక విషయాలను పంచుకున్నారు.

ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగ సామర్థ్యం, వృత్తి నిబద్ధత మరింత మెరుగవుతుందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరు మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటీకరణ ప్రణాళికకు పూర్తి మద్దతు ఇస్తున్నారు.

'ప్రైవేటీకరణ వల్ల యాజమాన్యంలో మార్పు మాత్రమే కాదు.. బ్యాంకింగ్ రంగంలో ఉత్పాదకత మెరుగవుతుంది. యాజమాన్యం మారితే (ప్రైవేటుకు) ప్రభుత్వ నిర్ణయాధికారం తగ్గుతుంది. దీనితో బ్యాంకింగ్​ రంగంలో మరింత స్వేచ్ఛగా వ్యవహరించే వీలుంటుంది.' అని సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మాజీ ఛైర్మన్​ మోహన్​ టంక్సాలె అన్నారు. ఏటీఎంల నిర్వహణ కంపెనీ ఈపీఎస్​ ఇండియా ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 'ఈటీవీ భారత్​' అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరణ ఇచ్చారాయన.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ వృద్ధే ఉదాహరణ..

ప్రైవేటీకరణ వల్ల ఉపయోగాలను హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వృద్ధిని ఉదహరించి వివరిచారు మోహన్​ టంక్సాలె. బ్యాంక్ స్థాపించిన 30 ఏళ్ల లోపే ఎస్​బీఐ తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంక్​గా(వ్యాపార పరిమాణం పరంగా) అవతరించిందని తెలిపారు. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే అగ్రస్థానంలో ఉన్నట్లు వివరించారు. అగ్రస్థానంలో ఉన్న ఎస్​బీఐకి 100 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్నట్లు తెలిపారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్​ ఇండియాకూ 109 ఏళ్ల చరిత్ర ఉందని.. అయినా వ్యాపార పరిమాణం, బ్యాంక్ శాఖలు, ఏటీఎంల పరంగా ప్రైవేటు బ్యాంకులైన హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐల కన్నా వెనకబడి ఉన్నట్లు తెలిపారు.

ఉన్నత స్థాయిలో మార్పు ఉండదు కాబట్టే..

ప్రైవేటు సంస్థల్లో ఎక్కువ కాలం ఒక్కరే ఉన్నత స్థాయిలో కొనసాగుతారని.. బ్యాంకుల వృద్ధికి ఇదీ ఒక కీలక కారణమని ఆయన పేర్కొన్నారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సీఈఓగా ఆదిత్య పూరి రెండు దశాబ్దాలకుపైగా కొనసాగారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్న మాజీ బ్యాంకర్లలో విజయా బ్యాంక్​ మాజీ సీఎండీ ఉపేంద్ర కామత్​ కూడా ముందు వరుసలో ఉన్నారు.

నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వ బ్యాంక్లు పెద్ద సఖ్యలో ఉండటం వల్ల.. ప్రతి సంవత్సరం వేల కోట్లలో ప్రజాధనం వృథా అవుతోందని ఉపేంద్ర కామత్ పేర్కొన్నారు.

రాజ్యసభకు కేంద్రం సమర్పించిన ఇటీవలి డేటా ప్రకారం.. 2019 జూలైలో దేశవ్యాప్తంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని.. వాటి నష్టాలు దాదాపు రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేలిందని వివరించారు.

నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రోత్సహించాలా లేదా వాటి నుంచి తప్పుకోవాలనా అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారినట్లు 'ఈటీవీ భారత్​' తో చెప్పుకొచ్చారు ఉపేంద్ర కామత్​.

ఇలాంటి సమయంలో నష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి నిష్క్రమించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే కనీసం మూలధనాన్నైనా కాపాడుకోవచ్చన్నారు. ఆ మొత్తాన్ని మరెక్కడైనా వినియోగించేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు.

ప్రైవేటీకరణ కొత్త ఆలోచనేం కాదు..

ప్రభుత్వ బ్యాంక్​ల ప్రైవేటీకరణ కొత్త ఆలోచనేం కాదని.. మోహన్​ టంక్సాలె అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం వాటాను 50 శాతం కన్నా దిగువకు తగ్గించుకోవాలని 2014లో పీజే నాయక్​ కమిటీ సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు దాదాపు ప్రభుత్వ బ్యాంకులన్నింటిలో కేంద్రం వాటా 85 శాతం నుంచి 90 శాతం వరకు ఉన్నట్లు వివరించారు.

ఈ కారణంగా రెండు ప్రభుత్వ బ్యాంకులు, ఓ బీమా సంస్థను ప్రైవేటు పరం పరం చేయడం వల్ల మరింత వృత్తి నిబద్ధత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. భారతీయ రిజర్వు బ్యాంక్ కూడా ప్రభుత్వ బ్యాంకుల లానే ప్రైవేటు బ్యాంకుల నిబద్ధత ఉండేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం పని పరిపాలన మాత్రమే..

భవిష్యత్​లో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర ఎలా ఉండనుంది అనే అంశపై తీవ్రంగా జరుగుతున్న చర్చపై కూడా ఉపేంద్ర కామత్​ స్పందించారు. ఏ ప్రభుత్వం కూడా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉండకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం పరిపాలన మాత్రమే చేయాలన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం, దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలు ప్రభుత్వాధీనంలో ఉండాలని అన్నారు.

ప్రభుత్వం ఇప్పుడు సరైనా దారిలో పయనిస్తోందని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఉపేంద్ర కామత్​ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయం ఇలా..

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేటీకరించనున్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్​ఐసీలో 10 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నట్లు కూడా తెలిపారు.

ఇదీ చదవండి:ఆటో రిక్షాతో 'మొబైల్​ హౌస్'​.. మహీంద్రా ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.