ETV Bharat / business

BUSINESS IN LOCKDOWN PERIOD: కరోనా కాలంలో... దారి మార్చారు దూసుకెళ్లారు!

author img

By

Published : Jul 25, 2021, 8:17 AM IST

ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన సహజమే అయినా దాన్ని మించిన ఆలోచన అవసరం... అంటున్నారు ఈ వ్యాపారవేత్తలంతా. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వేలాది వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడిన వేళ వీరు మాత్రం ఉన్న వనరులతోనే కొత్తగా ఏం చేయొచ్చా అని ఆలోచించారు. పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో చకచకా మార్పులు చేశారు. ఫలితంగా, మాంద్యంలోనూ లాభాలు అందుకుంటూ తమ అనుభవపాఠాలతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు..!

even-during-lockdown-merchants-who-earned-crores-of-money
కరోనా కాలంలో... దారి మార్చారు దూసుకెళ్లారు!

ఆరుగురు కుర్రాళ్లు కలిసి ఒకటే కలగన్నారు. కృత్రిమ మేధ సాయంతో వంటింటిని స్మార్ట్‌గా మార్చేయాలని పదేళ్ల క్రితం ‘సెక్టార్‌క్యూబ్‌’ పేరుతో స్టార్టప్‌ పెట్టారు. రాత్రింబగళ్లు కష్టపడి స్పర్శ, సైగ, వాయిస్‌ కమాండ్‌లతో పనిచేసే స్మార్ట్‌ ఒవెన్‌ని తయారుచేశారు. మరీ ఇంత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ... మన మార్కెట్‌కి పనికిరాదన్నారు వ్యాపారులు. మనసొప్పకపోయినా ఆ సాంకేతికతని అమ్మేసి ఈసారి దేశీయ మార్కెట్‌కి ఉపయోగపడేలా పూర్తి ఆటోమేటిక్‌ రోటీమేకర్‌ని తయారుచేశారు. అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి హిట్‌ గ్యారంటీ అనుకుని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉండగానే కరోనా ముంచుకొచ్చింది. ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది. మరోపక్క డబ్బూ అయిపోయింది. కొన్నేళ్లపాటు పరిశోధించి తయారుచేసిన రెండు ప్రాజెక్టులూ బెడిసికొట్టేసరికి మిత్రబృందం మానసికంగా కుంగిపోయింది. సంస్థని మూసేద్దామనుకున్నారు.

‘సెక్టార్‌క్యూబ్‌’ సంస్థ సభ్యులు

వారంలో మూతపడాల్సింది...

లాక్‌డౌన్‌ వల్ల ఎలాగూ ఇంట్లో కూర్చోవడమే కాబట్టి కనీసం పేరుకైనా ఉద్యోగాన్ని ఉండనివ్వమన్నారు సిబ్బంది. సరేనని మూసివేతని వాయిదావేశారు. నిస్పృహనుంచి బయటపడడానికి విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని ఇళ్లనుంచే ప్రాజెక్టుల్ని చేయడం మొదలెట్టింది సాఫ్ట్‌వేర్‌ టీమ్‌. దాంతో మంచి ఆదాయం వచ్చింది. అది చూసి స్ఫూర్తిపొందిన రీసెర్చ్‌ టీమ్‌ ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేసి దేశంలోనే తొలిసారిగా వాయిస్‌కమాండ్‌తో పనిచేసే వాషింగ్‌మెషీన్ని తయారు చేసింది. దాన్ని కూడా ఐఎఫ్‌బీ కొనుక్కుంది. కష్టసమయంలో కంగారుపడకుండా సమయానికి తగిన నిర్ణయం తీసుకుంటూ సంస్థ ప్రదర్శించిన బృందస్ఫూర్తి పెట్టుబడిదారులనూ ఆశ్చర్యపరిచింది. ‘సంస్థని మూసివేయడమనే పొరపాటు చేయకుండా ఉన్నందుకు కరోనా ఏడాదిలో మా ఆదాయం ముందు ఏడాదికన్నా రెట్టింపైంది. ఇప్పుడు మా కల సజీవంగా ఉంది. ఎప్పటికైనా దాన్ని నెరవేర్చుకుంటాం’ అంటాడు ఈ మిత్రబృందానికి సారథి అయిన నిబు అలియాస్‌.

పాప్‌కార్న్‌... ఇంటికొచ్చింది!

పాప్‌కార్న్‌ చేసే మొక్కజొన్న గింజల్నీ, మసాలా దినుసులూ నూనెలతో పాటు అది తయారుచేసే పరికరాలనూ హోటళ్లకీ థియేటర్లకీ సరఫరాచేసేవాడు వికాస్‌ సూరి. దానికి తోడు మూడేళ్ల క్రితం సాధారణ పాప్‌కార్న్‌కి భిన్నంగా నాణ్యమైన ధాన్యంతో ప్రత్యేక మసాలాలతో ‘గౌర్మెట్‌ పాప్‌కార్న్‌’ తయారుచేసే ‘పాప్‌కార్న్‌ అండ్‌ కంపెనీ’ ప్రారంభించాడు వికాస్‌. దానికి మంచి ఆదరణ లభించింది. రెండు వ్యాపారాలూ కలిసి ఆదాయం కోట్లకు చేరింది. మరుసటి ఏడాది ఆ లాభాలు రెట్టింపు అవుతాయని ఆశపడిన వికాస్‌కి కరోనాతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హోటళ్లూ థియేటర్లూ మాల్సూ లేనప్పుడు పాప్‌కార్న్‌ కానీ అది తయారు చేసే సామగ్రి కానీ కొనేదెవరు... మొత్తంగా రెండు వ్యాపారాలూ ఆగిపోయాయి. అతని దగ్గర పనిచేస్తున్నవారంతా నిరుపేద గృహిణులు. వ్యాపారమే లేకపోతే వారికి జీతాలెలా... చూస్తూ వదిలేయనూ లేడు.

‘గౌర్మెట్‌ పాప్‌కార్న్‌’ తయారుచేసే ‘పాప్‌కార్న్‌ అండ్‌ కంపెనీ’ యజమాని వికాస్‌

ఆలోచనలతో వికాస్‌కి నిద్రపట్టేది కాదు. లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో అందరూ చిరుతిళ్లు తింటూ ఓటీటీతో కాలక్షేపం చేయడం చూసినప్పుడు మనసులో ఓ ఆలోచన మెదిలింది. ఏమీ చేయకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడమే మంచిదనుకున్నాడు. ఇంట్లోనే వేడివేడిగా తయారుచేసుకునేలా రకరకాల ఫ్లేవర్లలో ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ పాప్‌కార్న్‌ కిట్‌’ తయారుచేసి అమెజాన్‌లో అమ్మకానికి పెట్టాడు కానీ పాప్‌కార్న్‌ని ఆన్‌లైన్‌లో ఎవరైనా కొంటారా... అని ఆందోళనపడుతూనే ఉన్నాడు. కొద్దిరోజుల్లోనే అతడి ఆందోళన అర్థరహితమని తేలిపోయింది. ఆర్డర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. 2020 మార్చిలో మూతబడి డిసెంబరులో ఆన్‌లైన్‌లో మొదలైన వికాస్‌ పాప్‌కార్న్‌ వ్యాపారం నాలుగు నెలల్లోనే అంతకు ముందు ఏడాది రెండు వ్యాపారాలూ కలిసి తెచ్చినంత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కొత్తగా ఆలోచించమనీ, కొత్తదనాన్ని స్వాగతించమనీ పాఠాలు నేర్పింది కరోనా- అంటాడు వికాస్‌ సంతోషంగా.

సంక్షోభం తెచ్చిన సంతోషం

‘వాతావరణం బాగున్నప్పుడు మిగతా కార్లని దాటి ముందుకెళ్లడం చాలా కష్టం. అదే వర్షం వస్తే... తేలికే’ అనేవాడు కారు రేసుల్లో పాల్గొనే స్నేహితుడు. ఆ మాటలకి అర్థం ఇప్పుడుతెలిసింది’ అంటాడు వరుణ్‌. భార్య గజల్‌తో కలిసి అతడు స్థాపించిన ‘మమాఎర్త్‌’ ప్రస్థానమే అతడికి ఆ పాఠం నేర్పిందట. పెద్దలూ పిల్లల కోసం వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను సహజవనరులతో తయారుచేస్తున్న వీళ్ల కంపెనీ నాలుగేళ్లకే మంచి బ్రాండుగా పేరుతెచ్చుకుంది. ఆ ఏడాది ఏకంగా ఆరు రెట్లు అభివృద్ధి సాధించడంతో 2020 మార్చిలో ఈ దంపతులు వచ్చే ఏడాది వందకోట్లు గ్యారంటీ అన్న కలల్లో తేలిపోతున్నారు. ఆ కలల మీద నీళ్లు చల్లి వారిని వాస్తవంలోకి తెచ్చింది కరోనా. దుకాణాల్లో అమ్మకాలు జీరో అయ్యాయి. ‘అసలే వైరస్‌ భయంతో వణుకుతున్న ప్రజలు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్ని ఏం కొంటారు. కలలే కాదు, మొత్తంగా వ్యాపారమే క్లోజ్‌... అనుకున్నాం. ఇంట్లో ఒకరినొకరం పలకరించుకోడానికే భయమేసేది. అంతగా డిప్రెషన్‌లో కూరుకుపోయాం...’ అని చెబుతాడు వరుణ్‌.

భార్య గజల్‌తో వరుణ్

సరిగ్గా ఆ సమయంలో పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల్ని కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది ప్రభుత్వం. ఆ ఒక్క వార్తని ఆసరాగా చేసుకుని వ్యాపారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. కరోనా వల్ల వ్యక్తిగత శుభ్రత, వ్యాధి నిరోధకత్వం పెంచుకోవడం మీద శ్రద్ధ పెరగడాన్ని గమనించి ఉత్పత్తుల్లో వెంటనే మార్పులు చేసి విటమిన్‌-సి, పసుపులతో తయారైన ఫేస్‌వాష్‌లూ క్రీముల్ని ప్రవేశపెట్టడంతో అవి విపరీతంగా అమ్ముడుపోయాయి. డిమాండును తట్టుకోటానికి ఉద్యోగుల సంఖ్యని రెండున్నర రెట్లు పెంచాల్సి వచ్చింది. కరోనాకి ముందు ఆఫ్‌లైన్లో మూడువేల దుకాణాల్లో అమ్మితే తర్వాత పదివేల దుకాణాలకు విస్తరించారు. ఆన్‌లైన్లో అమ్మకాలు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. దాంతో వందకోట్ల ఆదాయం కల... 300 కోట్ల నిజం అయింది. అలా కరోనా సంక్షోభం తమకి సంతోషాన్నే పంచిందంటాడు ఇప్పుడు వరుణ్‌.

ఈ-ఆటో రూటు మారింది!

భవిష్యత్తు అంతా విద్యుత్‌ వాహనాలదే... అన్నమాట ఆ యువకుల్ని కొత్త బాట పట్టించింది. ఓలా, ఉబర్‌ లాంటి సంస్థలు ఆప్‌ సహాయంతో కార్లనీ ఆటోలనీ నడుపుతున్నట్లు తాము పర్యావరణహితమైన ఈ-ఆటోలను నడపాలనుకున్నారు మోహిత్‌ శర్మ, ఆకాశ్‌దీప్‌ సింగ్‌. 2017లో ‘ఓయె’ సంస్థను ప్రారంభించారు. భారీగా పెట్టుబడులూ వచ్చాయి. 2020 మార్చి నాటికి ‘ఓయె’ దగ్గర వెయ్యి వాహనాలు ఉండేవి. మూడు నగరాల్లో రోజుకు 20వేల రైడ్స్‌ తిరుగుతుండేవి. అలాంటిది లాక్‌డౌన్‌తో అన్నీ గోడౌన్‌కి చేరాయి. ‘అదో పెద్ద షాక్‌. అసలేం జరుగుతోందో అర్థమవడానికే రెండురోజులు పట్టింది. నిలదొక్కుకుంటున్నాం అనుకుంటున్నవేళ కరోనా మా నెత్తిన పిడుగులా పడింది’ అనే మోహిత్‌ని సరకు రవాణాకి మాత్రమే వాహనాలు బయట తిరగడానికి అనుమతి ఉన్న విషయం ఆలోచింపజేసింది. తామూ ఆ పనే చేస్తే... మొదట మనసొప్పలేదు. కానీ డ్రైవర్లు రోడ్డున పడకుండా చూడాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి వెంటనే వ్యాపారం రూటు మార్చారు.

మోహిత్‌, ఆకాశ్‌లు

ఆప్‌తో పని సాఫీగా సాగేది కానీ, సరకు రవాణా అలా కాదు, ఎవరెవర్నో బతిమలాడి వ్యాపారం తెచ్చుకోవాలి. సరకుని జాగ్రత్తగా సమయానికి చేర్చాలి. సంస్థ సారథులకే కాదు, డ్రైవర్లకీ అది కొత్తే. ఆ తేడాల్ని అర్థం చేసుకుని నెమ్మదిగా సవాళ్లని అధిగమించారు. జొమాటో, బిగ్‌ బాస్కెట్‌, గ్రోఫర్స్‌ లాంటి సంస్థల దగ్గరికి వెళ్లి సరకు రవాణా అవకాశాలు ఇవ్వమని అడిగారు. అందరికీ అప్పటికే ఆ పనిచేసే ట్రక్కులున్నాయి. వాటికన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ సరకును చేరవేస్తామని ఒక్కొక్కరికీ ఓపిగ్గా నచ్చజెప్పి ఒప్పించేసరికి సెప్టెంబరు వచ్చేసింది. ఆర్నెల్లు వృథా అయినా కష్టం ఫలించిందంటారు మోహిత్‌, ఆకాశ్‌లు. ఇప్పుడు ఐదు నగరాల్లో రోజుకి 21వేల రైడ్‌లూ 9వేల సరకు డెలివరీలూ చేస్తూ విజయపథంలో సాగిపోతున్న ‘ఓయె’ ఈ రంగంలో కరోనా ప్రభావం నుంచి త్వరగా కోలుకున్న స్టార్టప్‌గా నిలిచింది.

ఇటు నష్టం... అటు లాభం

స్కూలు, కాలేజీ, ఆఫీసులన్నా వాళ్ల లంచ్‌ బ్రేక్‌లన్నా గౌరవ్‌ రాఠోడ్‌కి చాలా ఇష్టం. అక్కడ దాదాపు ప్రతివారి చేతిలోనూ తమ కంపెనీ తయారుచేసిన టిఫిన్‌బాక్సో వాటర్‌బాటిలో ఉంటుంది మరి. గౌరవ్‌ ‘సెలో’ గ్రూపు డైరెక్టరు. పీవీసీతో చెప్పులు తయారుచేసే కంపెనీగా మొదలైన సెలో క్రమంగా రకరకాల ఉత్పత్తులను చేర్చుకుంటూ వచ్చింది. ఒక దశలో తోటి వ్యాపారవేత్తలు గౌరవ్‌ని ‘మీ కంపెనీ తయారుచేయనిది ఏదన్నా ఉందా అని వెక్కిరించేవారట. ఏదైనా ఒక్క వ్యాపారం మీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చేవారట. అదేమీ పట్టించుకోకుండా తనదైన దారిలో సాగుతూ గృహోపకరణాల సంస్థగా ఇంటింటా పేరొందిన ‘సెలో’నీ కరోనా బాగానే దెబ్బతీసింది. సంస్థకి ఎక్కువ ఆదాయం వచ్చేది... టిఫిన్‌ బాక్సులూ నీళ్ల సీసాలూ స్టీలు ఫ్లాస్కుల అమ్మకాల వల్లే. అలాంటిది ఏడాదిన్నరగా స్కూళ్లూ కాలేజీలూ జిమ్‌లూ ఆటలూ... ఏవీ లేవు. దాంతో దుకాణాల్లో వాటి అమ్మకాలు నిల్‌. మూణ్ణెల్లు ఉత్పత్తి కూడా జీరోనే. ఈ పరిణామాలతో సంస్థ ఆదాయానికి తీవ్రంగా గండిపడింది.

‘సెలో’ గ్రూపు డైరెక్టరు గౌరవ్‌ రాఠోడ్‌

కానీ గౌరవ్‌ కంగారుపడలేదు. ఇల్లు శుభ్రం చేసేందుకు వాడే రకరకాల ఉత్పత్తులపై దృష్టిపెట్టాడు. కరోనా వల్ల పనివాళ్లను మాన్పించి సొంతంగా ఇంటిపని చేసుకోవడం మొదలెట్టిన వాళ్లంతా వాటిని ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ తెగ కొన్నారు. అతడు ఊహించినట్లుగానే వాటి అమ్మకాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి. అలాగే భవిష్యత్తుకోసం సిద్ధం చేసుకున్న పింగాణీ డిన్నర్‌సెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. వాటికీ మంచి గిరాకీ వచ్చింది. దాంతో ఒక పక్కనుంచీ వచ్చిన నష్టాన్ని మరో పక్కనుంచీ భర్తీ చేయగలిగాడు. కరోనాకి ముందు 1500 కోట్లు ఆదాయం ఉండగా కరోనా ఏడాదిలోనూ దాదాపు అంతే ఆదాయాన్ని పొందగలిగింది సెలో. కోడిగుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదన్న సామెత ఎందుకొచ్చిందో నాకిప్పుడు అర్థమైంది, వ్యాపారాల్లో వైవిధ్యమే మమ్మల్ని నిలబెట్టింది- అంటాడు గౌరవ్‌.

పుస్తకాల లోటును ఆప్‌లు తీర్చాయి!

పాఠ్యపుస్తకాలు ప్రచురించే ‘ఎస్‌.చాంద్‌ పబ్లిషర్స్‌’ సంస్థకి మూడోతరం వారసుడు హిమాంశు. సెంట్రల్‌ బోర్డుల పాఠ్యపుస్తకాలతోపాటు సొంతంగానూ పలు సబ్జెక్టుల్లో పుస్తకాలు రాయించి ప్రచురించే ఈ సంస్థ దేశంలోనే రెండో పెద్ద ప్రచురణ సంస్థ. హిమాంశు ఆధ్వర్యంలో అది మరింతగా విస్తరించింది. మారుతున్న అవసరాల్ని గమనిస్తూ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులూ ఉద్యోగార్థుల కోసం ‘ఆన్‌లైన్‌ తయారీ’, ‘ఫ్లిప్‌ క్లాస్‌’ లాంటి డిజిటల్‌ సేవల్నీ మొదలెట్టింది. ‘అయినా మా ప్రధాన వ్యాపారం పాఠ్యపుస్తకాలే. అవి అమ్ముడుపోని రోజొకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కరోనా మా కళ్లు తెరిపించింది. ఏడాదిన్నరగా పుస్తకాలు దుకాణాల్లో గుట్టలుగా పడివున్నాయి’ అనే హిమాంశు పరిస్థితుల్ని అర్థంచేసుకుని వేగంగానే స్పందించాడు. ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు బోధన చాలా కీలకం. బడులు మూతపడినందువల్ల ఆ ఖాళీని తామే భర్తీ చేయాలనుకున్నాడు.

‘ఆన్‌లైన్‌ తయారీ’, ‘ఫ్లిప్‌ క్లాస్‌’ లాంటి డిజిటల్‌ సేవల్నీ ప్రారంభించిన హిమాంశు

కానీ ఆన్‌లైన్‌లో ఆ స్థాయి పాఠాలు చెప్పడానికి ఎంతో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు కావాలి. అలాంటివారిని వెతికి పట్టుకుని మ్యాథ్స్‌, సైన్స్‌ పాఠాలతో ‘లెర్న్‌ఫ్లిక్స్‌’ అనే ఆప్‌ తయారుచేయించాడు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా పాఠాన్ని అర్థమయ్యేలా చెప్పటమే కాక రివిజన్‌, ప్రాక్టీస్‌, అసెస్‌మెంట్లకీ అందులో అవకాశం ఉంటుంది. టీచర్లకీ పిల్లలకీ సంయుక్తంగా ఉపయోగపడేలా రూపొందించిన ‘మైల్‌స్టోన్‌’ అనే మరో అప్లికేషన్‌ని గతంలో తరగతి గదిలో వాడేవారు. దాన్ని కూడా ఆన్‌లైన్‌లోకి తెచ్చాడు. మార్కెట్లో ఉన్న ఆప్‌లు 15వేల నుంచి పాతిక వేల వరకూ వసూలుచేస్తుండగా ‘లెర్న్‌ఫ్లిక్స్‌’కి ఏడాదికి సబ్జెక్టుకి రెండున్నర వేలు చెల్లిస్తే చాలు. దాంతో దేశంలోని 250 పట్టణాల్లో విద్యార్థులు దీన్ని వాడుతున్నారనీ ఈ ఏడాది డౌన్‌లోడ్స్‌ 500శాతం పెరిగాయనీ బయట 86 దేశాల్లోనూ తమ ఆప్‌కి మంచి ఆదరణ లభిస్తోందనీ పుస్తకాల లోటును ఆప్‌లు తీరుస్తున్నాయనీ అంటాడు హిమాంశు.

ఇంటికే... ఇన్‌స్టంట్‌ చాయ్‌!

నితిన్‌ సలూజ, రాఘవ్‌ వర్మ... ఈ ఐఐటీయన్లు ఇద్దరూ ‘చాయోస్‌’ పేరుతో తేనీటి వ్యాపారం చేస్తున్నారు. రకరకాల మసాలా చాయ్‌లు అమ్మే రీటైల్‌ దుకాణాలను ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. భారతీయులు తేనీటి ప్రియులు కాబట్టి సీజన్‌తోనూ, సమయంతోనూ సంబంధం లేకుండా టీ తాగుతారు కాబట్టి ఈ బిజినెస్‌కి ఢోకాలేదనుకున్న సంస్థలు పెట్టుబడులు బాగానే పెట్టాయి. దానికి తగ్గట్టే సంస్థ కూడా క్రమంగా విస్తరిస్తూ లాభాలనూ పెంచుకుంటూ వచ్చింది. 2020 ప్రారంభం నాటికి వేర్వేరు నగరాల్లో టీ దుకాణాల సంఖ్య 84కి చేరింది. ఆ ఏడాది చివరికల్లా వందకోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నారు మిత్రులిద్దరూ. కానీ కరోనాతో దాదాపు నాలుగు నెలలు దుకాణాలు బంద్‌. ఆదాయం సున్నా. కానీ దుకాణాల అద్దెలూ, సిబ్బంది జీతాలూ తడిసి మోపెడయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేముందిలే అని చూస్తూ కూర్చోలేదు ‘చాయోస్‌’ టీమ్‌. ‘టేక్‌అవే’ విభాగాన్ని ప్రారంభించారు.

‘చాయోస్‌’ పేరుతో తేనీటి వ్యాపారం చేస్తున్న నితిన్‌ సలూజ

‘ఇంటి వద్ద కూర్చుని మీకిష్టమైన వేడి వేడి చాయ్‌ తాగండి’ అనే నినాదంతో కొవిడ్‌ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వీళ్లు మొదలెట్టిన ఇన్‌స్టంట్‌ టీ పార్సిల్‌ విధానానికి మంచి స్పందన వచ్చింది. టీ తాగేవాళ్లతో సమానంగా కొనుక్కుని పట్టుకెళ్లేవాళ్లూ పెరిగారు. అంతకన్నా ముందు ఈ మిత్రబృందం చేసిన మరో పని- కరోనా సంక్షోభం మొదలవగానే కొన్ని నెలలకు సరిపడా ముడిసరకును సిద్ధంగా ఉంచుకోవడం. దాంతో ఆన్‌లైన్‌ డిమాండునీ తట్టుకోగలిగారు. సరైన సిబ్బంది ఎంపిక కూడా తమకు కలిసివచ్చిందంటాడు నితిన్‌. ప్రజలు ఏది పడితే అది కొనే సమయం కాదిది. నమ్మకం ముఖ్యం. దాన్ని నిలబెట్టుకోబట్టే చాయోస్‌ 2019లో 70కోట్ల ఆదాయం పొంది, 2020లో కొన్ని నెలలపాటు దుకాణాలు మూసివేసినా మొదట అనుకున్నట్లే ఆదాయం 102 కోట్లు వచ్చింది... అంటాడు నితిన్‌.

సమయానికి తగు... నిర్ణయం

కరోనా ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని పెంచింది. పోషకాహారమూ, వ్యాయామాలతో వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలని చెప్పింది. అందుకే లాక్‌డౌన్‌ వేళ వర్చువల్‌ వ్యాయామ శిక్షణకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్‌ని సరైన సమయంలో క్యాష్‌ చేసుకుంది యూనికార్న్‌ స్టార్టప్‌ ‘క్యూర్‌ఫిట్‌’. 2016లో ప్రారంభమైన ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జిమ్‌లనూ హెల్త్‌ క్లినిక్‌లనూ నిర్వహించేది. భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరించి విస్తరణ దిశగా ప్రణాళికలు వేసుకుంటుండగా వచ్చింది మహమ్మారి. జిమ్‌లూ హెల్త్‌ క్లినిక్‌లూ అన్నీ ఉన్నపళంగా మూతబడ్డాయి. శిక్షకులకు పని లేదు. ఆదాయం సున్నా. అద్దెలూ జీతాలూ... ఖర్చులు మాత్రం యథాతథం. ఇంత దూరం వచ్చి వెనకడుగు వేయడానికి మనసొప్పదు. ముందుకెలా వెళ్లాలో తెలియదు. సంస్థ వ్యవస్థాపకుడైన ముకేష్‌ బన్సల్‌కి పగలూ రాత్రీ అదే ఆలోచన అయింది.

‘క్యూర్‌ఫిట్‌’ సంస్థ వ్యవస్థాపకుడు ముకేష్‌ బన్సల్‌

అదృష్టవశాత్తు అదే సమయంలో ఇళ్లలో ఉన్నవారు ఆన్‌లైన్‌లో వ్యాయామాలగురించి వెతుక్కోవడాన్ని గమనించిన ముకేశ్‌ అదేదో తానే చేయాలనుకున్నాడు. ధైర్యం చేసి రంగంలోకి దిగాడు. ప్రముఖ ట్రైనర్లతో లైవ్‌ క్లాసులు నిర్వహిస్తూ మరో పక్కన తమ దగ్గరున్న శిక్షకుల చేత ఆన్‌లైన్‌లో వ్యక్తిగత శిక్షణ ఇచ్చే ఏర్పాటుచేశాడు. వీలున్నప్పుడు చేసుకోవడానికి రకరకాల ఫిట్‌నెస్‌ వీడియోలు రూపొందించి ఆన్‌లైన్‌ లైబ్రరీ కూడా పెట్టాడు. సరైన సమయంలో వేగంగా స్పందించి చేపట్టిన ఈ చర్యలు చక్కని ఫలితాన్నిచ్చాయి. స్పోర్ట్స్‌వేర్‌ అమ్మేందుకు ‘కల్ట్‌ఫిట్‌’, పోషకాహారం గురించి చెప్పే ‘ఈట్‌ఫిట్‌’, మానసిక ఆరోగ్యం గురించి ‘మైండ్‌ఫిట్‌’... ఇలా వేర్వేరు ఆన్‌లైన్‌ విభాగాలను పెట్టి వ్యాపారాన్ని విస్తరించాడు. మిగతా జిమ్‌లన్నీ తాళాలేసుకున్న సమయంలో క్యూర్‌ఫిట్‌ మాత్రం వ్యాపారాన్ని విస్తరించడమే కాక, లాక్‌డౌన్‌ తర్వాత పది రెట్ల లాభాలనూ ఆర్జించి సంక్షోభాన్ని అనువుగా మలచుకోవడమెలాగో చేసి మరీ చూపించింది.

ఉపాయం లేనివాళ్లను ఊరినుంచి వెళ్లగొట్టాలన్నారు పెద్దలు. ఊహించని విధంగా ముంచుకొచ్చిన కరోనా ముప్పుని ఎదుర్కొనడంలో ఆ ఉపాయమే ఈ వ్యాపారవేత్తలను నిలబెట్టింది... కష్టకాలంలోనూ ముందుకే వెళ్ళగల ధైర్యాన్నిచ్చింది..!

ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.